నిందితుల ఫోన్లను పోలీసులు ఎందుకు అడుగుతుంటారు? వాటి నుంచి ఏం వివరాలు తీసుకోగలరు?

సజ్జల రామకృష్ణా రెడ్డి, పోలీసు కేసు, మొబైల్ ఫోన్, అమరావతి, టీడీపీ కేంద్ర కార్యాలయం,

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరై బయటకు వస్తున్న సజ్జల రామకృష్ణా రెడ్డి
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వాడిన ఫోన్‌ను తమకు ఇవ్వాలని గుంటూరు పోలీసులు కోరడం, ఆయన తిరస్కరించడం ఇటీవల చర్చనీయాంశమైంది.

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జలను ఏ120గా చేర్చారు గుంటూరు పోలీసులు.

ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డిని విచారించిన తర్వాత మంగళగిరి రూరల్ సీఐ వై.శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు.

‘‘సజ్జల రామకృష్ణారెడ్డిని మా వద్ద ఉన్న సమాచారాన్ని బట్టి ప్రశ్నించాం. ఆయన ఫోన్ ఇవ్వాలని అడిగాం. కానీ, ఆయన ఇవ్వలేదు’’ అని చెప్పారు.

గతంలో దిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఫోన్లను ఈడీ అధికారులు తీసుకున్నారు.

వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులోనూ కడప ఎంపీ వై.ఎస్.అవినాశ్ రెడ్డి వినియోగించిన ఫోన్ ఆధారంగా లొకేషన్, ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ కాల్ వివరాలను గుర్తించినట్లు 2023 ఫిబ్రవరిలో హైకోర్టులో వేసిన పిటిషన్‌లో సీబీఐ పేర్కొంది.

అసలు పోలీసులు ఎలాంటి సందర్భాల్లో ఫోన్లు అడుగుతారు? కేసు విచారణలో ఫోన్ సమాచారం ఎంత కీలకం? ఫోన్ తీసుకుని ఏయే అంశాలపై పోలీసులు విచారణ చేస్తారు?

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సజ్జల రామకృష్ణా రెడ్డి, పోలీసు కేసు, మొబైల్ ఫోన్, అమరావతి, టీడీపీ కేంద్ర కార్యాలయం,

ఫొటో సోర్స్, BRS

ఫొటో క్యాప్షన్, దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 2024 మార్చి15న ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది.

ఫోన్ ద్వారా తీసుకునే సమాచారం

ప్రస్తుతం మొబైల్ ఫోన్ వాడనిదే చాలా మందికి రోజు గడవదంటే అతిశయోక్తి కాదు.

దూరంగా ఉంటున్న వ్యక్తుల మధ్య మొబైల్ ఫోన్ (ఎక్కువగా స్మార్ట్ ఫోన్ ) ద్వారానే సమాచార మార్పిడి జరుగుతుంటుంది.

స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత నేర విచారణలో దాన్ని ఒక ఆధారంగా తీసుకుంటున్నారు పోలీసులు.

‘‘మొబైల్ ఫోన్ ద్వారా తీసుకున్న సమాచారం ఆధారంగా కోర్టుకు నివేదిక సమర్పించేందుకు వీలుంది. గతంలోనూ సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో మొబైల్ ఫోన్‌లోని వివిధ రకాల అంశాలను ఆధారాలుగా చూపి నిందితులుగా గుర్తించేందుకు వీలు కల్పించింది’’ అని హైదరాబాద్ సైబర్ క్రైం విభాగంలోని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.

సజ్జల రామకృష్ణా రెడ్డి, పోలీసు కేసు, మొబైల్ ఫోన్, అమరావతి, టీడీపీ కేంద్ర కార్యాలయం,

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నేరాల దర్యాప్తు, ఆధారాల సేకరణలో కీలకంగా మారుతున్న స్మార్ట్ ఫోన్లు

ఏమేం తెలుసుకోవచ్చంటే..

స్మార్ట్ ఫోన్ లేదా ఫోన్‌లోని సమాచారాన్ని విశ్లేషించి ఫోన్ కాల్ వివరాలు, లొకేషన్, వాట్సాప్ చాట్, ఎస్ఎంఎస్ వివరాలు తీసుకునేందుకు వీలుంటుంది.

కేసుల విచారణలో ఫోన్ ఇవ్వాలని పోలీసులు అడగడం వెనక చాలా కారణాలుంటాయని సైబర్ నిపుణుడు శ్రీధర్ నల్లమోతు బీబీసీతో తెలిపారు.

‘‘నిందితులుగా భావిస్తున్న వాళ్లు ఎవరికి కాల్స్ చేశారు? ఎంత సేపు వారితో మాట్లాడారు? ఏవైనా గ్రూప్ (వాట్సాప్) నిర్వహించారా? గ్రూపులో సభ్యులుగా ఉన్నారా? ఇలాంటి అంశాలను ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఫోన్ కాల్స్ ఎవరికి చేశారో తెలుసుకోవచ్చు గానీ, ఏం మాట్లాడారో తెలుసుకోవడం కష్టమవుతుంది. ముందుగా ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే ఏం మాట్లాడారో తెలుసుకోవచ్చు’’ అని శ్రీధర్ వివరించారు.

ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ముందుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని శ్రీధర్ చెప్పారు.

‘‘వాట్సాప్ కాల్‌కు సంబంధించి మెటా సంస్థ డేటా రిమూవ్ చేసినా కూడా గూగుల్‌ అకౌంట్‌లో వాట్సాప్ బ్యాకప్ స్టోర్ అవుతుంది’’ అని శ్రీధర్ చెప్పారు.

సజ్జల రామకృష్ణా రెడ్డి, పోలీసు కేసు, మొబైల్ ఫోన్, అమరావతి, టీడీపీ కేంద్ర కార్యాలయం,

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొన్ని కేసుల్లో మొబైల్ ఫోన్, సోషల్ మీడియా చాట్‌ల ద్వారా కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోంది.

ఆరు నెలల వరకే ఫోన్ కాల్ వివరాలు

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆరు నెలల వరకు కాల్ డేటా రికార్డింగ్ (సీడీఆర్) నిల్వ ఉంచాల్సిన బాధ్యత టెలికాం ఆపరేటర్లది.

దీనికి సంబంధించి 2018లోనే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది.

‘‘ఆరు నెలల లోపు కాల్స్ విషయంలో సీడీఆర్ తీసుకునేందుకు వీలుంటుంది. ప్రభుత్వ లేదా న్యాయస్థానం ఆదేశాలు ఉంటే తప్ప ఆరు నెలలు దాటిన సీడీఆర్‌ను టెలికాం ఆపరేటర్లు నిర్వహించాల్సిన అవసరం ఉండదు. వాట్సాప్, గూగుల్ టేక్ అవుట్ సర్వర్లలో చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది. వాటి ద్వారా సమాచారం పొందేందుకు వీలుంటుంది’’ అని నల్లమోతు శ్రీధర్ వివరించారు.

తొలగించిన సమాచారం రాబట్టే వీలుందా?

నేరానికి సంబంధించి అభియోగం మోపిన వ్యక్తి ఉద్దేశం ఏమిటి? నేరానికి సంబంధించి ఆధారాలు సేకరించవచ్చా? అన్న కోణంలో ఫోన్లను తీసుకునేందుకు పోలీసులు ప్రాధాన్యం ఇస్తారని ఎండ్ నౌ ఫౌండేషన్ చైర్మన్, సైబర్ నిపుణులు అనిల్ రాచమళ్ల బీబీసీకి చెప్పారు .

‘‘డిలీటెడ్ (తొలగించినవి), క్లౌడ్ బ్యాకప్.. ఈ రెండూ రాబట్టేందుకు పోలీసులు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. వీటి ద్వారా నేరానికి సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తారు. ఇలా తొలగించిన సమాచారాన్ని పోలీసుల వద్ద ఉన్న టెక్నాలజీని బట్టి ఎన్ని రోజుల వరకు అయినా తీసుకునేందుకు వీలుంటుంది. నిందితుడి నుంచి అనుమతి ఉంటే ఎక్కువ సమాచారం తీసుకోగలరు. యాప్ లాక్స్, పాస్‌వర్డ్స్ చెప్పకపోతే తక్కువగా వివరాలు తీసుకునేందుకు వీలుంటుంది’’ అని చెప్పారు.

‘‘కాంటాక్ట్ లిస్టు, ఎస్ఎంఎస్, ఎంఎంఎస్, మెయిల్స్, జీపీఎస్ అండ్ జీపీఎస్ లోకేషన్ హిస్టరీ, మల్టీ మీడియా ఫోటోలు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ హిస్టరీ, ఇంటర్నెట్ యాక్టివిటీ, యాప్స్ వివరాలు... ఇలా చాలా పద్ధతుల్లో సమాచారాన్ని పొందేందుకు వీలుంటుంది’’ అని అనిల్ రాచమళ్ల చెప్పారు.

సజ్జల రామకృష్ణా రెడ్డి, పోలీసు కేసు, మొబైల్ ఫోన్, అమరావతి, టీడీపీ కేంద్ర కార్యాలయం,

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫోన్లలో డిలీట్ చేసిన వివరాలను టెక్నాలజీ ద్వారా బయటకు తీయొచ్చు.

ఫోన్ తీసుకోవడం వ్యక్తిగత గోప్యత కిందకు వస్తుందా?

అభియోగం ఎదుర్కొంటున్న వ్యక్తి నుంచి అనుమతి లేకుండా ఫోన్ తీసుకునేందుకు పోలీసులకు వీలుండదు.

నిందితుల ప్రైవసీ (వ్యక్తిగత గోప్యత)కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అనిల్ రాచమళ్ల అభిప్రాయపడ్డారు.

ఇది ఐటీ చట్టంలోని సెక్షన్ 43ఏ ప్రకారం వ్యక్తిగత గోప్యత కిందకు వస్తుందని ఆయన చెప్పారు.

‘‘సాధారణంగా నిందితుల నుంచి ఫోన్లను వారి అనుమతితోనే తీసుకుంటాం. కేసు విచారణకు ఫోన్‌లోని ఆధారాలు తీసుకోవాలనుకుంటే, దానికి తగ్గట్టుగా మొబైల్ ఫోన్ ఇవ్వాలని నోటీసు ఇస్తాం. నేరాన్ని బట్టి అందులోని సమాచారాన్ని తీసుకునేందుకు ఫోన్ ఉపయోగపడుతుంది. ఫోన్ ఇచ్చిన తర్వాత దాన్ని సీజ్ చేసి....కోర్టుకు అందించి, అక్కడి నుంచి అనుమతి తీసుకుని అందులోని వివరాలను సేకరిస్తాం. కొన్ని సందర్భాల్లో నిందితుడి అనుమతితో అతని సమక్షంలోనే విచారణలో భాగంగా ఫోన్లోని వివరాలు తీసుకునేందుకు విచారణాధికారులు ప్రయత్నిస్తారు’’ అని హైదరాబాద్ సైబర్ క్రైం విభాగం అధికారి ఒకరు బీబీసీకి చెప్పారు.

కోర్టు అనుమతి తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ సాయంతో ఫోన్‌లోని సమాచారాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తారని ఆయన వివరించారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)