సుప్రీం కమిటీ సభ్యులపై రైతు సంఘాల సందేహం, కొనసాగనున్న నిరసనలు - BBC Newsreel

రైతు సంఘాల నేతలు
ఫొటో క్యాప్షన్, రైతు సంఘాల నేతల ప్రెస్ మీట్

సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలోని సభ్యులపై రైతు సంఘాల నేతలు సందేహం వ్యక్తం చేశారు. దీంతో వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనలు కొనసాగనున్నాయి.

"జనవరి 26న మా నిరసన ప్రదర్శనలు చారిత్రకం కాబోతున్నాయి. చట్టాన్ని రద్దు చేయించాలనే మేం ఆందోళనలు చేస్తున్నాం" అని రైతు సంఘాల నేతలు ప్రెస్ కాన్ఫరెన్సులో చెప్పారు.

"ప్రభుత్వ విధానం ఎలా ఉందో, ఈ కమిటీ విషయంలో కూడా అదే కనిపిస్తోంది. కమిటీలోని సభ్యుల వాదనలు కూడా ప్రభుత్వ పక్షానే ఉన్నాయి. మా అందరి చూపూ సుప్రీంకోర్టువైపే ఉంది. మా పోరాటం ప్రభుత్వంతోనే కానీ, కమిటీతో కాదు" అన్నారు.

"మేం ఇప్పుడు కూడా లోహ్రీ(పండుగ) మంటల్లో మూడు వ్యవసాయ చట్టాలను తగలబెట్టబోతున్నాం. జనవరి 26న జరిగే మా వ్యతిరేక ప్రదర్శనలు పూర్తిగా శాంతియుతంగా ఉంటాయని మేం చెప్పాం. కానీ, మేం ఏదో దాడులు చేయబోతున్నామంటూ వదంతులు ప్రచారం చేస్తున్నారు. అది బాధ్యతారహిత చర్య. మేం ఎప్పుడూ హింసామార్గాన్ని ఎంచుకోలేదు, ఎంచుకోం కూడా" అని రైతులు స్పష్టం చేశారు.

రైతుల ఉద్యమం

ఫొటో సోర్స్, Getty Images

చట్టాల అమలుపై సుప్రీం కోర్టు స్టే

రైతుల నిరసనల నడుమ కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల అమలుపై మంగళవారం సుప్రీం కోర్టు నిలుపుదల ఆదేశాలు ఇచ్చింది.

చట్టాలకు సంబంధించి రైతుల సాధకబాధకాలు వినేందుకు నలుగురు సభ్యుల కమిటీని సుప్రీం కోర్టు ఏర్పాటుచేసింది.

ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సంస్థ దక్షిణాసియా విభాగం డైరెక్టర్ ప్రమోద్ కుమార్ జోషి, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజస్ మాజీ ఛైర్మన్ అశోక్ గులాటీ, ఆర్థిక నిపుణులు అనిల్ ధనావత్, హర్‌సిమ్రత్ మాన్‌లతో సుప్రీం కోర్టు ఈ కమిటీని ఏర్పాటుచేసింది.

కమిటీ ముందుకు వెళ్లడానికి మేం సిద్ధంగా లేమన్న రైతు సంఘాలు

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు సూచనలతో ఏర్పాటయ్యే కమిటీ ముందు తమ గోడు వెల్లడించడానికి తాము సిద్ధంగా లేమని రైతు సంఘాలు తెలిపాయి.

ఈ వ్యవసాయ చట్టాల విషయంలో రైతు సంఘాలన్నీ ఒకే మాటపై ఉన్నాయని, ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని సంయుక్త కిసాన్ మోర్చా ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘వ్యవసాయ చట్టాల అమలు నిలుపుదలపై సుప్రీం కోర్టు సూచనలను మేం స్వాగతిస్తున్నాం. అయితే, సుప్రీం కోర్టు సూచనలతో ఏర్పాటయ్యే కమిటీ ముందుకు వెళ్లకూడదని మేం నిర్ణయం తీసుకున్నాం’’అని ప్రకటనలో పేర్కొన్నారు.

‘‘కేంద్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే వారు చట్టాలను వెనక్కి తీసుకునేలా కనిపించడం లేదు. అలాంటప్పుడు మేం ఆ కమిటీ ముందుకు వెళ్లి ఉపయోగం ఉండదు’’అని ప్రకటనలో వివరించారు.

హైదరాబాద్ చేరుకున్న కరోనా వ్యాక్సీన్
ఫొటో క్యాప్షన్, హైదరాబాద్ చేరుకున్న కరోనా వ్యాక్సీన్

కరోనావైరస్ వ్యాక్సీన్ హైదరాబాద్‌కు వచ్చేసింది

కరోనావైరస్‌కు కళ్లెం వేయడమే లక్ష్యంగా ప్రజలకు వ్యాక్సీన్లు ఇచ్చేందుకు సర్వం సిద్ధమవుతోంది.

మంగళవారం 31 బాక్సుల్లో 3 లక్షల 72 వేల డోసులు హైదరాబాద్‌కు చేరుకున్నాయి.

‘‘తొలి దశ కోవిషీల్డ్ టీకాలు మేం తీసుకొస్తున్నాం. హైదరాబాద్‌, విజయవాడలతోపాటు గువాహటి, కోల్‌కతా, భువనేశ్వర్, బెంగళూరు, పట్నాలను తరలిస్తున్నాం’’అని స్పైస్ జెట్ ఎండీ, ఛైర్మన్ అజయ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.

కోవిడ్ వ్యాక్సీన్

మరోవైపు పుణె నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వ్యాక్సీన్లు చేరుకున్నట్లు హైదరాబాద్‌లోని అధికారులు తెలిపారు. వీటిని ప్రత్యేక వాహనాల్లో వేర్వేరు ప్రాంతాలకు తరలించనున్నారు.

శంషాబాద్ చేరుకున్న వ్యాక్సీన్

కోఠీ వ్యాక్సీన్ల కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ద్వారాలను పూలతో ప్రత్యేకంగా అలంకరించారు.

ప్రస్తుతం హైదరాబాద్‌కు చేరుకున్న ఈ వ్యాక్సీన్లను తెలంగాణలో వివిధ ప్రాంతాలకు తరలిస్తారు.

జనవరి 16 నుంచి తొలి దశ వ్యాక్సీన్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టే సంగతి తెలిసిందే. మొదటగా వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకాలు ఇస్తారు.

మద్యపానం

ఫొటో సోర్స్, Getty Images

మధ్యప్రదేశ్: విషపూరిత మద్యం తాగి పది మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని మొరైనా జిల్లాలో విషపూరిత మద్యం తాగి పది మంది మరణించారు.ఘటనపై విచారణకు ఆదేశించామని, ఎస్‌హెచ్‌వోను విధుల నుంచి తొలగించామని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్ర తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

''ఘటన స్థలానికి దర్యాప్తు అధికారుల బృందం ఇప్పటికే చేరుకుంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం''అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)