సిల్‌సిలా అలీఖిల్: అఫ్గాన్ రాయబారి కుమార్తె కిడ్నాప్‌‌లో భారత్‌పై ఆరోపణలు చేసిన పాకిస్తాన్ మంత్రి

సిల్‌సిలా అలీఖిల్‌

ఫొటో సోర్స్, NAjibalikhil/twitter

ఇస్లామాబాద్‌లో అఫ్గానిస్తాన్ రాయబారి కుమార్తె కిడ్నాప్ కావడం వెనుక భారత్ పాత్ర ఉండొచ్చని పాకిస్తాన్ హోం మంత్రి షేక్ రషీద్ అహ్మద్ ఆరోపణలు చేశారు.

పాకిస్తాన్‌లోని ప్రైవేటు టీవీ ఛానెల్ జీయోతో ఆదివారం రషీద్ మాట్లాడారు.

‘‘అఫ్గాన్ రాయబారి నజీబుల్లా అలీఖిల్ కుమార్తె సిల్‌సిలా కాలి నడకన ఇంటి నుంచి బయటకు వచ్చారు. మొదట ఆమె దగ్గర్లోని మార్కెట్‌కు వెళ్లారు. అక్కడి నుంచి ట్యాక్సీ తీసుకుని ఖేదా మార్కెట్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫుటేజీ మా దగ్గర ఉంది’’అని రషీద్ చెప్పారు.

‘‘ఆ తర్వాత ఆమెను అక్కడి నుంచి రావల్‌పిండీకి ఎలా తీసుకెళ్లారో తెలియడం లేదు. దీని వెనుక భారత్ హస్తం ఉందని భావిస్తున్నా. పాక్ పరువు, ప్రతిష్టలను దెబ్బ తీసేందుకు భారత్ ఇలాంటి ఘటనకు పాల్పడి ఉండొచ్చు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘ఈ ఘటన వెనుక ఏం జరిగిందో మేం ప్రపంచం మొత్తానికి తెలియజేస్తాం’’అని ఆయన వ్యాఖ్యలు చేశారు.

అపహరణ అనంతరం కొన్ని గంటలకు సిల్‌సిలాను విడిచిపెట్టారు. ప్రస్తుతం ఆమె పాకిస్తాన్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పాకిస్తాన్ హోం మంత్రి షేక్ రషీద్ అహ్మద్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ హోం మంత్రి షేక్ రషీద్ అహ్మద్

‘‘అలా చేయడం సరికాదు’’

మరోవైపు పాకిస్తాన్‌లోని రాయబారులందరినీ వెనక్కి పిలిపిస్తూ అఫ్గాన్ తీసుకున్న నిర్ణయాన్ని పాక్ ప్రభుత్వం తప్పుపట్టింది. అఫ్గాన్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేసింది.

‘‘నజీబుల్లా కుమార్తె కిడ్నాప్ అనంతరం పాక్‌లోని రాయబారులందరినీ వెనక్కి పిలిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’’అని అఫ్గాన్ విదేశాంగ శాఖ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘అఫ్గానిస్తాన్ ఇలా రాయబారులందరినీ వెనక్కి పిలిపించడం సరికాదు. సిల్‌సిలా కిడ్నాప్‌పై వేగంగా విచారణ చేపట్టాలని పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలు జారీచేశారు’’అని పాక్ విదేశాంగ శాఖ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘పాకిస్తాన్‌లోని అఫ్గాన్‌కు చెందిన అందరు రాయబారుల కుటుంబాలకు భద్రతను కట్టుదిట్టం చేశాం’’అని మంత్రిత్వ శాఖ తెలిపింది.

నజీబ్ అలీఖిల్

ఫొటో సోర్స్, NAjibullah alikhil/twitter

ఫొటో క్యాప్షన్, నజీబుల్లా అలీఖిల్

‘‘ఆయన్నుకూడా కిడ్నాప్ చేయాలని అనుకున్నారు’’

మరోవైపు ఈ విషయంపై అఫ్గాన్ రాయబారి నజీబుల్లాను పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శి కలిశారు. అఫ్గాన్ రాయబారులందరికీ కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

‘‘శనివారం మా అమ్మాయిని ఇస్లామాబాద్‌లో కిడ్నాప్ చేశారు. ఆమెను బాగా కొట్టారు. కానీ అల్లా దయ వల్ల ఆమె ఎలాగోలా బయటపడింది. ఇప్పుడు ఆమె బానే ఉంది. ఇది అమానవీయ చర్య. దీన్ని పాక్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను’’అని నజీబుల్లా ట్వీట్ చేశారు.

మరోవైపు గుర్తుతెలియని వ్యక్తులు నజీబుల్లాను కూడా కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని వార్తలు వచ్చాయి.

‘‘నిందితులు నజీబుల్లాను కిడ్నాప్ చేయాలని చూశారు. కానీ ఆ పని చేయలేకపోయారు. దీంతో ఆయన కుమార్తెపై దాడిచేసి పరారయ్యారు’’అని పాకిస్తాన్ పోలీసులు స్థానిక మీడియాతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)