కరోనావైరస్: తీవ్ర సంక్షోభం దిశగా పాకిస్తాన్.. ఈ కల్లోలాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తట్టుకోగలదా?

ఇ్రమాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సోహైల్ వఢైచ్
    • హోదా, బీబీసీ కోసం

యుద్ధం, సంక్షోభం లాంటి పరిస్థితుల్లో జనం అన్నీ మరిచిపోయి ఏకం కావడం అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగేదే. ఆ సమయంలో రాజకీయాలు, సామాజిక, మత విభేదాలు వదిలి అందరూ ప్రభుత్వానికి అండగా ఉంటారు. గతంలో పాకిస్తాన్‌కి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా దేశ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వం వెంట నిలిచేవారు.

1965లో భారత్‌తో యుద్ధం వచ్చినపుడు, జనరల్ అయూబ్ ఖాన్‌తో ఉన్న విభేదాలను మరిచిపోయి విపక్షాలు ఆయనకు సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. జుల్ఫికర్ అలీ భుట్టో సిమ్లా అగ్రిమెంట్ కోసం భారత్ వెళ్తున్నప్పుడు విపక్ష నేతలు ఆమెను కలిసి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

కశ్మీర్‌కు సంబంధించి ఎప్పుడు ఏం జరిగినా, పాకిస్తాన్‌లోని అన్ని రాజకీయ, మత, సామాజిక ఆలోచనా ధోరణికి చెందినవారందరూ ప్రభుత్వ విదేశాంగ విధానంపై ఏకాభిప్రాయానికి వచ్చారు. అలాగే కరోనావైరస్ వ్యాపిస్తున్న ఈ సమయంలో కూడా బిలావల్ భుట్టో రాజకీయ శత్రుత్వాన్ని వదిలి ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, ప్రభుత్వానికి అండగా నిలుస్తామని ప్రకటించారు.

షాహబాజ్ షరీఫ్, ముస్లిం లీగ్(నవాజ్) కూడా లండన్ నుంచి వెంటనే తిరిగొచ్చి తన సేవలు అందించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలనుకున్న మౌలానా ఫజుల్‌రహమాన్ అవన్నీ రద్దు చేసుకున్నారు. జమాత్ ఎ ఇస్లామి సిరాజుల్ హక్ కూడా ప్రభుత్వానికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

కానీ, ప్రభుత్వానికి విపక్షాల నుంచి ఇంత మద్దతు ఉన్నా, దేశంలో ఐక్యత, సమగ్రత కనిపించడం లేదు. దానికి బదులు పాకిస్తాన్ అంతటా ఒక రకమైన ఉద్రిక్తత కనిపిస్తోంది.

విపక్ష నేత బిలావల్ భుట్టో

ఫొటో సోర్స్, BILAWAL BHUTTO / TWITTER

ఫొటో క్యాప్షన్, విపక్ష నేత బిలావల్ భుట్టో

కల్లోలం ఎందుకు

దేశంలో ఒకవైపు కరోనా వినాశనం సృష్టిస్తుంటే, మరోవైపు సమాజంలో రాజకీయంగా, సామాజికంగా, బహిరంగంగా కల్లోల పరిస్థితి నెలకొన్నట్లు కనిపిస్తోంది.

పాకిస్తాన్‌లో రాజకీయ విబేధాలు ఇమ్రాన్ ఖాన్ పార్లమెంటరీ సమావేశం నుంచి లేచి వెళ్లిపోయినప్పుడే మొదలయ్యాయి. స్పందనగా బిలావల్ భుట్టో, షాహబాజ్ షరీఫ్ వాకవుట్ చేశారు. కానీ విషయం ఆ రాజకీయ చీలికలతో ఆగలేదు. అదే విధంగా సామాజికంగా, బహిరంగ స్థాయిలో రెండు పెద్ద గ్రూపులు వెలుగులోకి వచ్చాయి.

వాటిలో ఒకటి ఇమ్రాన్ ఖాన్, ఆయన ప్రభుత్వం చేపట్టిన పనులతో సంతృప్తి చెందినవారు. తాము సాధ్యమైనంత చేశామని అది చెబుతోంది. ప్రస్తుత ప్రభుత్వం వీటిని సమర్థమైన చర్యలు అని చెప్పుకుంటుంటే.. మిగతా గ్రూపుల ఆలోచన దానికి భిన్నంగా ఉంది.

రెండో గ్రూప్ కరోనా నియంత్రణ కోసం ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అమలు చేస్తున్న విధానాలపై అసలు నమ్మకం పెట్టడం లేదు. ఈయన ప్రధాన మంత్రిగా ఉంటే పాకిస్తాన్ బాగుపడడం అనేదే జరగదని చెబుతోంది.

కరోనా సంక్షోభ సమయంలో రాజకీయ నాయకత్వానికి మద్దతు లభిస్తే, సామాజికంగా, బహిరంగంగా ప్రజలు పరస్పరం కలవడం ప్రారంభమవుతుందని ఆశించారు. కానీ రాజకీయ నాయకుల్లో విభేదాల తర్వాత ప్రజల మధ్య ఉన్న చీలికలు ఇంకా పెద్దవి అయ్యాయి.

జమాత్ ఇ ఇస్లామ్ సేవలు

ఫొటో సోర్స్, JAMAT E ISLAMI / TWITTER

ఫొటో క్యాప్షన్, జమాత్ ఇ ఇస్లామ్ సేవలు

ఉద్రిక్తతలు పెరిగే అవకాశం

సోషల్ మీడియాను దేశంలో ప్రజల అభిప్రాయాలకు ప్రతినిధిగా భావిస్తే, అక్కడ ఈ రెండు గ్రూపుల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. అది బూతులు తిట్టుకునేవరకూ వెళ్లింది. ఇందులో కూడా ప్రభుత్వం మద్దతుదారులు చాలా దూకుడు ప్రదర్శిస్తున్నారు. అది ఆందోళనకరం.

ప్రభుత్వంతో ఏకీభవించని ప్రతి జర్నలిస్టుపై ఇక్కడ తిట్ల వర్షం కురుస్తోంది. అలాంటి వైఖరికి స్పందన కచ్చితంగా ఉంటుంది. సమాజం హింసామార్గంలో ప్రయాణిస్తుంది.

పాకిస్తాన్‌లో ఈ మహమ్మారి ఇలాగే వ్యాపిస్తూనే ఉంటే, దేశంలో ఆర్థిక సంక్షోభం మరింత భయంకరంగా మారుతుంది. ద్రోవ్యోల్బణం, నిరుద్యోగం మరింత పెరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మరింత అప్రతిష్ఠ మూటగట్టుకుంటుంది.

ప్రభుత్వం మాత్రం ఏమీ తెలీనట్టు ఉంటోంది. ఈ తీరు ఇప్పుడప్పుడే మారేలా కనిపించడం లేదు. అందుకే ప్రస్తుత ప్రభుత్వం ఎప్పుడు మారినా లేక గద్దె దించడానికి విపక్షాలు ఏవైనా ఆందోళనలకు దిగినా, అవి శాంతిపూర్వకంగా జరగడానికి బదులు హింసాత్మకం అవుతాయి.

షాహబాజ్ షరీఫ్

ఫొటో సోర్స్, PMLN

ఫొటో క్యాప్షన్, షాహబాజ్ షరీఫ్

1977 పరిస్థితే వస్తుందా?

ఇప్పటి పరిస్థితి చూస్తుంటే, 1977లో జరిగినట్లే అవుతుందేమో అనే ఆందోళన కూడా వ్యక్తం అమవుతోంది. అప్పుడు కూడా జనం రెండు గ్రూపులుగా విడిపోవడంతో నిరసనలు హింసాత్మకం అయ్యాయి. 1977లో ఆ హింసాత్మక ఆందోళనలు జాతీయ ఐక్యత పేరుతో జరిగాయి.

80, 90వ దశకంలో చాలా ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయి.. కానీ ఆ మార్పులన్నీ శాంతియుతంగా జరుగుతూ వచ్చాయి. ఎందుకంటే ప్రజలు రాజకీయంగా విడిపోయినా, శాంతి, ఐక్యతపై అందరికీ నమ్మకం ఉండేది.

అప్పటికి హింసాత్మక వైఖరి పెరగలేదు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో హింసాత్మక వైఖరిని చూస్తుంటే సామరస్యం కోసం ఏదైనా పెద్ద చర్య తీసుకోకపోతే, దేశం రాజకీయ అంతర్యుద్ధం వైపు వెళ్తుందేమో అనిపిస్తోంది.

దీన్నే సరిగా చెప్పాలంటే, కరోనా సంక్షోభ సమయంలో అయినా ఈ వైఖరి మారుండాల్సింది. ప్రస్తుత ప్రభుత్వానికి సయోధ్య, సామరస్యంతో ప్రయోజనం ఉంటుంది. బదులుగా విపక్షాలకు మాత్రం గొడవల వల్ల రాజకీయ ప్రయోజనం సిద్ధిస్తుంది.

రాజకీయాల్లో ఒక సిద్ధాంతం ఉంది. మనం అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ఉష్ణోగ్రతలు పరిమితికి మించి పెరగకుండా విపక్షాలు, శత్రువులను సంతోషపరిచే ప్రయత్నం చేస్తుండాలి.

అలాగే, విపక్షాలు కూడా రాజకీయ కల్లోలం వీలైనంత పెరుగుతూ వెళ్లాలని కోరుకుంటాయి. ఎందుకంటే ఒక సమయం వచ్చినపుడు ప్రభుత్వం దానిని భరించలేక, కుప్పకూలిపోతుంది.

సంక్షోభంలో పాకిస్తాన్

ఫొటో సోర్స్, FACEBOOK/PTIOFFICIAL

ఫొటో క్యాప్షన్, సంక్షోభంలో పాకిస్తాన్

ఇమ్రాన్ ఖాన్‌కు అంతా కలిసొచ్చిందా

ఇమ్రాన్ ఖాన్ గత రెండున్నరేళ్లలో చాలా అదృష్టవంతుడే అనిపించుకున్నారు. విపక్షాలు ఆయనకు పెద్దగా సవాలుగా నిలవలేకపోయాయి. ఇప్పుడు కరోనాలో విపక్షాలకు మౌనం తప్ప వేరే దారే లేకుండా పోయింది.

జూన్ వరకూ ప్రభుత్వం, విపక్షాలు ఇలాగే కొనసాగుతాయని స్పష్టంగా తెలుస్తోంది. అయితే, బడ్జెట్ ఆమోదం తర్వాత రాజకీయ పరిస్థితులు మలుపు తిరగవచ్చు.

రాజ్యాంగ స్థాయిలో ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఐదేళ్ల వరకూ పదవిలో ఉంటారు. ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి ఆయనకు పూర్తిగా ఐదేళ్లు కావాలి. కానీ ప్రతికూల పరిస్థితుల్లో పాకిస్తాన్ సంస్థలు, రాజకీయ పార్టీలు పరిస్థితిని ఎంతగా వేడెక్కిస్తున్నాయంటే.. ప్రభుత్వం ముందుకు వెళ్లడం కష్టంగా మారింది.

పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం ఇప్పటికీ బలహీనంగానే ఉంది. ప్రభుత్వ సంస్థలు తమ హద్దు మీరుతున్నాయి. అందుకే, విపక్షాలు లేదా సైన్యం, న్యాయవిభాగం లాంటి బలమైన సంస్థలు పరస్పరం ఒక నిర్ణయానికి వస్తే లేదంటే ప్రభుత్వం దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విఫలం అయ్యిందని అవి చాలా నిజాయితీగా (దీనిని కొలిచే ప్రమాణాలు ఇప్పటికీ దొరకలేదు) భావిస్తే, మార్పు తీసుకొచ్చే పని మొదలవుతుంది.

దేశంలోని విపక్షాలు, సంస్థలతో సయోధ్య చేసుకోడానికి లేదా తమ ప్రభుత్వం వైపు ఎవరూ వేలెత్తి చూపలేనంతగా పనితీరును మెరుగు పరచుకోడానికి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి బడ్జెట్ వరకూ సమయం ఉంది.

అప్పటికి, ఆ రెండూ జరగలేదే అనుకో.. దేశంలో మార్పు తీసుకొచ్చే పని మొదలైపోవచ్చు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)