క్రికెట్ ప్రపంచ కప్: ఫైనల్‌‌లో ఇంగ్లండ్... సెమీస్‌లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో విజయం

ఇంగ్లండ్ విజయోత్సాహం

ఫొటో సోర్స్, Twitter/cricketworldcup

ప్రపంచకప్ క్రికెట్ రెండో సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.

224 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

ఓపెనర్లు జేసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో ధాటిగా ఆడి ఇంగ్లండ్ విజయానికి బాటలు వేయడంతో ఇంగ్లండ్ 18 ఓవర్లు మిగిలి ఉండగానే గెలిచింది.

1992 తరువాత ఇంగ్లండ్ మళ్లీ ప్రపంచకప్ ఫైనల్‌కు చేరడంతో ఆ జట్టు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇంగ్లండ్ ఓపెనర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఆచితూచి ఆడుతూ విజయం అందుకున్నారు

ఓపెనర్లు జేసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో ఇద్దరూ వంద పరుగుల భాగస్వామ్యం అందించిన తర్వాత 124 పరుగుల దగ్గర తొలి వికెట్ పడింది.

18వ ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ బెయిర్‌స్టో(34)ను ఎల్‌బిడబ్ల్యు చేశాడు.

అప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన జేసన్ రాయ్ జో రూట్‌తో కలిసి మరింత ధాటిగా ఆడాడు. అదే జోరులో 20వ ఓవర్లో 147 పరుగుల దగ్గర ఔట్ అయ్యాడు.

పాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో జేసన్ కొట్టిన బంతి అలెక్స్ కారీ చేతుల్లో పడింది.

ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జేసన్ రాయ్

ఫొటో సోర్స్, Twitter/cricketworldcup

ఫొటో క్యాప్షన్, ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జేసన్ రాయ్

65 బంతుల్లో 85 పరుగులు చేసిన జేసన్ రాయ్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.

మిగతా లాంఛనాన్ని జో రూట్(49 నాటౌట్) కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(45 నాటౌట్) పూర్తి చేశారు.

మరో వికెట్ పడకుండా 32.1 ఓవర్లలో జట్టుకు విజయం సాధించి పెట్టారు.

విజయానికి రెండు పరుగులు అవసరమైన సమయంలో మోర్గాన్ ఫోర్ కొట్టాడు. దీంతో ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి మొత్తం 226 పరుగులు చేసింది.

8 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది.

ఆదివారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్ న్యూజీలాండ్‌తో తలపడేందుకు సిద్ధమైంది.

పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌లో ఇంటిబాటపట్టగా.. ఈసారీ కొత్త ప్రపంచ చాంపియన్ కోసం లార్డ్స్ వేదికవుతోంది.

వార్నర్

ఫొటో సోర్స్, Twitter/cricketworldcup

49 ఓవర్లకే ఆస్ట్రేలియా ఆలౌట్

అంతకుముందు వరుసగా వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 50 ఓవర్లు పూర్తికాకుండానే ఆలవుట్ అయింది. 49 ఓవర్లలో 223 పరుగులు చేసి అంతా అవుటయ్యారు.

ఆస్ట్రేలియా ఆరంభం నుంచే వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఆర్చర్ బౌలింగ్‌లో కెప్టెన్ అరోన్ ఫించ్ రూపంలో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. కొద్దిసేపట్లోనే డేవిడ్ వార్నర్ కూడా వోక్స్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో ఆస్ట్రేలియా 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

ఫించ్ పరుగులేమీ చేయకుండా అవుట్ కాగా వార్నర్ రెండు ఫోర్లతో 9 పరుగులు చేశాడు. వోక్స్ బౌలింగ్‌లో పీటర్ హ్యాండ్స్‌కాంబ్ క్లీన్ బౌల్డ్ కావడంతో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది.

ఇంగ్లండ్ బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను కుదురుకోనివ్వకుండా వరుసగా వికెట్లు తీస్తూ వచ్చారు.

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో స్మిత్ 85, కేరీ 46, మ్యాక్స్‌వెల్ 22, స్టార్క్ 29 మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్, రషీద్‌లు తలో 3 వికెట్లు తీయగా ఆర్చర్ 2, ఉడ్ ఒక వికెట్ తీశారు.

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కెప్టెన్లు ఇయాన్ మోర్గాన్, అరోన్ ఫించ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కెప్టెన్లు ఇయాన్ మోర్గాన్, అరోన్ ఫించ్

రెండో సెమీఫైనల్

క్రికెట్ ప్రపంచకప్-2019లో రెండో సెమీఫైనల్ ఆతిథ్య దేశం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది.

ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌ క్రీడాభిమానుల్లో అమితాసక్తి రేకెత్తిస్తోంది. లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌ను 64 పరుగుల తేడాతో ఓడించింది.

కీలకమైన సెమీఫైనల్‌లో మరోసారి ఇంగ్లండ్‌పై విజయం సాదించి ఫైనల్‌లో అడుగుపెట్టాలని ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతుండగా.. అటు ఇంగ్లండ్ కూడా లీగ్ దశలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుని ఫైనల్‌లో అడుగుపెట్టాలన్న పట్టుదలతో ఉంది.

ఐదుసార్లు గెలిచిన ఆస్ట్రేలియా

క్రికెట్‌ చరిత్రలో మరే జట్టుకు సాధ్యం కాని ఘనతను ఆస్ట్రేలియా జట్టు సొంతం చేసుకుంది. ఆసీస్ ఏకంగా ఐదు సార్లు విశ్వ విజేతగా నిలిచింది.

2015 మార్చి 29న మెల్‌బోర్న్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో ఏడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. గతంలో 1987, 1999, 2003, 2007 వన్డే ప్రపంచ కప్‌ టోర్నీల్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది.

ఐదోసారి ఇంగ్లండ్ఆతిథ్యం

ప్రపంచ కప్‌కు అత్యధికంగా ఐదోసారి ఇంగ్లండ్‌ ఆతిథ్యం ఇస్తోంది. 1975, 1979, 1983, 1999 ప్రపంచకప్‌ టోర్నీలు కూడా ఇంగ్లండ్‌లోనే జరిగాయి.

ఇంగ్లండ్‌ తర్వాత ఈ టోర్నీ ఎక్కువసార్లు భారత ఉపఖండంలో జరిగింది. 1987, 1996, 2011 టోర్నీలు భారత ఉపఖండంలో జరిగాయి.

2023లో జరిగే ప్రపంచ కప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారతదేశంలోనే జరుగుతాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)