కరోనావైరస్‌: చైనా 'ప్లేగ్ ఇంక్' వీడియోగేమ్‌ను ఎందుకు నిషేధించింది

ప్లేగ్ ఇంక్ గేమ్

ఫొటో సోర్స్, PLAGUE INC

ఫొటో క్యాప్షన్, ప్లేగ్ ఇంక్ గేమ్

ఒక ప్రాణాంతక వైరస్‌ను ప్రపంచమంతా వ్యాపింపజేయాలని ప్లేయర్లను సవాల్ చేసే ఒక వీడియో గేమ్‌ను చైనా నిషేధించిందని గేమ్ తయారీదారులు చెప్పారు.

చట్టవిరుద్ధమైన కంటెంట్ కలిగి ఉందంటూ ప్లేగ్ ఇంక్ అనే ఈ గేమ్‌ను చైనా యాప్ స్టోర్ నుంచి తొలగించినట్లు బ్రిటన్ కేంద్రంగా పనిచేసే డెవలపర్ 'ఎండెమిక్ క్రియేషన్స్' చెప్పింది.

దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ వ్యాప్తితో ఉక్కిరిబిక్కిరవుతున్న తరుణంలో చైనా ఈ వీడియో గేమ్‌ను నిషేధించింది.

అడ్డగీత
News image
అడ్డగీత

చైనా నిబంధనలకు విరుద్ధమైన కంటెంట్ ఈ గేమ్‌లో ఉందని 'సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా' పేర్కొందని, దీనిని చైనా యాప్ స్టోర్ నుంచి తీసేశారని ఎండెమిక్ క్రియేషన్స్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిస్థితి పూర్తిగా తమ నియంత్రణలో లేనిదని వ్యాఖ్యానించింది.

చైనాలో కరోనావైరస్ వ్యాప్తికి, ఈ నిషేధానికి సంబంధం ఉందో లేదో తమకు స్పష్టం కాలేదని సంస్థ వ్యాఖ్యానించింది. నిషేధాన్ని ఎత్తి వేయించేందుకు కృషి చేస్తున్నామని చెప్పింది.

ప్లేయర్లలో అవగాహన పెంచడంలో 'ప్లేగ్ ఇంక్' ప్రాధాన్యాన్ని అమెరికాలోని వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) లాంటి సంస్థలు చాలాసార్లు గుర్తించాయని ఎండెమిక్ క్రియేషన్స్ ప్రస్తావించింది. కరోనావైరస్‌తో వచ్చే కోవిడ్-19 వ్యాధి నియంత్రణకు ప్రధాన అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయని, ఈ పోరాటంలో తమ శక్తిమేర ఏ విధంగా తోడ్పాటు అందించగలమో నిర్ణయించేందుకు ఆయా సంస్థలతో కలసి పనిచేస్తున్నామని వివరించింది.

ప్లేగ్ ఇంక్

ఫొటో సోర్స్, Getty Images

తీవ్రమైన ప్రజారోగ్య అంశాల గురించి ఆలోచించి, అవగాహన పెంచుకొనేలా ప్లేయర్లను తమ గేమ్ ప్రోత్సహిస్తుందని, తాజా నిషేధం విచారకరమని ఎండెమిక్ క్రియేషన్స్ వ్యాఖ్యానించింది.

ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన ఈ గేమ్ చైనా సహా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. ప్రపంచ దేశాల్లో 13 కోట్ల మంది ప్లేయర్లు దీనిని ఆడతారు.

కరోనావైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న సమయంలో జనవరిలో చైనాలో అత్యధికంగా అమ్ముడుపోయిన యాప్‌ ఇదే.

కరోనావైరస్‌తో అలముకొన్న భయాందోళనలను తగ్గించుకొనేందుకు తాము ఈ గేమ్ డౌన్‌లోడ్ చేసుకొంటున్నామని కొందరు ప్లేయర్లు చెప్పారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచవ్యాప్తంగా 82 వేల కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.

ఫిబ్రవరి 28 రాత్రి వరకున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 82 వేల కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 2,800 మంది చనిపోయారు.

కేసులు, మరణాలు చైనాలోనే అత్యధికంగా ఉన్నాయి.

చైనా వెలుపల 3,664 కేసులు నమోదయ్యాయి. 57 మంది చనిపోయారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)