డోనల్డ్ ట్రంప్: 'మేం ఏం చేయడానికి వచ్చామో అది చేశాం... అంతకన్నా ఎక్కువే చేశాం'

ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పదవి నుంచి వైదొలగే ముందు వీడ్కోలు ప్రసంగం చేశారు. "మేం ఏం చేయడానికి వచ్చామో, ఆ పని చేశాం. అంతకన్నా ఎక్కువే చేశాం" అని ఆయన అన్నారు.

యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఆయన, "కఠినమైన యుద్ధాలు చేశాం. పోరాటాలు చేశాం. ఎందుకంటే, మీరు నన్ను అవి చేయడం కోసమే ఎన్నుకున్నారు కాబట్టి" అని ట్రంప్ అన్నారు.

ఇప్పటికీ ట్రంప్ నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలను పూర్తిగా అంగీకరించలేదు. బుధవారం నాడు జో బైడెన్ అధ్యక్ష పదవిని స్వీకరించబోతున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

గత రెండు వారాలు ట్రంప్ క్యాపిటల్ హిల్ మీద తన మద్దతుదారులు చేసిన దాడులకు సంబంధించిన పరిణామాలతోనే తలమునకలై ఉన్నారు. ఆయన మద్దతుదారులు ఎన్నికల ఫలితాలను తిరగరాయాలని కాంగ్రెస్‌లోకి చొచ్చుకొచ్చారు.

"రాజకీయ హింసను అమెరికా విలువలపై జరిగే దాడిగానే చూడాలి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే సహించేది లేదు" అని ట్రంప్ ఆ వీడియోలో అన్నారు. కానీ, ఆయన తన ప్రసంగంలో ఎక్కడా తన తరువాత అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న బైడెన్ పేరును ప్రస్తావించలేదు.

ట్రంప్

ఫొటో సోర్స్, AFP

ట్రంప్ ఇంకా ఏమన్నారు...

అమెరికన్ పార్లమెంటులోకి నిరసనకారుల "చొరబాట్లను ప్రేరేపించినందుకు" ట్రంప్ అభిశంసనకు గురయ్యారు. ఆయన పదవి నుంచి వైదొలగిన తరువాత సెనేట్‌లో విచారణ ఎదుర్కొంటారు. ఒకవేళ దోషిగా నిరూపణ అయితే, ప్రభుత్వ పదవులకు పోటీ చేయకుండా ఆయనపై నిషేధం విధించవచ్చు.

అమెరికా చరిత్రలో రెండు సార్లు అభిశంసనకు గురైన ఏకైక అధ్యక్షుడు ట్రంప్. నిజానికి, ఈ రాజకీయ ప్రేరేపిత హింసాత్మక ఘటనలతో అమెరికాలో దారుణంగా పెరుగుతున్న కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తెర వెనక్కి వెళ్లింది. ఈ వైరస్ ఇప్పటికే 2.4 కోట్ల మందికి సోకింది. నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు చనిపోయారు.

ట్రంప్ తన చివరి సందేశంలో, "ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆర్థిక వ్వవస్థను మా ప్రభుత్వం నిర్మించింది" అని చెప్పుకున్నారు.

అమెరికా స్టాక్ మార్కెట్లు కరోనావైరస్ దెబ్బకు తీవ్రంగా నష్టపోయినప్పటికీ 2020లో మళ్లీ పుంజుకున్నాయి నాస్‌డాక్ 42%, ఎస్&పి 500 సూచి 15% పెరిగాయి.

అయితే, మిగతా ఆర్థిక వ్యవస్థ మాత్రం సమస్యలతో సతమతమవుతోంది. డిసెంబర్ నెలలో ఉద్యోగాలకు భారీ సంఖ్యలో కోత పడింది. ఇటీవలి నెలల్లో రీటైల్ అమ్మకాలు బాగా పడిపోయాయి. నిరుద్యోగం పెరిగింది.

"రైటా లెఫ్టా లేక రిపబ్లికనా లేక డెమొక్రాటా అన్నది మా అజెండా కాదు. మెరుగైన దేశం అన్నదే మా అజెండా. దేశం అంటే పరిపూర్ణమైన దేశం" అని ట్రంప్ అన్నారు.

ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి నుంచి 34% జనామోదం రేటింగుతో నిష్క్రమిస్తున్నారు. ఇది అమెరికా చరిత్రలోనే అత్యల్పం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)