హిమాలయ గ్రామాల్లో నీళ్లు దొరకట్లేదు ఎందుకు? ‘ఐస్ స్తూపాల’తో నీటి ఎద్దడికి పరిష్కారం లభిస్తుందా?

ఐస్ స్తూపాలు

ఫొటో సోర్స్, University of Aberdeen

ఫొటో క్యాప్షన్, భారత ఇంజినీర్ సోనం వాంగ్‌చుక్ కనిపెట్టిన సాంకేతికతను అభివృద్ధి చేస్తున్న అబెర్డీన్ శాస్త్రవేత్తలు

హిమాలయాల్లో నీటి సమస్య పరిష్కారానికి ఒక కృత్రిమ గ్లేసియర్‌ డిజైన్‌ను అభివృద్ధి చేస్తున్నారు అబెర్డీన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు.

ఈ కృత్రిమ గ్లేసియర్లను 'ఐస్ స్తూపాలు' అని పిలుస్తున్నారు. నిజానికి 2013లోనే ఇంజినీర్ సోనం వాంగ్‌చుక్‌ దీన్ని కనిపెట్టారు. కానీ అదింకా ప్రారంభ దశలోనే ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

వసంత కాలంలో కరిగిన నీటిని ఈ మంచు స్తూపాలు విడుదల చేస్తాయి.ఆ నీటితో స్థానికులు పంటలు పండించుకోవచ్చు.

ఇలాంటి మంచు స్తూపాలను లద్దాఖ్‌లో ఏర్పాటు చేశారు. ప్రపంచంలో అత్యంత పొడిబారిన (arid place) ప్రాంతాల్లో ఇది ఒకటి.

అబెర్డీన్ క్రయోస్పియర్, క్లైమాట్ ఛేంజ్ పరిశోధన బృందం ఈ ప్రాంతంలో పని చేస్తోంది. సాంకేతికంగా దీన్ని మరింత అభివృద్ధి చేసి, మరింత మందికి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.

లద్దాఖ్‌లోని పర్వత హిమనీనదాలు వేగంగా కరుగుతున్నట్లు తమ పరిశోధనలో తేలిందని ప్రొఫెసర్ మట్టేవో స్పాన్నోలో చెప్పారు. ఇలాంటి మంచు స్తుపాలు ఏర్పాటు చేయడం చాలా అవసరమని ఆయన అన్నారు.

లద్దాఖ్

ఫొటో సోర్స్, Getty Images

హిమాలయ ప్రాంతంలో నీటి కొరత ఎందుకు?

ఏప్రిల్, మే నెలల్లో ఈ ప్రాంతంలోని చాలా గ్రామాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటాయని ఐస్ స్తూపా ప్రాజెక్ట్ చెబుతోంది.

రైతులు కొత్తగా వేసిన పంటలకు ఈ కాలంలోనే నీళ్లు అవసరం. సెప్టెంబర్ రెండోవారానికి చిన్న చిన్న కాలువల్లో నీళ్లు వస్తుంటాయి. కానీ ఆ సమయానికి సాగు పనులు దాదాపు పూర్తికావొస్తాయి. దాంతో వాళ్లకు ఆ నీళ్ల అవసరం పెద్దగా ఉండదు.

వాతావరణ మార్పుల వల్ల పరిస్థితి మరింత దిగుజారుతోంది. సహజ సిద్ధ గ్లేసియర్లు మాయమవుతున్నాయి.

ప్రపంచంలోని గ్లేసియర్లు చాలా వేగంగా కరిగిపోతున్నాయని ఏప్రిల్‌లో చేసిన ఒక అధ్యయనంలో తేలింది. గత 20 సంవత్సరాలుగా ఏడాదికి 270 బిలియన్ టన్నుల మంచు కరిగిపోయిందని అంచనా వేశారు.

లద్దాఖ్‌లోని గ్లేసియర్లు వేగంగా కుంచించుకుపోతున్నాయని న్యూదిల్లీ జవహర్‌లాల్ నెహ్రు యూనివర్శిటీతో కలిసి చేసిన అధ్యయనంలో అబెర్డీన్ బృందం గుర్తించింది.

తరచూ వస్తున్న కరవులతో పంటలకు నష్టం జరుగుతోంది. ప్రపంచంలో అత్యంత చలిగా, పొడిగా(arid) ఉండే ప్రాంతాల్లో ఇది ఒకటి. తరచూ కరవులు వస్తుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఐస్ స్తూపాలు

ఫొటో సోర్స్, University of Aberdeen

మంచు స్తూపాలు ఎలా పని చేస్తాయి?

శీతాకాలంలో మంచు కరిగినప్పుడు వృధాగా పోయే నీటిని నిల్వ చేసేందుకు ఈ మంచు స్తూపాలను ఉపయోగిస్తారు. వాతావరణం పొడిగా ఉన్న కాలంలో పైపుల్లో ఉన్న మంచు కరిగి నీళ్లు బయటకు వస్తాయి. ఆ నీటిని సాగునీటిగా, తాగునీటిగా స్థానిక ప్రజలు వాడుకోవచ్చు.

ముందుగా పైపులను మంచు కింద నేలలో పాతిపెడతారు. అలా కొంతదూరం వరకు పాతిపెట్టిన తర్వాత పైప్ చివరి భాగాన్ని భూమి ఉపరితలంపై నిటారుగా నిలబెడతారు.

ఎత్తు, ఉష్ణోగ్రత, గురుత్వాకర్షణ శక్తిలో తేడాల వల్ల పైపులో ఒత్తిడి క్రమంగా పెరుగుతుంది. కరిగిన నీరు మెల్లిగా పైకి వస్తుంది. నిటారుగా నిలబెట్టిన పైపు రెండో చివర నుంచి నీళ్లు ఫౌంటెన్‌లా బయటకు వస్తాయి.

ఆ ప్రాంతంలో ఉండే అతిశీతల గాలి ఆ నీటిని గడ్డకట్టేలా చేస్తుంది. క్రమంగా అదొక పిరమిడ్ ఆకారంలోని నిర్మాణంగా తయారవుతుంది.

ఐస్ స్తూపాలు

ఫొటో సోర్స్, University of Aberdeen

ఈ మంచు స్తుపాలు ప్రతి సంవత్సరం బిలియన్‌ల కొద్ది లీటర్ల నీటిని అందించగలవు. నీటి అవసరం ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అలాంటి ప్రాంతాల్లో వీటిని నిర్మించొచ్చు. అంటే పొలాలకు దగ్గరగా, గ్రామ శివార్లలో వీటిని ఏర్పాటు చేయొచ్చు.

పరిమాణం, ఆకారం కారణంగా వీటిని తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా నిర్వహించొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

అయితే, పైపుల్లో నీళ్లు గడ్డకట్టకుండా ఉండేందుకు మరింత మెరుగైన పద్ధతులను కనిపెట్టాల్సిన అవసరం ఉందని ఈ పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మరింత అధ్యయనం జరగాలని అన్నారు.

ఈ నీటిని సమర్థవంతంగా పంపిణీ చేసేందుకు స్థానిక అవసరాలు మరింత బాగా తెలిసుండటం చాలా ముఖ్యమని చెప్పారు.

ఐస్ స్తూపా ప్రాజెక్ట్ టీమ్‌లోని మా భాగస్వాములతో మేము కలిసి పని చేస్తున్నాం. సాంకేతికత, లాజిస్టిక్ సవాళ్లను ఎదుర్కొనేందుకు కలిసి కట్టుగా ప్రయత్నిస్తున్నామని ఈ పరిశోధన బృందానికి చెందిన డాక్టర్ అన్షుమన్ భరద్వాజ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)