మహమ్మద్ జుబైర్కు బెయిల్ నిరాకరణ... ఆయనకు పాకిస్తాన్, సిరియా నుంచి విరాళాలు అందాయా?

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ మహమ్మద్ జుబైర్కు శనివారంతో పోలీస్ కస్టడీ ముగిసింది. అయితే, ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తున్నట్లు కోర్టు తాజాగా తీర్పునిచ్చింది.
శనివారం ఆయనను మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు.
జుబైర్ను విచారించేందుకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ కావాలని దిల్లీ పోలీసుల తరపున సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ కోర్టును కోరారు.
అదే సమయంలో జుబైర్ తరఫు న్యాయవాది వృందా గ్రోవర్, తన క్లయింట్కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ను తిరస్కరించిన కోర్టు ఆయనను 14 రోజుల కస్టడీకి పంపాలని నిర్ణయించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కోర్టులో ఏం జరిగింది?
జుబైర్ కేసులో కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీవాస్తవ, కోర్టుకు చెప్పారు. ఈ నేపథ్యంలో నిందితుడు జుబైర్పై పోలీసులు కొత్త సెక్షన్లను నమోదు చేశారని తెలిపారు.
ఐపీసీ సెక్షన్ 120-బి (నేరపూరిత కుట్ర), 201 (సాక్ష్యాలు నాశనం చేయడం)లతో పాటు విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టంలోని సెక్షన్ 35 ప్రకారం ఆయనపై దిల్లీ పోలీసులు, కేసులు మోపారు.
జుబైర్ ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు కోర్టుకు శ్రీవాస్తవ వెల్లడించారు. వీటి ద్వారా కూడా కొన్ని అంశాలు తెలుసుకున్నామని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
జుబైర్ తరఫు న్యాయవాది వృందా గ్రోవర్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ట్వీట్లు 2018 నాటివని, అప్పుడు ఆయన వేరే ఫోన్ వాడారని వృందా చెప్పారు. ట్వీట్ను జుబైర్ ఖండించలేదని, అయితే ట్వీట్ను ధ్రువీకరించాలని ట్విటర్ను కోరాలని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
దిల్లీ పోలీసులు
''దిల్లీ పోలీసులు జుబైర్ ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కానీ వాటిల్లో జుబైర్కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఈ కేసులో నేరాన్ని నిరూపించడంలో కూడా వారు విఫలమయ్యారు. దిల్లీ పోలీసులు ఈ కేసులో అనవసరంగా ఆలస్యంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు'' అని వృందా అన్నారు.
జుబైర్పై దిల్లీ పోలీసులు అక్రమంగా చర్యలు తీసుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
ఆయన నేరం చేసినట్లు రుజువు చేసేందుకు రికార్డుల్లో ఎటువంటి ఆధారాలు, వస్తువులు లేవని అన్నారు.
ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని దిల్లీ పోలీసులు తెలిపారు. పాకిస్థాన్, సిరియా సహా చాలా దేశాల నుంచి జుబైర్, విదేశీ నిధులు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆయనపై ఎఫ్సీఆర్ఏ సెక్షన్ 35 విధించామని వారు వెల్లడించారు.
మరోవైపు శ్రీవాస్తవ వాదిస్తూ... ''దిల్లీ పోలీసుల ఆదేశాల మేరకు జుబైర్ విచారణకు హాజరయ్యారు. ఆరోజు ముందు వరకు తాను వేరే సిమ్, ఫోన్ ఉపయోగించినట్లు విచారణలో చెప్పారు. వాటిని పోలీసులకు కూడా చూపించారు. నోటీసులు అందుకున్న తర్వాత ఆ సిమ్ను తీసేసి వేరే ఫోన్లో పెట్టారు. ఆయన ఎంత తెలివైన వారో చూడండి'' అంటూ వివరించారు.
ఒక వ్యక్తి సిమ్ లేదా ఫోన్ను మార్చడం నేరమా? అని వృందా ప్రశ్నించారు. ఫోన్ను రీఫార్మాట్ చేయడం నేరమా? తెలివిగా ఉండటం నేరమా? ఇవన్నీ ఐపీసీ లేదా మరే ఇతర సెక్షన్ల ప్రకారం నేరం కిందకు రావు. మీరు ఒక వ్యక్తిని ఇష్టపడకపోవచ్చు. అందులో తప్పేం లేదు. కానీ, ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి విద్వేషపూరితమైన లేదా హానికరమైన వ్యాఖ్యలు చేయకూడదు అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, ANI
కాల్ రికార్డులు
బయటపడటానికి వీల్లేని విధంగా జుబైర్ను ఇరికించాలని దిల్లీ పోలీసులు చూస్తున్నారని వృందా గ్రోవర్ అన్నారు.
''ఈ దేశంలో మీరు ఆయనను ఒక తప్పుడు కేసులో ఇరికించలేరు. నిష్పాక్షికతను కోర్టు కాపాడాలి. ఆయన ఇప్పటికే అయిదు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉన్నారు. నోటీసులన్నింటికీ ఆయన సమాధానమిచ్చారు. ఇక కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదు. కానీ, జుబైర్ను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని పోలీసులే డిమాండ్ చేస్తున్నారు'' అని ఆమె ఆరోపించారు.
పాకిస్తాన్, సిరియాల నుంచి రేజర్ గేట్వే ద్వారా జుబైర్ నిధులు పొందినట్లు కాల్ డిటైల్స్ రికార్డ్స్ (సీడీఆర్) దర్యాప్తులో ప్రాథమికంగా తేలిందని దిల్లీ పోలీసుల తరఫు న్యాయవాది శ్రీవాస్తవ తెలిపారు.
ఈ నేపథ్యంలో డబ్బు లావాదేవీలకు సంబంధించిన నేరాన్ని రుజువు చేయడానికి విచారణ అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.
జుబైర్కు బెయిల్ కోరుతూ వృందా గ్రోవర్ తన వాదనలు వినిపించారు. ''మహమ్మద్ జుబైర్ ఒక యువ జర్నలిస్ట్. ఫ్యాక్ట్ చెకర్. ఆయన మనందరం గర్వించదగిన దేశ పౌరుడు. ఆయనను బెయిల్పై విడుదల చేయాలి'' అని అన్నారు.
ఆయన సాక్ష్యాలను తారుమారు చేయలేదని, ఆయనపై ఐపీసీ సెక్షన్ 201 విధించడం తప్పు అని వృందా గ్రోవర్ పేర్కొన్నారు.
''ఆయన అమాయకుడు. ఒక జర్నలిస్టు, బాధ్యతాయుతమైన వ్యక్తి. కాబట్టి దయచేసి ఆయనను బెయిల్పై విడుదల చేయండి. అయిదు రోజుల పాటు ఆయన దిల్లీ పోలీసుల కస్టడీలోనే ఉన్నారు'' అని వృందా వివరించారు.
దర్యాప్తు సంస్థలకు సహకరించడం లేదనే ఆరోపణలు
అదే సమయంలో అతుల్ శ్రీవాస్తవ మాట్లాడుతూ... ''వృందా గ్రోవర్ చెప్పిన మాటల్నే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థలకు జుబైర్ సహకరించడం లేదు. ఆయన బెయిల్ పిటిషన్ను తిరస్కరించాలి.
సీఆర్పీసీలోని సెక్షన్ 41 ప్రకారం, ఎవరైనా ఒక వ్యక్తి, ఏదైనా ఒక కేసు విచారణలో దర్యాప్తు సంస్థలకు సహకరించకపోతే అతన్ని అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది.
పాకిస్తాన్, సిరియాల నుంచి ఆయనకు ఎందుకు నిధులు వచ్చాయి? ఎప్పుడు వచ్చాయన్న దానిపై విచారణ జరగాల్సి ఉంది'' అని తన వాదనలు వినిపించారు.
వృందా గ్రోవర్ వాదనలపై శ్రీవాస్తవ స్పందించారు. ''జుబైర్ ఒక యువ జర్నలిస్ట్, అతన్ని చూసి గర్వపడాలని చెబుతున్నారు. కానీ, జుబైర్ చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయని నేను కోర్టుకు చెప్పాలి అనుకుంటున్నా. ఆయనకు విదేశాల నుంచి నిధులు లేదా విరాళాలు అందుతున్నాయి. దానిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయకూడదు'' అని శ్రీవాస్తవ వాదించారు.
ఇవి కూడా చదవండి:
- బీజేపీ ‘ఆపరేషన్ తెలంగాణ’ విజయవంతం అవుతుందా... ఉత్తరాది రాజకీయ వ్యూహాలు దక్షిణాదిలో పనిచేస్తాయా?
- హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఏం చేస్తారు?
- హీరో విశాల్: 'ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావట్లేదు.. చంద్రబాబుపై కుప్పంలో పోటీ చేయట్లేదు'
- ఆంధ్రప్రదేశ్: ఉడుత ఎక్కితే హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడతాయా? ఐదుగురు సజీవ దహనం వెనుక అసలు కారణాలేంటి?
- ఔరంగాబాద్, ఉస్మానాబాద్ల పేర్లు ఎందుకు మార్చారు? హైదరాబాద్ నిజాంకు ఈ పేర్లతో సంబంధం ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)













