హరియాణా: సీఎం సభా వేదిక ధ్వంసం చేసిన రైతులు.. హెలిపాడ్ తవ్వేయడంతో పర్యటన రద్దు చేసుకున్న ముఖ్యమంత్రి

చెల్లాచెదురైన కుర్చీలు

కొత్త వ్యవసాయ చట్టాల ప్రయోజనాలను వివరించేందుకు హరియాణా ముఖ్య మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్ జిల్లాలోని కైమ్లా గ్రామంలో ఆదివారం 'కిసాన్ మహా పంచాయత్' సభ ఏర్పాటు చేశారు.

అయితే, ఈ సభను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనలకు దిగడంతో ముఖ్యమంత్రి తన పర్యటనను రద్దు చేసుకున్నారు.నిరసన తెలిపిన రైతులపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కానన్లు ప్రయోగించారు.

తమని తాము రక్షించుకోడానికి రైతులు పంట పొలాల్లోకి పరిగెత్తారని, అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని బీబీసీ ప్రతినిధి సత్ సింగ్ తెలిపారు.

రైతులు

బీజేపీ 'కిసాన్ పంచాయత్' జరగునున్న ప్రదేశానికి కొద్ది దూరంలో భారీ సంఖ్యలో రైతులు నల్ల జెండాలు పట్టుకుని గుమిగూడారు.

వారంతా వేదికను సమీపిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసులు పెట్టిన బ్యారికేడ్లన్నీ విరగ్గొట్టి రైతులు ముఖ్య మంత్రి మాట్లాడాల్సిన వేదిక వద్దకు చేరుకున్నారు.

స్టేజ్ ధ్వంసం చేయడమే కాకుండా సభ కోసం వేసిన కుర్చీలన్నిటినీ చెల్లాచెదురు చేశారు.

ముఖ్య మంత్రి హెలికాప్టర్ దిగాల్సిన ప్రదేశాన్ని తవ్వేశారు.

రైతుల నిరసన

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

కిసాన్ మహా పంచాయత్ రైతుల కోసమే అయితే తమను అక్కడకు ఎందుకు వెళ్లనివ్వట్లేదని రైతులు ఆరోపించారు.

తాము ర్యాలీకి తరలి వెళుతుండగా బీజేపీ కార్యకర్తలు తమపై రాళ్లు రువ్వారని, వారి చర్యలు తమను రెచ్చగొట్టాయని రైతులు ఆరోపించారు.

రైతులపై బాష్పవాయు ప్రయోగం

ఫొటో సోర్స్, Ani

‘అసలైన రైతుల విజయం ఇది’

కాగా దీన్ని అసలైన రైతులు నకిలీ రైతులపై సాధించిన విజయంగా కిసాన్ సభ ప్రెసిడెంట్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.

"నిజమైన రైతులు రోడ్లపై కూర్చుని నిరసనలు తెలియజేస్తున్నారు. నకిలీ రైతులను పోగు చేసి కిసాన్ పంచాయత్ సభ నిర్వహించి.. రాజకీయాలు చేయలేరని సీఎం ఖట్టర్‌కు తెలియాలి. ఇలాంటి సభలను నిర్వహించాలని బీజేపీ నాయకులు ఎవరు ప్రయత్నించినా వారికీ ఇదే అనుభవం ఎదురవుతుంది" అని ప్రీత్ సింగ్ తెలిపారు.

అయితే, బీజేపీ నాయకులు ఎవరూ జరిగిన సంఘటనపై ఇంతవరకూ ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు.

దీనిముందు కూడా ఇలాంటి ఘటనలు రెండుసార్లు చోటు చేసుకున్నాయి. శనివారం నాడు ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోపరేటివ్ లిమిటెడ్ (ఐఎఫ్ఎఫ్‌సీఓ) ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాబోతున్న హరియాణా డిప్యుటీ స్పీకర్ రణ్బీర్ గంగ్వా కారును హిసార్ జిల్లాలోని రైతులు చుట్టుముట్టారు.

డిసెంబర్ 22న తన సొంత నియోజక వర్గం పర్యటనకు బయలుదేరబోతున్న డిప్యుటీ సీఎం దుష్యంత్ చౌటాలా హెలీపాడ్‌ను రైతులు తవ్వేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)