విశాఖ తీరానికి కొట్టుకువచ్చిన ఈ బంగ్లాదేశ్‌ ఓడ తిరిగి సముద్రంలోకి వెళ్తుందా? ఇక్కడే రెస్టారెంట్‌గా మారుతుందా?

విశాఖపట్నం తీరంలో ఓడ
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

విశాఖ పోర్టు నుంచి తీరానికి కొట్టుకువచ్చిన కార్గో షిష్ తిరిగి సముద్రంలోకి వెళ్తుందా, లేక తీరంలోనే రెస్టారెంట్‌గా మారనుందా అన్న విషయమై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

బంగ్లాదేశ్‌కు చెందిన ఈ నౌక పేరు 'ఎంవీ మా'. వాయుగుండం ప్రభావంతో విశాఖ పోర్టు యాంకరేజ్ నుంచి తెన్నేటి పార్కుకి ఇది కొట్టుకువచ్చి ఇరవై రోజులు దాటింది. అయినా, ఇంకా దీని భవితవ్యం ఏంటో తేలడం లేదు.

'ఎంవీ మా' నౌకను తిరిగి సముద్రంలోకి పంపించాలంటే ముందుగా అందులోని ముడి చమురు, డీజిల్‌ను బయటకు తీయాలి. తర్వాత నౌకను సముద్రంలోకి పంపించాలి. దీనికోసం ఆ నౌక యాజమాన్యం నవ్ షిప్ మెరైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ ఇప్పటికే నౌకలోని డీజిల్, ముడి చమురును బయటకు తీసేసి, నౌకను సముద్రంలోకి పంపేందుకు సిద్ధమవుతోంది.

అయితే, ఈ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేసిన ఒక ప్రకటన గందరగోళానికి దారి తీసింది.

"బంగ్లాదేశ్ నౌకను రెస్టారెంట్‌గా మార్చే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే విశాఖలో టీయూ 142 యుద్ధ విమాన మ్యూజియం, సబ్ మెరైన్ లాంటివి పర్యటక రంగానికి అదనపు ఆకర్షణలుగా ఉన్నాయి. తీరానికి కొట్టుకువచ్చిన ఈ బంగ్లాదేశ్ నౌకను కూడా పర్యటక కేంద్రంగా వినియోగించుకోవాలని భావిస్తున్నాం. దీనికోసం ఓడ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నాం" అని ఆయన మీడియాతో చెప్పారు.

విశాఖపట్నం తీరంలో ఓడ

అప్పుడు విరాట్... ఇప్పుడు ఎంవీ మా

గతంలో ఐఎన్ఎస్ విరాట్‌ యుద్ధ నౌకను విశాఖలో పర్యటక ప్రాజెక్టుగా మార్చాలని ప్రయత్నించారు. రక్షణ శాఖకు సుమారు ముప్ఫై ఏళ్లు సేవలందించిన ఈ నౌక మూడేళ్ల క్రితం విరామం తీసుకుంది.

ముంబయి నావల్‌ డాక్‌ యార్డ్‌లో ఉన్న ఈ నౌకను విశాఖకు తీసుకురావాలని అప్పటి ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే, విరాట్‌ నౌకను ఏపీకి తీసుకువచ్చి... దాన్ని మ్యూజియంగా మార్చాలంటే సుమారు 1000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని పర్యటక శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ అప్పటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అంత ఖర్చు భరించలేమని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

విరాట్ విషయం అలా ఉంటే... ఎంవీ మా నౌక ఖరీదు సుమారుగా రూ.300 కోట్లు ఉంటుందని అంచనా. దాన్ని తీరం నుంచి తరలించేందుకు ఐదు కోట్ల రూపాయల వరకు వెచ్చిస్తున్నట్టు నవ్ షిప్ మెరైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

''సముద్రంలోకి తరలించలేని పక్షంలో మాత్రమే ఆ నౌకను ఏం చేయాలనేదాని గురించి ఆలోచిస్తాం. కానీ, నౌకను తీరం నుంచి సముద్రంలోకి తీసుకెళ్లగలమని వంద శాతం నమ్ముతున్నాం'' అని వారు చెబుతున్నారు.

‘ఆకర్షణే తప్ప... ఆర్థికంగా ఉపయోగం ఉండదు’

గతంలో ఐఎన్ఎస్ విరాట్‌ యుద్ధనౌకను పర్యటక కేంద్రంగా మార్చాలనుకోవడానికి కారణం... ఆ నౌకలో సిబ్బంది, ఇతర అవసరాల కోసం నిర్మించిన సుమారు వేయి గదులు ఉండటమే. దీనిలో హెలీకాప్టర్‌ ల్యాండింగ్ కోసం భారీ డెక్‌లు కూడా ఉన్నాయి.

కానీ, ఎంవీ మా కేవలం 15 మంది సిబ్బంది ఉండే ఒక కార్గో నౌక. సరకు రవాణా కోసం ఉపయోగపడే నౌక ఇది. దీన్ని రెస్టారెంట్‌గా మార్చాలంటే డెక్ నిర్మించాలి. అది కూడా చాలా చిన్నది మాత్రమే సాధ్యమవుతుంది. దీంతో రెస్టారెంట్‌గా మారిస్తే ఆకర్షణే తప్ప... వాణిజ్యపరంగా ఉపయోగం ఉంటుందా అనేది అనుమానమేనని పేరు చెప్పడానికి ఇష్టపడని పర్యటకశాఖ ఉద్యోగి ఒకరు బీబీసీతో అన్నారు.

విశాఖపట్నం తీరంలో ఓడ

‘సీఎం చెప్పారు... ప్రక్రియ మొదలైంది’

సుమారు మూడు వేల టన్నుల బరువున్న ఈ నౌకను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది, పర్యటక ఆకర్షణగా మార్చాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ బీబీసీతో చెప్పారు.

''నౌక లోపలి భాగాలను సందర్శకుల కోసం, నౌక పైభాగాన్ని ఆతిథ్య సేవల కోసం ఉపయోగించేలా తయారు చేయవచ్చు. దీనికి సంబంధించిన వివరాలు సీఎంకు చెప్పాం. ఆయన సానుకూలంగా స్పందించడమే కాకుండా... నౌక యాజమాన్యంతోపాటు పోర్టు, మెరైన్, నేవీ అధికారులతో చర్చించి అమలులోకి తీసుకురావాలని సూచించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా మొదలు పెట్టాం" అని శ్రీనివాస్ చెప్పారు.

‘సముద్రంలోకి వెళ్లడం పక్కా’

బంగ్లాదేశ్ యాజమాన్యం తరపున 'ఎంవీ మా' నౌక పనులను పర్యవేక్షిస్తున్న 'నవ్ షిప్ మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రకటనపై స్పందించింది.

"నౌకను సముద్రంలోకి పంపే పనిని ప్రారంభించి రెండు వారాలు అవుతోంది. ఈ నెల 15 నాటికి పూర్తవుతుంది. ఇప్పటికే దాదాపు 30 శాతం పనులు పూర్తయ్యాయి. అమెరికాకు చెందిన రిసాల్వ్ మెరైన్ అనే సంస్థ షిప్ సాల్వేజ్ (నౌకని సముద్రంలోకి పంపే ప్రక్రియ) పనులు చేస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే జిల్లా కలెక్టర్‌తోపాటు ఇతర అధికారులకు తమకు సహకారం అందించాలని లేఖలు రాసింది. అన్నీ సహకరిస్తే నవంబర్ 15వ తేదీ నాటికి ఎంవీ మా నౌక సముద్రంలోకి వెళ్లిపోతుంది. ఇప్పటికే కొందరు సాల్వేజ్ టీం సభ్యులు విశాఖ చేరుకున్నారు. సింగపూర్ నుంచి కూడా నిపుణులు వస్తున్నారు. ఇలాంటి తరుణంలో నౌకను రెస్టారెంట్‌గా మార్చనున్నామని ప్రకటన చేయడం ఆశ్చర్యంగా ఉంది" అని నవ్ షిప్ మెరైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ ఎం. భూపేష్ బీబీసీతో అన్నారు.

పర్యటకశాఖ మంత్రి వ్యాఖ్యలు, నౌక యాజమాన్య సంస్థ ప్రతినిధులు చెబుతున్న విషయాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. జిల్లా అధికారులు ఎవరూ ఈ విషయంపై స్పందించడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)