టాయ్‌లెట్‌కి వెళ్లి మూత్రం పోస్తున్న ఆవులు..

మరుగుదొడ్డి వాడుతున్న ఆవు

ఫొటో సోర్స్, FBN

ఆవులు మరుగుదొడ్డి వాడటం నేర్చుకున్నాయి. మూత్రం పోసేందుకు టాయ్‌లెట్‌కి వెళ్తున్నాయి. జర్మనీ పరిశోధకులు చేసిన ఒక అధ్యయనంలో భాగంగా ఆవులు మరుగుదొడ్డికి వెళ్లడం ప్రారంభించాయి.

ఆవులకు టాయ్‌లెట్‌ శిక్షణనివ్వడంతో, గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను తగ్గించవచ్చని ఈ పరిశోధకులు తెలిపారు.

జంతువులకు నిర్దేశించిన మరుగుదొడ్డిని ఉపయోగించేలా జర్మనీలో జరిపిన అధ్యయనంలో శాస్త్రవేత్తలు శిక్షణ ఇచ్చారు.

ఆవుల మూత్రం నుంచి వచ్చే అమ్మోనియా మట్టితో కలిసినప్పుడు గ్రీన్‌హౌస్‌ వాయువు నైట్రస్ ఆక్సైడ్‌గా మారుతుంది.

ప్రపంచవ్యాప్తంగా మానవ కార్యకలాపాలకు సంబంధించి గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలలో 10శాతం పశువుల నుంచే వస్తుంది.

రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఫార్మ్ యానిమల్ బయాలజీకి చెందిన ఫార్మ్‌లో పరిశోధకులు 16 ఆవులకు టాయ్‌లెట్‌‌ను ఉపయోగించడం నేర్పించారు. ఈ టాయ్‌లెట్స్‌కు "మూలూ" అని పేరు పెట్టారు.

వీడియో క్యాప్షన్, వీడియో: టాయ్‌లెట్‌కి వెళ్లి మూత్రం పోస్తున్న ఆవులు..

తొలుత జంతువులను మూలూ దొడ్డిలో ఉంచారు. అక్కడ మూత్ర విసర్జన చేసిన ప్రతిసారీ వాటికి ఆహారం బహుమతిగా ఇచ్చారు.

తర్వాత, వారు మూలూ పక్కన ఉన్న ప్రాంతంలో ఆవులను ఉంచారు. మరుగుదొడ్డిలోకి వెళ్లి మూత్ర విసర్జన చేసినందుకు ఆహారాన్ని మళ్లీ బహుమతిగా అందజేశారు.

మూలూ వెలుపల మూత్ర విసర్జన చేసిన ఆవులకు శిక్షగా మూడు సెకన్ల పాటు వాటిపై నీటిని చల్లారు.

శిక్షణ మూడవ దశలో భాగంగా, టాయిలెట్ నుంచి దూరాన్ని పెంచారు. రివార్డులు, శిక్షలు కొనసాగించారు.

మరుగుదొడ్డి వాడిన ఆవులకు దాణాను ప్రోత్సాహంగా అందించారు

ఫొటో సోర్స్, FBN

ఫొటో క్యాప్షన్, మరుగుదొడ్డి వాడిన ఆవులకు ప్రోత్సాహంగా దాణాను అందించారు

10 శిక్షణా సెషన్‌లు ముగిసే సమయానికి, 11 ఆవులు విజయవంతంగా మరుగుదొడ్డిని ఉపయోగించడంలో శిక్షణ పొందినట్లు పరిశోధకులు గుర్తించారు.

"చాలా త్వరగా, సగటున 15 నుంచి 20 మూత్ర విసర్జనలు చేయడానికి కంటే ముందే, ఆవులు టాయ్‌లెట్‌లోకి వెళ్లడాన్ని ప్రారంభించాయి" అని అధ్యయనంలో పాల్గొన్న లిండ్సే మాథ్యూస్ రేడియో న్యూజిలాండ్‌తో అన్నారు.

"చివరికి, మూడో వంతు జంతువులు, మూడొంతుల మూత్ర విసర్జనను మరుగుదొడ్డిలో మాత్రమే చేస్తున్నాయి" అని ఆయన చెప్పారు.

"లేగ దూడలైతే.. పిల్లలతో సమానంగానూ, చాలా చిన్న పిల్లల కంటే మెరుగ్గాను పని తీరు కనబర్చాయి" అని అధ్యయనం తెలిపింది.

మూలూ వంటి మోడల్‌లో, 80శాతం పశువుల మూత్రాన్ని గ్రహించడం వలన అమ్మోనియా ఉద్గారాలు 56శాతం తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు.

జంతువులు నివాస ముండే ప్రదేశాల్లో మూత్ర స్థాయిలను తగ్గించడం వల్ల వాటి పరిశుభ్రత, సంక్షేమం మెరుగుపడుతుందని కూడా వారు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)