కశ్మీర్‌పై బ్రిటన్ లేబర్ పార్టీ తీర్మానం.. ‘ఓటు బ్యాంకు’ రాజకీయమన్న భారత్

లేబర్ పార్టీ

ఫొటో సోర్స్, AFP

కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ జోక్యం కోరుతూ బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ కశ్మీర్‌పై ఒక అత్యవసర తీర్మానాన్ని ఆమోదించింది.

కశ్మీర్‌లోకి అంతర్జాతీయ పరిశీలకులను అనుమతించాలని, అక్కడి ప్రజలకు స్వీయ నిర్ణయాధికారాన్ని కల్పిస్తూ ఐరాస నేతృత్వంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కోర్బిన్ డిమాండ్ చేశారు.

భారత వర్గాల ప్రతినిధులు ఈ తీర్మానాన్ని తప్పుపట్టారు. 'తప్పుడు అభిప్రాయలపై ఆధారపడి' ఆమోదించిన ఈ తీర్మానం 'భ్రమలకు తావిచ్చేలా' ఉందని విమర్శించారు.

మరోవైపు కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ జోక్యం కోసం బ్రిటన్ లేబర్ పార్టీ అభ్యర్థించడాన్ని భారత్ విమర్శించింది.

'ఓటు బ్యాంకు ప్రయోజనాల' కోసమే లేబర్ పార్టీ ఈ చర్యకు దిగిందని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వ్యాఖ్యానించారు.

కశ్మీర్

ఫొటో సోర్స్, MAJID JAHANGIR

ఐరాస సర్వసభ్య సమావేశం సందర్భంగా బుధవారం ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) కశ్మీర్ అంశంపై చర్చించింది. ఓఐసీ ఇస్లామిక్ దేశాల సమాఖ్య. మొత్తంగా ఇందులో 57 సభ్యదేశాలున్నాయి.

కశ్మీర్‌లో భారత్ కార్యకలాపాలు ఆపేయాలని, ఆ ప్రాంత ప్రత్యేక ప్రతిపత్తి రద్దు నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని ఓఐసీ విజ్ఞప్తి చేసింది.

ఇదివరకు కశ్మీర్ విషయంలో ఐరాస భద్రత మండలి చేసిన తీర్మానాలను పాటించాలని భారత్‌ను కోరింది.

ఓఐసీ కాంటాక్ట్ గ్రూప్‌కు చెందిన విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా కశ్మీర్ అంశంపై ఈ చర్చ జరిగింది.

సమావేశం తర్వాత ఓఐసీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.

కశ్మీర్‌లో మానవహక్కుల పరిస్థితిపై, ఫోన్, ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై ఆందోళన వ్యక్తం చేసింది.

ఇమ్రాన్ ఖాన్, ఎర్డోగన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇమ్రాన్ ఖాన్, ఎర్డొగాన్

టర్కీ ఏం చెప్పిందంటే..

ఐరాస సర్వసభ్య సమావేశంలో టర్కీ అధ్యక్షుడు రిసెప్ తాయిప్ ఎర్డొగాన్ బుధవారం కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు.

భారత్, పాకిస్తాన్‌లు చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇప్పటివరకూ ఐరాసలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన దేశం టర్కీ ఒక్కటే. అయితే, కశ్మీర్‌పై టర్కీ స్పందించడం ఇది మొదటిసారేమీ కాదు.

కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం సవరించినప్పుడు కూడా టర్కీ విదేశాంగ మంత్రి స్పందించారు. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను ఈ చర్య మరింత పెంచుతుందని వ్యాఖ్యానించారు.

తాజాగా ఐరాసలో ఈ విషయంపై మాట్లాడినప్పుడు ఎర్డొగాన్.. 72 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న కశ్మీర్ సమస్యపై అంతర్జాతీయ సమాజం తగినంత శ్రద్ధ చూపడం లేదని అన్నారు.

ఐరాస సర్వసభ్య సమావేశంలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించినందుకు ఎర్డొగాన్‌కు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)