అమెరికాలో భారీ సైబర్ దాడి: 200లకు పైగా కంపెనీలపై ప్రభావం, రష్యా గ్యాంగ్ పనేనా?

సైబర్

ఫొటో సోర్స్, Reuters

అమెరికాలో భారీ సైబర్ దాడి కారణంగా సుమారు 200 వ్యాపార సంస్థలపై ప్రభావం పడిందని సైబర్ సెక్యూరిటీ సంస్థ హంట్రెస్ ల్యాబ్స్ వెల్లడించింది.

ఫ్లోరిడా కేంద్రంగా పనిచేసే ఐటీ సంస్థ కెసెయాను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని.. ఆ తరువాత కెసెయా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్న కార్పొరేట్ నెట్‌వర్క్‌లకు వ్యాపించిందని హంట్రెస్ ల్యాబ్స్ తెలిపింది.

సైబర్ దాడిగా భావిస్తున్న ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న కెసెయా తన వెబ్‌సైట్ వేదికగా ప్రకటించింది.

రష్యాతో సంబంధాలున్న ఆర్ఈవిల్ రేన్సమ్‌వేర్ గ్యాంగ్ ఈ సైబర్ అటాక్ వెనుక ఉన్నట్లు తాము విశ్వసిస్తున్నామని హంట్రెస్ ల్యాబ్స్ చెప్పింది.

కాగా ఈ సైబర్ దాడిపై చర్యలకు ఉపక్రమించామని అమెరికా సైబర్ సెక్యూరిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ తెలిపింది.

చిప్

ఫొటో సోర్స్, Getty Images

కార్పొరేట్ సర్వర్లు, డెస్క్ టాప్ కంప్యూటర్లు, నెట్‌వర్క్ డివైస్‌లలో ఉపయోగించే తమ అప్లికేషన్ ద్వారా ఈ దాడి జరిగి ఉండొచ్చని కెసెయా చెబుతోంది.

తమ వీఎస్ఏ టూల్ ఉపయోగించి వెంటనే కస్టమర్లంతా సర్వర్లు షట్‌డౌన్ చేసుకోవాలని కోరింది.

200కి పైగా కంపెనీలపై ప్రభావం పడిందని హంట్రెస్ ల్యాబ్స్ చెబుతున్నప్పటికీ కెసెయా మాత్రం చాలా తక్కువ సంఖ్యలో సంస్థలు ఈ ప్రభావానికి గురయ్యాయని ఒక ప్రకటనలో పేర్కొంది.

ఏఏ కంపెనీలు ఈ ప్రభావానికి గురయ్యాయన్న విషయంలోనూ స్పష్టత లేదు. ఈ సమాచారం కోసం కెసెయాను బీబీసీ సంప్రదించగా వారు వివరాలు ఇచ్చేందుకు నిరాకరించారు.

కెసెయా సంస్థకు 10 దేశాలలో 10,000 మందికి పైగా వినియోగదారులు ఉన్నారు.

హ్యాకర్స్

ఫొటో సోర్స్, Getty Images

''ఇది భారీ వినాశకర సైబర్ దాడి'' అని హంట్రెస్ ల్యాబ్స్ సీనియర్ సెక్యూరిటీ రీసెర్చర్ జాన్ హ్యామండ్ 'రాయిటర్స్ వార్తాసంస్థతో చెప్పారు.

గత నెలలో జెనీవాలో జరిగిన ఒక సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైబర్ దాడుల విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రస్తావించారు. ఇలాంటి దాడులకు కళ్లెం వేయాల్సిన బాధ్యత రష్యా అధ్యక్షుడిపై ఉందని ఆయన అన్నారు.

ఇంధన, జలశక్తి వంటి 16 మౌలికవసతుల రంగాల జాబితాను పుతిన్‌కు ఇచ్చానని.. అవి దాడులకు గురికారాదని చెప్పానని బైడెన్ అన్నారు.

ఆర్ ఈవిల్ అనే రేన్సమ్‌వేర్ గ్యాంగ్ ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న సైబర్ గ్యాంగుల్లో ఒకటి.

అమెరికాలో మే నెలలో మాంసం సరఫరా సంస్థ జేబీఎస్ గ్రూపు నెట్‌వర్క్‌పై సైబర్ దాడి వెనుకా ఆర్ఈవిల్ ఉందని ఎఫ్‌బీఐ ఆరోపిస్తోంది.

సైబర్ దాడుల్లో తాము దొంగిలించిన డాక్యుమెంట్లను తమ వెబ్ సైట్ 'హ్యాపీ బ్లాగ్'లో పెడతామని ఈ ఆర్ఈవిల్ బెదిరించి డబ్బులు వసూలు చేస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)