ఈవీఎంలపై విమర్శలేంటి, ఓడినప్పుడే పేపర్ బ్యాలెట్ గుర్తుకొస్తుందా?

ఫొటో సోర్స్, Chandrababu, YS Jagan
- రచయిత, గరికపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
హరియాణా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పద్ధతికే మొగ్గు చూపాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇటీవల ఏపీలో వైసీపీ ఓడిపోయిన తరువాత కూడా జగన్ ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేశారు.
అయితే 2019లో మాత్రం ఆయన ఈవీఎంలను సమర్థించారు. మరోపక్క ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2019లో ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేశారు.
ఓడిపోయినప్పుడు మాత్రమే రాజకీయనాయకులకు ఈవీఎంలపై అనుమానాలు వస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
హరియాణాలో ఏం జరిగింది...?
హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో జరిగిన పరిణామాలపై దేశవ్యాప్తంగా చర్చజరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో తొలి గంటలో 71 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఆధిక్యం కొనసాగగా, ఈవీఎంల ఓట్ల లెక్కింపు తర్వాత కాంగ్రెస్ 38 సీట్లకే పరిమితమైంది.
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో వెనకబడినట్టు కనిపించిన బీజేపీ ఈవీఎంలలో ఓట్ల గణన తర్వాత 48 సీట్లతో విజయం సాధించింది. వరుసగా మూడోసారి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకుంది.
ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేశారు. ఇటు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏం జరిగిందో హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జరిగిందంటూ ఈవీఎంల పనితీరుపై మరోసారి విమర్శలు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
బ్యాలెట్టే వాడాలి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి
హరియాణా ఫలితాలపై స్పందించిన జగన్ ఈ ఫలితాలను ఏపీ ఎన్నికల ఫలితాలతో పోల్చారు.
“మరో ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేశాయి. హరియాణా ఫలితాలకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలకూ తేడా ఏమీ లేదు’’ అని వైఎస్ జగన్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
“ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాకుండా ఇంకా అభివృద్ధి చెందాలంటే తిరిగి బ్యాలెట్ ఎన్నికలకు వెళ్లడమే ఏకైక మార్గం. అభివృద్ధి చెందిన దేశాలు పేపర్ బ్యాలెట్నే ఎన్నికల్లో వినియోగిస్తున్నాయి. మిగిలిన దేశాలూ ఆ వైపు వెళ్లేలా మార్పులు చేసుకునేందుకు సమయం ఇది’’ అని జగన్ ఎక్స్లో పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, FB/ysrcpofficial
జగన్ 2019లో ఏమన్నారంటే..
జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో 2019 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తర్వాత ఈవీఎంలను సమర్థిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
“ఈవీఎంలో నొక్కిన ఓటు ఏ పార్టీకి వెళ్లిందో ఓటరుకు కనిపిస్తుంది. నేను పోలింగ్ బూత్లోకి పోయి ఫ్యాన్ గుర్తుకు ఓటేశా, కానీ వీవీప్యాట్లో సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఊరుకుంటానా? అక్కడే గొడవ చేస్తా కదా. అలా జరగలేదు. కౌంటింగ్ కేంద్రాలలో కూడా అన్ని పార్టీల పోలింగ్ ఏజెంట్లు ఈవీఎంలను చెక్ చేస్తారు. మరి ఏ రకంగా ఈవీఎంలు బాగోలేవని చెప్తారు. ఓడిపోతే ఈవీఎంల మీద నెపాన్ని నెట్టడం సరికాదు” అని 2019లో జగన్ అన్నారు.

ఫొటో సోర్స్, I&PR
అప్పట్లో చంద్రబాబుదీ ఇదే మాట..
2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం వివిధ సందర్భాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంలు, వీవీ పాట్ల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విమర్శలు చేశారు.
‘‘ఈవీఎంలు ప్రపంచంలో ఎక్కడా వాడరు. ఎందుకు వాడరంటే ఆటోమేటిక్గా మానిప్యులేట్ చేసేందుకు అవకాశాలుంటాయి. అందులో చిప్ ఉంటుంది. ఆ చిప్ ఎవరు డిజైన్ చేశారో వాళ్లకి దాన్ని కమాండ్ చేసే అధికారం ఉంటుంది. డిస్క్రిప్షన్ డీకోడ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యం కొంతమంది చేతిలో ఎందుకు పెట్టాలి? ఈ మధ్య డబ్బులు ఇస్తే గెలిపిస్తాం అని కొంతమంది బజారులో తిరుగుతున్నారు. ఎక్కడకి పోతోంది ప్రజాస్వామ్యం. ఇది దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలి’’ అని అప్పట్లో చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇప్పుడేమంటున్నారు?
ఇప్పుడు బ్యాలెట్ పేపర్లు అంటున్న వైఎస్ జగన్ 2019లో అలా ఎందుకు డిమాండ్ చేయలేదని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.
జగన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘2019లో ప్రజాభిప్రాయం ప్రకారమే ఫలితం వచ్చిందా?’’ అని జగన్ను నిలదీశారు. ‘‘ఏదైనా ఒక మాట మాట్లాడితే.. విశ్వసనీయత ఉండాలని’’ సూచించారు.
జగన్ స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా?: టీడీపీ
‘‘వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి ఈవీఎంలపై అభ్యంతరం చెప్పకుండా, 2019 ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధించినప్పుడు ఈవీఎంలు, వీవీ పాట్లు బాగున్నాయంటూ కితాబునిచ్చిన వైఎస్ జగన్ ఇప్పుడు ఈవీఎంలపై అభ్యంతరం వ్యక్తం చేయడం ఆయన అమాయకత్వానికి నిదర్శనం’’ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిథి డాక్టర్ ఎన్బీ సుధాకర్ రెడ్డి బీబీసీతో అన్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత జగన్ మాటలు చూస్తుంటే ఆయన స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా అనే అనుమానం వస్తోందని విమర్శించారు.
‘మాకే కాదు, చాలాపార్టీలకు అనుమానముంది’
‘‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై ఒక్క వైఎస్సార్సీపీకే కాదు.. దేశంలో ఎన్నో ప్రధాన రాజకీయ పార్టీలకు అనుమానాలున్నాయి. ఎందుకంటే ఎన్నికల ఫలితాల పోకడ విచిత్రంగా ఉంటోంది. హరియాణా ఎన్నికల ఫలితం తర్వాత ఆ అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయి. ఇదే టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు గతంలో ఈవీఎంలపై దారుణంగా విమర్శలు చేశారు. మరిప్పుడు ఆయన స్టాండ్ ఏమిటనేది బహిరంగంగా స్పష్టం చేయాలి’’ అని వైఎస్సార్సీపీ పూర్వ అధికార ప్రతినిధి, పార్టీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్ వెస్లీ అన్నారు.
ఓడితే సందేహం అంటే ఎలా? : బీజేపీ
2019 ఎన్నికల అనంతరం ఈవీఎంలు, వీవీ ప్యాట్లను బహిరంగంగా సమర్థించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత వాటిపై అనుమానాలు వ్యక్తం చేయడం ఆయన అవివేకానికి నిదర్శనం అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ విమర్శించారు.
‘‘గెలిస్తే సంతోషం.. ఓడిపోతే సందేహాలా జగన్’’ అని ఆయన ప్రశ్నించారు. తనను ప్రజలు తిరస్కరించారనే విషయాన్ని జీర్ణించుకోలేని జగన్ ఈసీపై నిందలు వేయడం మానుకోవాలని సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఓడినప్పుడే అనుమానాలొస్తాయి’’
‘‘రాజకీయ పార్టీలకు ఇదొక అలవాటుగా మారింది. ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లందరూ ఈవీఎంల పనితీరుపై విమర్శలు చేస్తున్నారు. ఓడిపోగానే పార్టీ క్యాడర్లో నైతిక స్థైర్యం నింపేందుకు ఇలాంటి మాటలు పనికొస్తాయి తప్ప వాటికి ఎలాంటి విలువా లేదు’’ అన్నారు రాజకీయ పరిశీలకులు సీహెచ్ కృష్ణాంజనేయులు.
‘‘2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్తో సహా 16 పార్టీలు ఈవీఎంలకు వ్యతిరేకమని ప్రకటించాయి. కానీ ఏమైనా ఉద్యమం చేశాయా అంటే లేదు. ఈవీఎంలను ఇప్పుడు విమర్శిస్తున్న వైఎస్ జగన్ ఎన్నికల ముందు ఎందుకు మాట్లాడలేదు? ఇదే జగన్ 2019లో ఈవీఎంలపై ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు?’’ అని కృష్ణాంజనేయులు ప్రశ్నించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














