"వైఎస్ జగన్‌ను తక్షణం సీఎం పదవి నుంచి తొలగించండి'': సుప్రీంకోర్టులో పిల్ - BBC Newsreel

సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలతో భారత ప్రధాన న్యాయమూర్తికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేఖ రాశారు

ఫొటో సోర్స్, facebook/ysjagan

ఫొటో క్యాప్షన్, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలతో భారత ప్రధాన న్యాయమూర్తికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేఖ రాశారు

సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై అవినీతి ఆరోపణలు చేసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్ రెడ్డిని ఆ పదవి నుంచి తక్షణం తప్పించాలంటూ ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

సీఎం జగన్‌ మోహన్ ‌రెడ్డిపై మనీలాండరింగ్‌, అవినీతి సహా 20 క్రిమినల్‌ కేసులు నడుస్తున్నాయని ఈ వ్యాజ్యం వేసిన న్యాయవాదులు జి.ఎస్‌.మణి ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌లు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఎలాంటి ఆధారాలు లేకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ప్రజలు, మీడియా ముందు అవినీతి ఆరోపణలు చేసిన జగన్‌ మోహన్‌ రెడ్డిని తక్షణం సీఎం పదవి నుంచి తొలగించాని వారు సుప్రీంకోర్టుకు విజ్జప్తి చేశారు.

‘జగన్ ఆరోపణలపై జడ్జి చేత కానీ, సీబీఐ చేత కానీ విచారణ జరపాలి’

ముఖ్యమంత్రి పదవిని వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ సుప్రీంకోర్టు జడ్జి పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా జగన్‌మోహన్‌ రెడ్డి ఆరోపణలు చేశారని పిటిషనర్లు అన్నారు.

ఈ ఆరోపణలపై సిట్టింగ్‌ లేదా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్‌ లేదా సీబీఐ సహా మరే ఇతర సంస్థ అధికారులతోనైనా ఒక అంతర్గత కమిటీ వేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని వారు తమ పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరారు.

దిల్లీ బార్ అసోసియేషన్, సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్స్ ఖండన

మరోవైపు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి, ఆయన ప్రభుత్వం చేసిన ఆరోపణలు న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిపై దాడి ప్రయత్నంగా దిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అభివర్ణించింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తాము చేసిన ఫిర్యాదును జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మీడియాకు వెల్లడించిందని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అసోసియేషన్‌ తన ఏకగ్రీవ తీర్మానంలో పేర్కొంది.

మరోవైపు సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలు దురదృష్టకరమని, దీనివల్ల న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందని సుప్రీంకోర్టు అడ్వొకేట్స్‌ ఆన్‌ రికార్డ్ అసోసియేషన్‌(SCAORA) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.

వరద నీరు పోటెత్తిన ఏలూరు

వరద జలాలతో అపారనష్టం, పదికి చేరిన మృతుల సంఖ్య, పరిస్థితి గురించి ప్రధాని ఆరా

భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం అవుతోంది. ప్రధానంగా కోస్తా జిల్లాల్లో తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా నుంచి గుంటూరు జిల్లా వరకూ వరద తాకిడితో తల్లడిల్లుతున్నాయి. భారీగా పెరుగుతున్న వరద తాకిడితో కొన్ని ప్రాంతాలు కలవరపడుతున్నాయి. కృష్ణా నదీ ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. దాని ప్రభావంతో కృష్ణా-గుంటూరు జిల్లాల్లో పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి.

ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో వరద ప్రవాహం కనిపిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న ఇన్ ఫ్లో 7,20,701 లక్షల క్యుసెక్కుల మిగులు జలాలను యధాతథంగా దిగువకు వదులుతున్నారు. ఫలితంగా విజయవాడ నగరంలోని భవానీపురం, కృష్ణలంక, రాణీ గారి తోట సహా పలు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. ప్రకాశం బ్యారేజీ దిగువన రెండు జిల్లాల పరిధిలోని సమీమ గ్రామాల్లో వరద నీరు చేరుతోంది. లంకల్లో సాగు చేస్తున్న పంటలన్నీ నీటి పాలయ్యాయి.

పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర నగరం ఏలూరుతో పాటుగా అనేక చోట్ల వరద తాకిడి కనిపిస్తోంది. ఏలూరులో తమ్మిలేరు పొంగిపొర్లుతోంది. పలు డివిజన్లలో నివాస ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఆర్టీసీ కాంప్లెక్ మోకాలి లోతు నీటిలో కనిపిస్తోంది. ఆర్ ఆర్ పేట, శనివారపుపేట, అశోక్ నగర్, వైఎస్సార్ కాలనీ సహా టూ టౌన్ లోని పలు ప్రాంతాల్లో వరద జలాలు చేరుతున్నాయి.

చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలో ఉన్న తమ్మిలేరు జలాశయం నిండుకుండలా మారింది. 3 టీఎంసీల సామర్థ్యంగా ప్రాజెక్టులో 2.8 టీఎంసీల వద్ద అధికారులు నియంత్రిస్తున్నారు. గత 15 సంవత్సరాల కాలంలో తమ్మిలేరు కి ఇదే భారీ వరదగా ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. తమ్మిలేరు ప్రభావం తాకిడితో ఏలూరు నగరానికి వరద ముప్పు పొంచి ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే తమ్మిలేరు కాలువకు పలు చోట్ల గండిపడడంతో నదీ జలాలు ఏలూరు ఆటోనగర్ సహా పలు ప్రాంతాలను ముంచెత్తాయి.

తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఏలేరు జలాశయం నుంచి భారీగా విడుదలవుతున్న వరద జలాల కారణంగా 8 మండలాల్లో వరద ప్రవాహం కనిపిస్తోంది. జగ్గంపేట మండలం రామవరం వద్ద జాతీయ రహదారిపై కూడా వరద నీరు చేరింది. గొల్లప్రోలు ఈబీసీ కాలనీ పరిసరాల్లో వరద నీరు చేరింది.

విశాఖ జిల్లాలో కూడా శారదా, గోస్తనీ , వరాహ నదుల ప్రవాహంతో పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది.

శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నదికి వరద ఉధృతి పెరుగుతోంది. గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుత ఇన్ ఫ్లో 42,980 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 42,916 క్యూసెక్కులుగా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ముంపు ప్రాంతాల్లోకి వరద ప్రవాహం చేరుతున్న క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తుగా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె కన్నబాబు సూచించారు.

పదికి పెరిగిన మృతులు

భారీ వర్షాలు, వరదల మూలంగా రాష్ట్రవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య పదికి పెరిగింది. వరద ప్రవాహంలో చిక్కుకుని కొందరు మృతిచెందారు. జగ్గంపేట మండలం రామవరం వద్ద ఇల్లు నేలకూలింది. ప్రమాదంలో ఒకరు మరణించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ప్రాణనష్టం నివారించేందుకు యంత్రాంగం దృష్టి పెట్టిందని కన్నబాబు చెబుతున్నారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

రైతులకు అపారనష్టం

ఈసారి వాయుగుండం కారణంగా వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోతోంది. ప్రధానంగా వరి పంటకు పెద్ద దెబ్బ తగిలింది. సుమారు 60వేల హెక్టార్లలో పంట నీటి పాలయ్యిందని అధికారులు అంచనా వేస్తోంది. మరో 40వేల హెక్టార్లలో పాక్షికంగా నష్టం జరిగి ఉంటుందని ఏపీ వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నట్టు ప్రకటించింది. వరితో పాటుగా ఇతర పంటలకు కూడా అపార నష్టం సంభవించినట్టు భావిస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఎకరానికి రూ. 30వేలు ఖర్చు చేశాం. 10 ఎకరాల భూమి కౌలు చేస్తున్నాను. పెట్టుబడి కోసం అప్పులు చేశాం. ఇప్పుడు ఎర్రకాలువ గండిపడడంతో వరద నీటిలో పంట మొత్తం నానుతోంది. పనికిరాకుండా పోతోంది. ఈనిక దశలో ఉన్న పంట చేతికి రాకుండా పోయింది. దాంతో నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఇన్ పుట్ సబ్సిడీ, పంటల బీమా పథకం అందించాలని కోరుతున్నామని పశ్చిమ గోదావరి జిల్లా కైకరం గ్రామానికి చెందిన కే సత్యన్నారాయణ బీబీసీతో అన్నారు.

మరోవైపు వీలయినంత త్వరగా పంట నష్టం అంచనాలు వేయాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య సిబ్బందిని ఆదేశించారు. ఆమె. పంటల నష్టంపై వీలైనంత త్వరగా అంచనాలు పూర్తి చేసి పంపించే ప్రయత్నం చేయాలని ఆమె జిల్లాల కలెక్టర్లను కోరారు. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పటికీ ధాన్యం సేకరణ యథావిథిగా కొనసాగుతుందని ఆమె తెలిపారు. ఆ మేరకు ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల వద్ద రిజిస్ట్రేషన్‌ కొనసాగుతోందని అన్నారు.

సీఎం సమీక్ష, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశం

రాష్ట్రంలో భారీ వర్షాలు-వరదల వల్ల ఏర్పడిన పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సహాయ చర్యలు మరింత ముమ్మరం చేయాలని ఆదేశఙంచారు. సహాయక శిబిరాల్లో ఉన్న వారికి తక్షణ సహాయం కింద రూ.500 చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశాలిచ్చారు. అన్ని చోట్ల విద్యుత్‌ సరఫరాను పునరుద్దరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులు, కాల్వల గండ్లు పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై గుంతలు పూడ్చి, అవసరమైన మరమ్మతులు చేయాలని ఆదేశించారు. వరద తగ్గుతోందని, అంటు వ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు.

పీహెచ్‌సీలలో అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉంచి, శానిటేషన్‌ పక్కాగా చేయాలన్నారు.

పరిస్థితిపై ఆరా తీసిన ప్రధాని

ప్రస్తుత పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరా తీశారు. ఆయన సీఎంకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారని సీఎంవో ప్రకటించింది. రాష్ట్రంలో వర్షాలు, అనంతర పరిస్థితులను అడిగితెలుసుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో వర్షప్రభావిత ప్రాంతాలు, నెలకొన్న పరిస్థితులను సీఎం జగన్ ప్రధానికి వివరించారన్నారు. వాయుగుండం తీరందాటిందని, మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని వివరించినట్టు వెల్లడించారు. అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరించారిన సీఎంవో ప్రకటనలో పేర్కొంది.

‘గతంలో ప్రకటించిన సహాయం అందలేదు..ఈసారయినా సాయమందించాలి’

నీలమ్ తుఫాన్ తర్వాత గడిచిన కొన్నేళ్ళుగా ప్రభుత్వాలు సహాయం ప్రకటించడమే తప్ప రైతులకు ప్రయోజనం అందించడం లేదని ఏపీ రైతు సంఘం నాయకుడు కే శ్రీనివాస్ అన్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ ఈసారయినా ప్రభుత్వం స్పందించారు. ఎకరాకు రూ.25వేలు ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వాలి. పంటల బీమ, రైతు ధీమా అని ప్రకటించారు. కాబట్టి బీమా సొమ్ములు రైతులకు దక్కేలా చర్యలుండాలి. గతంలో పలు తుఫాన్ల సందర్భంగా ప్రకటించిన ఇన్ ఫుట్ సబ్సిడీ ఇప్పటికీ పెండింగ్ లో ఉంది. ఈసారి అలాంటి తాత్సార్యం జరగకూడదు. ప్రస్తుతం అప్పులతో సాగు చేసిన వారికి పంట చేతికొచ్చే వేళ వరదల పాలుకావడంతో నష్టం తీవ్రంగా ఉంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే సామాన్య రైతులు, కౌలుదారులు కష్టాల్లో పడతారు. అంటూ వివరించారు.

మృతుల కుటుంబాలను ఆదుకోవాలంటూ చంద్రబాబు లేఖ

ఏపీలో వరద సహాయక చర్యలపై సీఎం జగన్ కి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందించి ఆదుకోవాలని ఆయన కోరారు. భారీ వర్షాల్లో దెబ్బతిన్న పంటల ఎన్యూమరేషన్ యుద్దప్రాతిపదికన చేపట్టాలన్నారు. నష్టపోయిన కౌలు రైతులను గుర్తించి ఆదుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రత్యామ్నాయ సాగుకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా పంపిణీ చేయాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఉపాధి కోల్పోయిన చేనేత, ఇతర చేతివృత్తుల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించాలని, దెబ్బతిన్న వలలు, పడవల కొనుగోళ్లకు ఆర్ధిక సాయం అందించాలని కోరారు. దెబ్బతిన్న ఇళ్ల మరమ్మత్తులకు ఆర్ధిక సాయం అందించాలని, కూలిపోయిన, కొట్టుకుపోయిన ఇళ్ల స్థానంలో కొత్తఇళ్లు మంజూరు చేయాలన్నారు. వాగులు, వంకలకు పడ్డ గండ్లు పూడ్చాలి. గుంతలు పడ్డ రహదారులకు యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు జరపాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)