WHO: భారత్‌లో కనిపించిన కోవిడ్ B.1.617 వేరియంట్ ప్రపంచానికే ఆందోళనకరం

B.1.617ను అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే వైరస్‌గా డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, B.1.617ను అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే వైరస్‌గా డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది

గత ఏడాది తొలిసారిగా భారతదేశంలో కనిపించిన కోవిడ్ B.1.617 వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ "అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే వైరస్"ల జాబితాలో చేర్చింది.

ఇండియాలో కనిపించిన B.1.617 వేరియంట్ ఇతర వేరియంట్ల కన్నా సులువుగా, వేగంగా వ్యాపిస్తుందని ప్రాథమిక పరిశోధనల్లో తేలినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.

ఇప్పటికే ఈ వేరియంట్ 30 దేశాలకు పాకినట్లు తెలిపింది.

బ్రిటన్, దక్షిణ ఆఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లను కూడా అదే జాబితా కింద వర్గీకరించారు.

ఒక మ్యూటేషన్‌ను 'వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్' నుంచి 'వేరియంట్ ఆఫ్ కన్సర్న్' (వీఓసీ) జాబితాలోకి చేర్చాలంటే.. సులువుగా సంక్రమించడం, తీవ్ర అనారోగ్యం, యాంటీబాడీల పనితనం పెద్దగా లేకపోవడం, చికిత్సకు స్పందించకపోవడం, వ్యాక్సీన్ ప్రభావం అంతగా లేకపోవడంలాంటి అనేక లక్షణాలలో ఒక్కటైనా కనిపించాలి.

ప్రస్తుతం భారతదేశంలో ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్‌కు ఈ వేరియంటే కారణమా అనే అంశంపై అధ్యయనాలు జరుగుతున్నాయి.

కరోనా వైరస్

భారత వేరియంట్ అని WHO చెప్పలేదు- భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ

B.1.617ను భారత వేరియంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో చెప్పలేదని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో కోవిడ్ B.1.617 వేరియంట్‌తో భారత వేరియంట్‌ అనే పదాన్ని జోడించలేదని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీనిపై ఆ శాఖ ట్విటర్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

"కోవిడ్ B.1.617 వేరియంట్‌ ప్రపంచానికే ఆందోళనకరమని ప్రపంచ ఆరోగ్యం సంస్థ చెప్పినట్లు చాల మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. B.1.617 వేరియంట్‌ను కొన్ని మీడియా సంస్థలు 'భారత వేరియంట్‌' అని కూడా వార్తలు ప్రసారం చేశాయి. ఈ వార్తలు నిరాధారమైనవి."

"ప్రపంచ ఆరోగ్య సంస్థ తన 32 పేజీల నివేదికలో B.1.617తోపాటూ 'భారత వేరియంట్' అనే మాటను ఉపయోగించలేదు. నిజానికి ఈ రిపోర్ట్‌లో అసలు 'ఇండియన్' అనే పదాన్నే ఉపయోగించలేదు" అని భారత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఏ వైరస్ వేరియంట్‌ను కూడా దేశం పేరుతో గుర్తించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వివరణ ఇచ్చింది.

ఒక వేరియంట్ మొదటిసారిగా కనిపించిన దేశాన్ని బట్టి దాన్ని ఆ పేరుతో వ్యవహరించడం లేదని, తాము వాటిని శాస్త్రీయ నామంతోనే వ్యవహరిస్తున్నామని, అందరూ అదే పద్ధతిని అనుసరించాలని కోరుతూ డబ్ల్యూహెచ్ఓ బుధవారం నాడు ట్వీట్ చేసింది.

భారత్‌లో కరోనా

ఫొటో సోర్స్, EPA

భారత్‌లో తగ్గిన కేసులు, పెరిగిన రికవరీ

సోమవారం భారతదేశంలో 3,66,161 కొత్త ఇంఫెక్షన్లు, 3,754 మరణాలు నమోదయ్యాయి.

అయితే, వాస్తవంలో ఈ గణాంకాలు ఇంతకన్నా చాలా ఎక్కువగా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

కేసులు పెరుగుతున్నాయంటే ఆక్సిజన్ కొరత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.

దేశ రాజధాని దిల్లీలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా పరిస్థితులు దిగజారుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో ఉన్న రుయా ఆసుపత్రిలో సోమవారం రాత్రి ఆక్సిజన్ అందక 11 మంది మరణించారు.

సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో 5 నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరా కొంత తగ్గడం వల్ల కోవిడ్ చికిత్స పొందుతున్నవారిలో 11 మంది మరణించారని చిత్తూరు జిల్లా కలెక్టరు హరినారాయణన్ చెప్పారు.

ఇండియన్ వేరియంట్‌కు, ప్రస్తుతం భారతదేశంలో తలెత్తిన కోవిడ్ సంక్షోభానికి సంబంధం ఉందని భారత ప్రభుత్వం అంటోంది. కానీ, అది నిజమని పూర్తిగా నిరూపణ కాలేదు.

దేశలో అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ విధించారు.

కాగా, ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.

కోవీడ్ కేసులు పెరుగుతున్నా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచార ర్యాలీలు నిర్వహించారు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కోవీడ్ కేసులు పెరుగుతున్నా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచార ర్యాలీలు నిర్వహించారు

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నా కూడా కుంభమేళా, ఎన్నికల ర్యాలీలు అనుమతించారని పాలక పార్టీ, ప్రధాని నరేంద్ర మోదీ కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు.

రాజధాని దిల్లీలో మరో మూడు, నాలుగు రోజులకు సరిపడా వ్యాక్సీన్లు మాత్రమే ఉన్నాయని సోమవారం దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.

వ్యాక్సీన్ కొరత కారణంగా దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి తీవ్ర ఆంటకం కలుగుతోంది.

ఇప్పటివరకూ దేశంలో సుమారు 3.5 కోట్లకు జనాభా అంటే 2.5 శాతం మందికి మాత్రమే కోవిడ్ టీకాలు వేశారు.

ప్రస్తుతం అందిస్తున్న వ్యాక్సీన్లు ఇండియన్ వేరియంట్‌పై కూడా సమర్థవంతంగా పనిచేస్తాయని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది.

అయితే, కొంతమందిలో అనుకున్నంత ప్రభావం కనిపించకపోవచ్చని డబ్ల్యూహెచ్ఓ టెక్నికల్ లీడ్ సోమవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)