నీల్ మోహన్: ఈ యూట్యూబ్ కొత్త సీఈఓ ఎవరు

యూట్యూబ్ కొత్త సీఈఓ నీల్ మోహన్

ఫొటో సోర్స్, TOM WILLIAMS/CQ-ROLL CALL, INC VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, యూట్యూబ్ కొత్త సీఈఓ నీల్ మోహన్

భారత సంతతికి చెందిన నీల్ మోహన్, యూట్యూబ్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ (సీఈఓ)గా గురువారం బాధ్యతలు స్వీకరించారు.

గత తొమ్మిదేళ్లుగా యూట్యూబ్‌కు సీఈఓగా వ్యవహరించిన సూసన్ వోజిస్కీ రాజీనామా చేయడంతో నీల్ మోహన్ సీఈఓ అయ్యారు.

54 ఏళ్ల సూసన్ తన కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

తొమ్మిదేళ్ల క్రితం తాను యూట్యూబ్‌లో చేరినప్పుడు, మంచి లీడర్‌షిప్ టీంను ఏర్పాటు చేశానని, నీల్ మోహన్ ఆ బృందంలో భాగమని సూసన్ చెప్పారు.

నీల్ మోహన్ స్టాన్‌ఫోర్డ్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుకున్నారు. గూగుల్‌లో చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌గా పనిచేశారు.

అలాగే, మైక్రోసాఫ్ట్‌లో, 23అండ్‌మీ కంపెనీలో కూడా పనిచేశారు.

నీల్ మోహన్

ఫొటో సోర్స్, STEVE JENNINGS/GETTY IMAGES FOR TECHCRUNCH

ఫొటో క్యాప్షన్, నీల్ మోహన్

నీల్ మోహన్ ఎవరు?

భారతీయ సంతతికి చెందిన నీల్ మోహన్ అమెరికా నివాసి. ఆయన ఎక్కడ పుట్టారన్నదానిపై సమాచారం అందుబాటులో లేదు.

1996లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివారు. ఆ తరువాత 2005లో అదే యూనివర్సిటీ నుంచీ ఎంబీఏ చేశారు.

1996లో ఎక్సెంచర్‌లో సీనియర్ విశ్లేషకుడిగా కెరీర్ ప్రారంభించారు. తరువాత కొంతకాలం మైక్రోసాఫ్ట్‌లో, ఆపై ఐదేళ్ల పాటు డబుల్‌క్లిక్‌లో పనిచేశారు.

2008లో నీల్ మోహన్ గూగుల్‌లో చేరారు. అదే సమయంలో గూగుల్.. డబుల్‌క్లిక్‌ సంస్థను కొనుగోలు చేసింది.

నీల్ మోహన్ గూగుల్‌లో డిస్‌ప్లే, వీడియో ప్రకటనల విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు .

2015 నుంచి ఆయన యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. బయో-టెక్ కంపెనీ 23అండ్‌మి, వస్త్రాల తయారీ కంపెనీ స్టిచ్ ఫిక్స్‌లలో బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నారు.

సూసన్ వోజిస్కీ సోదరి ఆన్ వోజిస్కీ 2006లో 23అండ్‌మి సంస్థను స్థాపించారు. ఆన్ వోజిస్కీ గూగుల్ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ మాజీ భార్య.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

2021లో నీల్ మోహన్ యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా ఉన్నప్పుడే, యూట్యూబ్‌లో షార్ట్ వెర్టికల్ వీడియోల ఫార్మాట్‌ ప్రారంభమైంది. టిక్‌టాక్‌ను ఢీకొట్టడానికి దీన్ని తీసుకొచ్చారు.

నీల్ మోహన్ దీని గురించి 'ది వెర్జ్‌'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "2005లో యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన 'మీ ఎట్ ది జూ' వీడియో నుంచి దీనికి ప్రేరణ లభించిందని" చెప్పారు. ఇది కేవలం 18 సెకన్ల వీడియో. శాన్ డియాగోలోని ఒక జూలో తీసినది.

"అప్పటి కాలానికి, ఇప్పటి కాలానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు అందరి చేతుల్లో మంచి కెమేరాలు, ఎడిటింగ్ టూల్స్ ఉన్న మొబైల్ ఫోన్లు ఉన్నాయి. 15 ఏళ్ల క్రితం తీసిన వీడియో ఇప్పుడు తీస్తే, కచ్చితంగా మొబైల్‌లోనే తీస్తారు, హారిజాంటల్ కాకుండా వెర్టికల్‌లోనే తీస్తారు. నేను, నా టీం షార్ట్స్‌తో ఇదే చేయడానికి ప్రయత్నించాం" అన్నారు.

2019లో సుసాన్ వోజిస్కీ, నీల్ మోహన్ బృందం

ఫొటో సోర్స్, TOMMASO BODDI/GETTY IMAGES FOR YOUTUBE

ఫొటో క్యాప్షన్, 2019లో సుసాన్ వోజిస్కీ, నీల్ మోహన్ బృందం

సూసన్ వోజిస్కీ నీల్ మోహన్ గురించి ఏమన్నారు?

గూగుల్‌లో చేరిన ప్రారంభ ఉద్యోగుల్లో సూసన్ వోజిస్కీ ఒకరు. అధికారికంగా ఆమె గూగుల్‌లో ఎంప్లాయీ నంబర్ 16.

25 ఏళ్ల క్రితం గూగుల్ ప్రారంభమైనప్పుడు అందులో చేరాలనుకోవడం తాను తీసుకున్న "ఉత్తమ నిర్ణయం" అని సూసన్ అన్నారు.

గూగుల్‌లో ఆమె పలు పదవులు నిర్వహించారు. సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. గూగుల్ 2006లో యూట్యూబ్‌ను కొనుగోలు చేసింది. 2014లో సూసన్ యూట్యూబ్ సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు.

"నేను నీల్ మోహన్‌తో సుమారు 15 సంవత్సరాలు పనిచేశాను. ఆయన నాయకత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. యూట్యూబ్‌ను నీల్ మోహన్ మరింత ముందుకు తీసుకెళతారు. యూట్యూబ్ షార్ట్‌లు, స్ట్రీమింగ్, సబ్‌స్క్రిప్షన్‌లకు సంబంధించి కృత్రిమ మేధస్సుపై చేస్తున్న పనిలో రానున్న రోజుల్లో మరిన్ని సవాళ్లు ఎదువరువుతాయి. ఆ సమయంలో నీల్ సమర్థవంతమైన నాయకుడిగా నిరూపించుకుంటారని నా నమ్మకం" అన్నారు సూసన్.

నీల్ కొత్త బాధ్యతలను చేపట్టడంలో సహాయం అందిస్తానని, కొంతకాలం వరకూ కొన్ని బృందాలతో పనిచేస్తూనే ఉంటానని ఆమె చెప్పారు.

సూసన్ వోజిస్కీ

ఫొటో సోర్స్, MATEUSZ WLODARCZYK/NURPHOTO VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, సూసన్ వోజిస్కీ

భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు ప్రధాన పాత్ర పోషిస్తున్న టెక్ కంపెనీలు

యూట్యూబ్ సీఈఓ - నీల్ మోహన్

మైక్రోసాఫ్ట్ సీఈఓ - సత్య నాదెళ్ల (2014లో కంపెనీ సీఈఓ అయ్యారు. 2021లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయ్యారు.)

అడోబ్ సీఈఓ - శాంతను నారాయణ్ (2007లో సీఈఓ అయ్యారు. 2017లో చైర్మన్ అయ్యారు.)

ఆల్ఫాబెట్ (గూగుల్) సీఈఓ - సుందర్ పిచాయ్ (2015లో గూగుల్ సీఈఓ, 2019లో ఆల్ఫాబెట్ సీఈఓ అయ్యారు.)

ఐబీఎం - అరవింద్ కృష్ణ (2020లో సీఈఓ అయ్యారు. 2021లో కంపెనీకి చైర్మన్ అయ్యారు.)

వీమీఓ - అంజలీ సూద్ (2021లో సీఈఓ అయ్యారు.)

పెప్సికో సీఈఓ - ఇందిరా నూయి (12 సంవత్సరాల పాటు ఇందులో పనిచేసి, 2018లో రాజీనామా చేశారు.)

ట్విట్టర్ సీఈఓ - పరాగ్ అగర్వాల్ (2021 నవంబర్‌లో సీఈఓ అయ్యారు, ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన తరువాత రాజీనామా చేశారు.)

మైక్రాన్ టెక్నాలజీ - సంజయ్ మెహ్రోత్రా (2017లో కంపెనీ సీఈఓ అయ్యారు, దీనికి ముందు శాన్‌డిస్క్‌కి సీఈఓగా ఉన్నారు.)

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)