తెలంగాణ లాక్‌డౌన్: గర్భిణులు, ఇతర రోగులు పడుతున్న ఇబ్బందులు ఇవీ..

తెలంగాణ లాక్‌డౌన్: గర్భిణీ స్త్రీలు, రోగులు పడుతున్న ఇబ్బందులు ఇవీ..
    • రచయిత, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మార్చి 28వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ముల్కపల్లి మండలంలోని పుసుగూడెం గ్రామంలో గుత్తి కోయ గర్భిణి ఒక బాబుకు జన్మనిచ్చింది. అయితే ఈ ప్రసవం ఆస్పత్రిలో జరగలేదు. ఒక మామిడి చెట్టు నీడన జరిగింది. ఈ ప్రసవం జరిగినప్పుడు ఆ మహిళకు సహాయం చేసిన ఆ గ్రామ నర్సు జ్యోతి బీబీసీ తెలుగుతో ఫోన్లో మాట్లాడి ఆ రోజు ఏం జరిగిందో వివరించారు.

‘‘ఏఎన్ఎం జ్యోతి, ఆశా వర్కర్ ధనలక్మి, అంగన్‌వాడీ టీచర్ దుర్గ, ముగ్గురూ ముల్కపల్లి గ్రామాల్లో కరోనా వైరస్ గురించి గ్రామస్థులకు అవగాహన కల్పించేందుకు వెళ్లారు.

పుసుగూడెం గ్రామంలో గుత్తి కోయలు ఉంటారు. వారు అక్కడ అడివిలో నివసిస్తారు. అక్కడ ముగ్గురు గర్భిణులు ఉన్నారు. అందులో ధులే ఒకరు. తన ప్రసవం తేదీ, ఏప్రిల్ ఏడో తారీఖున ఉండింది. కానీ మేము వెళ్లిన రోజే పొట్టలో నొప్పిగా ఉందని అనటంతో ఆస్పత్రికి తీసుకొని వెళదామని అనుకున్నాము.

అయితే పుసుగూడెం నుంచి ముల్కపల్లి వరకు దాదాపు 10 కిలోమీటర్ల దూరం. కాలి నడకన వెళ్ళాలి. దారి లేదు. అంబులెన్సు కానీ వాహనాలు రాటానికి దారి లేదు. డోలీ కట్టించి నిండు గర్భిణి అయిన ధులేను, కిందకు తెచ్చే ప్రయత్నం చేశాం. అయితే మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే నొప్పులు ఎక్కువై మధ్య మార్గం లోనే ఆపి, అక్కడే ఉన్న మామిడి చెట్టు నీడకి వాలి అక్కడ గుడ్డలు చుట్టి ప్రసవం చేయాల్సి వచ్చింది.

నిజానికి మా దగ్గర బొడ్డు పేగు కోసేందుకు కూడా ఏమి లేకుండే. ప్రసవం తర్వాత ధులేను, అప్పుడే పుట్టిన బిడ్డను డోలీలో ఎక్కించి, గబగబా ఆస్పత్రికి తీసుకొని వెళ్ళాం. ప్రసవం జరిగిన దగ్గర నుంచి ఆస్పత్రి ఒక 20 నిమిషాల దూరం కానీ ఆ గ్రామస్థులు డోలిని వేగంగా తీసుకొని వెళ్లారు" అని వివరించారు జ్యోతి.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

దేశంలో లాక్‌డౌన్ ఉన్నా, లేక పోయినా ఈ ప్రాంతాల్లోని గ్రామీణులు నిత్యావసర సదుపాయాల కోసం పడే ఇబందులు మారవు. కానీ, లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఇంకొంచెం పెరిగాయి. కొత్తగూడెం మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల గర్భిణులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రకటించిన లాక్‌డౌన్‌ వల్ల, కొంత మంది వేరే ప్రాంతాల్లో ఇరుక్కుపోయారు. గర్భిణులు ఆస్పత్రికి వెళ్ళ లేకపోతున్న సంఘటనలు కొన్ని అయితే, తల్లి దగ్గర ఉండి పోయి భర్త మరో చోట ఉండి పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘటనలు ఇంకొన్ని. అందులో కొంత మంది ట్విట్టర్‌ ద్వారా ప్రభుత్వ సహాయం అడుగుతున్నారు.

వై శివప్రియకు ఇప్పుడు తొమ్మిదో నెల. తన భర్త సునీల్‌తో కలసి విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉంటారు.

గత వారం, సునీల్‌కి సహాయం చేయాలని కోరుతూ అతని స్నేహితుడొకరు ట్వీట్ చేశారు.

సునీల్ బీబీసీ తెలుగుతో మాట్లాడుతూ, తన భార్య శివ ప్రియ నల్లగొండ పట్టణంలోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాల్సి ఉండిందని, అక్కడ కాన్పు కోసం ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిపారు.

"ఇప్పుడు ఈ లాక్‌డౌన్‌తో మేము ఇద్దరమే ఇక్కడ ఉండి పోయాం. ఇక్కడ ఒక డాక్టర్ ముందుకు వచ్చారు కాన్పు చేయడానికి. కానీ ఇది తనకు మొదటి కాన్పు. మాకు మా తల్లి తండ్రులు సహాయం చేస్తారు అని అనుకున్నాం. అయితే 15వ తేదీన లాక్‌డౌన్ తొలగిస్తే వారు అక్కడి నుంచి వచ్చేందుకు ఉంటది. కానీ ఇది ఇంకా కొనసాగితే, ఏం చేయాలన్నది మాకు పాలు పొవట్లేదు" అని అన్నారు సునీల్.

అయితే లాక్‌డౌన్ ఉండటంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని గుర్తించి వివిధ ఆస్పత్రులకు రిఫర్ చేసినట్టు అధికారులు తెలిపారు.

తెలంగాణ లాక్‌డౌన్: గర్భిణీ స్త్రీలు, రోగులు పడుతున్న ఇబ్బందులు ఇవీ..

గాంధీ ఆస్పత్రిని ఇప్పుడు కేవలం కరోనా వైరస్ రోగుల కోసం ఎక్కువగా వినియోగిస్తున్నందున అక్కడికి వస్తున్న గర్బిణులను కోఠీలోని మెటర్నిటీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. కానీ అందరికీ ఈ సమాచారం అందినట్టు కనపడలేదు. రెండు రోజుల క్రితం వివిధ వాట్సాప్ గ్రూపుల్లో ఒక సహాయం కోసం మెసేజ్ వచ్చింది. గర్భిణీ మహిళ పేట్లబుర్జ్ మెటర్నిటీ ఆస్పత్రికి వెళ్ళింది. కానీ అక్కడ లోపలికి కూడా రానివ్వలేదని ఆమెతో వెళ్లిన కుటుంబ సభ్యుడు వెంకటేష్ చెప్పారు.

"తను రోజువారీ కూలీ. గాంధీ ఆస్పత్రిలో ఇప్పటి దాకా చెక్అప్ చేయించుకుంది. కానీ కాన్పు టైంకి అక్కడ కరోనా వైరస్ వారిని చికిత్స చేస్తుండటంతో అక్కడికి వెళ్ళడానికి భయపడి ఇక్కడ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. అయితే మీడియా వారి జోక్యంతో ఆరోగ్య శాఖ మంత్రిగారి ఆఫీస్ నుంచి కాల్ చేసేటప్పటికి ఇక్కడ వారు వెంటనే స్పందించి అంబులెన్సు ఏర్పాటు చేసి మమల్ని కోఠీలోని మెటర్నిటీ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ వెంటనే స్పందించి, ప్రసవం చేశారు. పాప పుట్టింది" అని వెంకటేష్ వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో గర్భిణులకు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి అంగన్‌వాడీ ద్వారా పోషకాహరం ఇస్తున్నారు.

అయితే ఇప్పుడు లాక్ డౌన్ సమయంలో గర్భిణీ మహిళలకు పోషకాహారం వారి ఇంటికే అందించే ఏర్పాట్లు చేశామని శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.

అలాగే, లాక్‌డౌన్ సమయంలో గర్భిణుల ప్రసవాలకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పలుమార్లు చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో 3.75 లక్షల మంది గర్భిణీ మహిళలు నమోదు అయ్యారు. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు సమగ్రంగా పని చేసి నిరంతరం గ్రామాల్లో ఉన్న గర్భిణులను పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. అయితే, కాన్పు తేదీ దగ్గర్లో ఉన్న వారిని మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్ల ద్వారా గుర్తించి అవసరమైన వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకొని వెళ్లే ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ అధికారులు ఫీల్డులో ఉన్న వారికి ఆదేశించామని తెలిపారు.

పలు చోట్ల గర్భిణులకు సహాయం చేసేందుకు పోలీసులు కూడా ముందుకు వచ్చి ఆస్పత్రికి తరలించారు.

కేవలం గర్భిణులే కాదు వివిధ ఆరోగ్య సమస్యలతో ఉన్న రోగులు కూడా లాక్‌డౌన్ వల్ల ఇబందులు పడుతున్నారు. డయాలిసిస్ చేయించుకోవాల్సిన వారు, లుకేమియా పేషెంట్లు, ఇలా వివిధ దీర్ఘ కాలిక సమస్యలతో బాధపడుతూ, నిత్యం ఆరోగ్య సేవలు కావాల్సిన వారు కూడా ఉన్నారు.

కొందరు ప్రైవేటుగా చేయించుకోగలిగిన స్థోమత ఉన్న వారు చేయించుకుంటున్నారు. లేని వారు ఇబందులు పడుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు సోషల్ మీడియా ద్వారా అర్జీలు పెట్టుకొంటున్నారు. అవి మంత్రుల దృష్టికి వెళితే, వారి స్పందనతో సహాయం పొందుతున్నారు. లేని వారికి ఆలస్యం అవుతోంది.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)