కోల్‌కతా: దేశంలోనే తొలి అండర్‌వాటర్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని.. నిర్మాణానికి వందేళ్ల కిందటే ప్లాన్

ఏప్రిల్‌లో హుగ్లీ నది గుండా నిర్మించిన సొరంగ మార్గంలో మెట్రో ట్రయల్ రన్

ఫొటో సోర్స్, PTI

ఫొటో క్యాప్షన్, గత ఏప్రిల్‌లో హుగ్లీ నది గుండా నిర్మించిన సొరంగ మార్గంలో మెట్రో ట్రయల్ రన్

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నీటి అడుగున నిర్మించిన తొలి మెట్రో రైల్ సెక్షన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు (మార్చి 6న) ప్రారంభించారు.

కలకత్తా మెట్రో విస్తరణలో భాగంగా హౌరా మైదాన్ నుంచి ఎస్‌ప్లనేడ్ మెట్రో సెక్షన్ వరకు నిర్మించిన ఈ మార్గంలో, నది గుండా ట్రాన్స్‌పోర్ట్ టన్నెల్‌ను ఏర్పాటు చేశారు.

భారత్‌లో నది అడుగున నిర్మించిన తొలి ట్రాన్స్‌పోర్టల్ టన్నెల్ ఇదే.

కోల్‌కతా, హౌరా మధ్య ఉండే ఈ మార్గం హుగ్లీ నది గుండా సాగుతుంది.

విద్యార్థులతో ముచ్చటిస్తున్న మోదీ

ఫొటో సోర్స్, @PIB_India

ఫొటో క్యాప్షన్, అండర్‌వాటర్ మెట్రో రైలులో విద్యార్థులతో ముచ్చటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

ఈ మొత్తం మెట్రో ప్రాజెక్టు 16.6 కి.మీ. పొడవైన కారిడార్‌గా ఉంది. దీనిలో హౌరా మైదాన్ నుంచి ఎస్‌ప్లెనెడ్ మధ్యలో ఉన్న 4.8 కి.మీ. దూరంలో ఈ టన్నెల్‌ను ఏర్పాటు చేశారు.

దీనికోసం 2023 ఏప్రిల్‌లో హుగ్లీలో అండర్‌వాటర్‌ను పరీక్షించారు.

హౌరా, కోల్‌కతా చారిత్రక నగరాలని మెట్రో రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కౌశిక్ మిత్రా తెలిపారు. ఈ రెండు నగరాలను ప్రస్తుతం హుగ్లీ నది గుండా వెళ్లే మెట్రోతో కలుపుతున్నారు. ఈ మార్గంలో మొత్తం 12 స్టేషన్లు ఉన్నాయి.

హుగ్లీ నదిలో 30 మీటర్ల దిగువన మెట్రో టన్నెల్ ఉంది. ఈ మార్గం ప్రతి గంటకు 3 వేల మందికి పైగా ప్రయాణికులకు సేవలందించనుంది.

అండర్‌‌వాటర్ మెట్రో రైలు ప్రారంభోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి మోదీ రైలులో ప్రయాణించారు. వారితో ముచ్చటిస్తూ రైలు ప్రయాణం చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లాలో పుట్టిన సర్ హార్లే డిల్రింపుల్-హే

ఫొటో సోర్స్, INSTITUTION OF CIVIL ENGINEERS ARCHIVE, LONDON

ఫొటో క్యాప్షన్, పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లాలో పుట్టిన సర్ హార్లే డిల్రింపుల్-హే

తొలి అండర్‌వాటర్ మెట్రో నిర్మించాలని కలగన్న బ్రిటన్ ఇంజినీర్

కోల్‌కతా అండర్‌వాటర్ మెట్రో రైలు ప్రాజెక్టు వెనక ఆసక్తికరమైన చరిత్ర ఉంది.

1984 అక్టోబర్‌లో, దేశంలో మెట్రో రైలు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి భారత నగరంగా కోల్‌కతా (అప్పట్లో కలకత్తా) నిలిచింది.

కేవలం 3.4 కి.మీ. దూరంలో ఐదు స్టేషన్లతో ఈ మెట్రో రైలు వ్యవస్థ ప్రారంభమైంది. ప్రస్తుతం కోల్‌కతా మెట్రోలో సగం మేర మార్గం భూగర్భంలోనే నడుస్తోంది.

ఇప్పుడు అండర్‌‌వాటర్ మెట్రో రైలు మార్గాన్ని తీసుకొచ్చిన తొలి నగరంగా కూడా కోల్‌కతానే పేరు దక్కించుకుంది.

కలకత్తాను దాని జంట నగరమైన హౌరాతో కలిపేందుకు హుగ్లీ నదిలో సొరంగాన్ని నిర్మించి, 10 స్టాప్‌లతో నది అడుగున 10.6 కి.మీ. మేర రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేయాలని బెంగాల్‌‌లో పుట్టి పెరిగిన సర్ హార్లే డాల్రింపుల్-హే అనే ప్రఖ్యాత ఇంజనీర్‌ అప్పట్లోనే అనుకున్నారు.

కానీ, సరిపడా నిధులు లేకపోవడంతోపాటు నగరానికి చెందిన ‘జియోలాజికల్ ప్రాపర్టీల’ విషయంలో అనుమానాలు ఉండటంతో, ఈ ప్రణాళిక పట్టాలెక్కలేదు.

ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ అండర్‌‌వాటర్ మెట్రో రైలు మార్గం అందుబాటులోకి వచ్చింది.

సర్ హార్లే డిజైన్‌కు ప్రతిబింబం

తూర్పు కలకత్తాలోని హౌరా, సాల్ట్ లేక్‌లను కలుపుతూ ఉన్న పొడవైన రైల్వే మార్గంలో భాగమైన ఈ అండర్‌‌వాటర్ రైల్వే మార్గం, దాదాపు సర్ హార్లే 1921 డిజైన్‌ను ప్రతిబింబిస్తోంది.

సర్ హార్లే కేవలం ఒక్క మెట్రో లైన్‌నే డిజైన్ చేయలేదు. కలకత్తా కోసం పూర్తి భూగర్భ మాస్టర్ ప్లాన్‌ను ఆయన రూపొందించారు.

కలకత్తా ట్యూబ్ రైల్వేస్ పేరుతో రాసిన పుస్తకంలో ఆయన దీని గురించి పూర్తిగా వివరించారు. కలకత్తా మ్యాపులు, ప్రతిపాదిత మెట్రో లైన్ల డ్రాయింగ్స్, ట్యూబ్ రైలు ఖర్చులు ఏ మేర ఉండొచ్చనే అంచనాలన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి.

అన్ని స్టేషన్లలో ఎస్కలేటర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని కూడా ఈ బ్రిటిష్ ఇంజినీర్ ప్రతిపాదించారు.

భారత్‌లో తొలిసారి 1984 అక్టోబర్‌లో ప్రారంభమైన కోల్‌కతా మెట్రో రైలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, భారత్‌లో తొలిసారి 1984 అక్టోబర్‌లో ప్రారంభమైన కలకత్తా మెట్రో రైలు

‘‘రైళ్లలో సౌకర్యవంతమైన ఉష్ణోగ్రతలు ఉండేలా చూడటం ఎలా అనేది అతిపెద్ద ప్రశ్న. ఈ సమయంలో భూగర్భ స్టేషన్లు అత్యంత ఉపయోగకరంగా నిలుస్తాయి. ముఖ్యంగా కలకత్తాలో కొన్ని కాలాల్లో ఉపరితలంపై ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయి’’ అని సర్ హార్లే తన పుస్తకంలో రాశారు.

సర్ హార్లే తన కలకత్తా భూగర్భ రైల్వే ప్రణాళికను రూపొందించే సమయానికే, లండన్, పారిస్, న్యూయార్క్‌లలో భూగర్బ రైల్వేలు నడుస్తున్నాయి.

కోల్‌కతాలో అడుగు పెట్టకుండానే ట్యూబ్ రైల్వే ప్రణాళిక

సర్ హార్లే 1861లో పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లాలో జన్మించారు. యూకేలోని ఎడిన్‌బరోలో ఆయన ఇంజినీరింగ్ చదువుకున్నారు. ఆ తర్వాత లండన్ భూగర్భ రైల్వే వ్యవస్థలో చేరారు.

బేకెర్లూ లైన్, హ్యాప్‌స్టెడ్ ట్యూబ్, పికాడిల్లీ లైన్‌లో ఆయన పనిచేశారు. బ్రిటిష్ ఇండియాను ఇంపీరియల్ లెజిస్టేటివ్ కౌన్సిల్ పాలించేటప్పుడు, కోల్‌కతాకు ట్యూబ్ రైలు కావాలని నిర్ణయించారు. ఈ పనిని 1921లో సర్ హార్లేకి అప్పజెప్పారు.

కోల్‌కతా బ్రిటిష్ రాజ్‌కు రాజధాని కాదు. కానీ వాణిజ్యానికి మాత్రం ఇది ముఖ్యమైన కేంద్రంగా ఉండేది.

హౌరాలో ఫ్యాక్టరీలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ జంట నగరాల్లో పనిచేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు ఇక్కడికి తరలి వచ్చేవారు. కానీ, ప్రజా రవాణా వ్యవస్థ మాత్రం అంత విస్తారంగా ఉండేది కాదు.

అప్పట్లో కేవలం కోల్‌కతా నుంచి హౌరా వరకు రోడ్డు మార్గమమే ఉండేది. హుగ్లీ గుండా పాంటూన్ వంతెన ఉండేది. బోట్లలోనే ప్రజలు ఈ నది గుండా ప్రయాణించే వారు. హౌరా బ్రిడ్జి కూడా 1943లోనే ఏర్పాటైంది.

కోల్‌కతాలో అడుగు పెట్టకుండానే సర్ హార్లే ఈ నగరం కోసం ట్యూబ్ రైలు ప్రణాళికను రూపొందించారు. అవసరమైన సమాచారమంతా తీసుకు రమ్మని ఆయన అసిస్టెంట్‌ను ఇక్కడికి పంపించారు.

ఈస్ట్రన్ కోల్‌కతాలోని బాగ్మరిని హౌరాలో బెనారస్ రోడ్డుగా పిలిచే ప్రాంతాన్ని అనుసంధానిస్తూ ఉండేలా సర్‌ హార్లే తన తొలి సెక్షన్ రైల్వే నెట్‌వర్క్‌ను ప్రతిపాదించారు.

ఆ ప్రణాళిక ఎందుకు పట్టాలెక్కలేదు?

అప్పట్లో ఈ ప్రాజెక్ట్ ఖర్చును మూడున్నర మిలియన్ పౌండ్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.36 కోట్లు పైగానే ఉంటుందని అంచనా వేశారు. ఇది చాలా వ్యయంతో కూడుకున్నదని, దీనికి నిధులు అందించడం కష్టమని భావించారు.

నగరానికి చెందిన ట్యూబ్ రైలు కలలకు ముగింపు చెప్పాల్సి వస్తుందని పేర్కొంటూ డిసెంబర్ 1947లో కోల్‌కతా మున్సిపల్ గెజెట్‌, పత్రికల్లో తొలి పేజీ వార్తను ప్రచురించింది.

‘‘దీన్ని నిర్మించేందుకు అవుతున్న ఖర్చును పరిగణనలోకి తీసుకుంటే, ఈ రైల్వే ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గడమే మంచిది’’ అని ఈ ప్రాజెక్ట్ సమావేశం ముగిసిన అనంతరం మున్సిపల్ కౌన్సిలర్ చెప్పారు.

అలాగే, ఒండ్రు, బంకమట్టితో కూడిన ప్రాంతం, హుగ్లీ కింద టన్నెల్ నిర్మించేందుకు అనువైనవా, కాదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.

అలా, అప్పట్లో భారత్‌లో తొలి అండర్‌‌వాటర్ రైల్వే మాస్టర్ ప్లాన్ అధికారికంగా సమాధి అయిపోయింది.

సుమారు వందేళ్ల తర్వాత ఇప్పుడు నీటి అడుగున నడిచే మెట్రో రైలు ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

వీడియో క్యాప్షన్, కోల్‌కతాలో హుగ్లీ నదీ గర్భంలో పరుగులు తీస్తున్న మెట్రో

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)