భారత్-చైనా సరిహద్దు వివాదం: భారత రక్షణశాఖ వెబ్సైట్ నుంచి మాయమైన ఆ డాక్యుమెంట్లో ఏముంది

ఫొటో సోర్స్, YAWAR NAZIR
‘లద్దాఖ్లో మే నెల ఆరంభంలో చైనా సైన్యం సరిహద్దుల అతిక్రమణకు పాల్పడింది’ అని అంగీకరిస్తూ భారత రక్షణ మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో మంగళవారం ఓ పత్రం ప్రచురించారు. అయితే, రెండు రోజుల వ్యవధిలోనే దాన్ని తొలగించారు.
రక్షణ శాఖ వెబ్సైట్లోని ‘వాట్స్ న్యూ’ విభాగంలో ఈ పత్రాన్ని మొదట పెట్టారు. కానీ, ఇప్పుడు అది అందుబాటులో లేదు.
‘‘మే 5 నుంచి వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద, ప్రధానంగా గల్వాన్ లోయ్ వద్ద చైనా అతిక్రమణలు క్రమంగా పెరుగుతున్నాయి. మే 17, 18న కుంగ్రంగ్ నాలా, గోగ్రా, ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర ఒడ్డు వద్ద చైనా పక్షం అతిక్రమణలకు పాల్పడింది’’ అని ‘చైనీస్ అగ్రెషన్ ఆన్ ఎల్ఏసీ’ శీర్షికతో ప్రచురితమైన ఆ పత్రంలో ఉంది.
పరిస్థితిని అదుపులో ఉంచేందుకు రెండు దేశాల సైన్యాల మధ్య సంప్రదింపులు జరిగాయనీ అందులో పేర్కొన్నారు.
ఈ విషయమై జూన్ 6న రెండు దేశాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ల స్థాయిలో చర్చలు జరిగాయి. అయినా, జూన్ 15న రెండు దేశాల సైనికుల మధ్య గల్వాన్ లోయ వద్ద ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో రెండు వైపులా సైనికులు మరణించారు.
‘‘తూర్పు లద్దాఖ్లో చైనా ఏకపక్షంగా అతిక్రమణలకు పాల్పడుతుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ఈ ప్రాంతంలో నిత్యం ఆందోళనకర పరిస్థితి ఉంటోంది. అందుకే, ఇక్కడ మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో వేగంగా చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది’’ అని ఆ పత్రం పేర్కొంది.

ఫొటో సోర్స్, MINISTRY OF DEFENCE
రాహుల్ విమర్శల దాడి
గురువారం ఉదయం నుంచి ఈ పత్రం వెబ్సైట్లో కనిపించడం లేదు.
ఈ వార్త బయటకు రాగానే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ... మోదీ ప్రభుత్వంపై ట్విటర్లో విమర్శల దాడి చేశారు. ‘‘ప్రధాన మంత్రి అబద్ధం ఎందుకు చెప్పారు?’’ అంటూ ప్రశ్నించారు.
‘‘చైనాపై ఎదురుదాడి సంగతి పక్కనపెట్టండి, ప్రధాని కనీసం ఆ దేశం పేరెత్తే సాహసం కూడా చేయడం లేదు. చైనా మన మాతృభూమిపైకి వచ్చిందన్న విషయాన్ని నిరాకరించినంత మాత్రాన, వెబ్సైట్ నుంచి పత్రం తొలగించినంత మాత్రాన వాస్తవాలు మారవు’’ అని రాహుల్ విమర్శించారు.
భారత్-చైనా సరిహద్దు వద్ద కొనసాగుతున్న వివాదాలను పరిష్కరించుకునేందుకు రెండు దేశాలు సైనికపరంగా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాయి. అయితే, వీటి వల్ల ఇంతవరకూ పెద్దగా చెప్పుకోదగ్గ ఫలితాలేమీ రాలేదు.
గత ఆదివారం భారత్, చైనాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య జరిగిన చర్చలూ ఏ నిర్ణయం లేకుండానే ముగిశాయి.
ఇంతకుముందు ఉద్రిక్తతలు చెలరేగిన ప్రాంతాల నుంచి సైనికుల ఉపసంహరణ గురించి భారత్, చైనా ఇచ్చిన ప్రకటనల్లోనూ వైరుధ్యం కనిపించింది.
వివాదాలున్న ప్రాంతాల్లో చాలా వాటి నుంచి సైన్యం ఉపసంహరించుకున్నట్లు చైనా ప్రకటించింది. మరోవైపు ఈ దిశగా కొంత పురోగతి కనిపించిందని భారత్ వెల్లడించింది.

ఫొటో సోర్స్, yawar nazir
చైనాతో సరిహద్దు వివాదం విషయంలో మొదటి నుంచి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
చైనా విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ‘పిరికిపంద వైఖరి’ కారణంగా దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రాహుల్ గాంధీ అన్నారు.
చైనాతో ఉద్రిక్తతల విషయంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపైనా రాహుల్ విమర్శలు చేశారు.
‘‘ఈ అంశం (భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు) పరిష్కారమవ్వాలి. కానీ, అది ఎంతవరకూ జరుగుతుందనే విషయంలో నేను ఏ గ్యారంటీ ఇవ్వలేను. భారత్కు చెందిన భూభాగంలో ఒక ఇంచును కూడా ప్రపంచంలోని ఏ శక్తీ తాకలేదని, ఆక్రమించలేదని మాత్రం భరోసా ఇవ్వాలనుకుంటున్నా’’ అని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
ఈ వ్యాఖ్యలనూ రాహుల్ తప్పుపట్టారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా దారిలోనే బ్రిటన్... చైనాపై కఠిన చర్యలకు సిద్ధం
- చిన్న మార్పుతో చైనాను భారీ దెబ్బకొట్టిన ఇండియా
- ఆంధ్రప్రదేశ్లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- భారత్లో నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా భారీగా తగ్గిన కర్బన ఉద్గారాలు
- ర్యాట్ హోల్ మైనింగ్: బొగ్గుగనిలో చిక్కుకున్న కార్మికులు.. కాపాడడం సాధ్యమేనా?
- రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్లోకి వచ్చేశాయి
- కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్
- "శరీరంలో 15 బుల్లెట్లు దిగాయి, శక్తిని కూడదీసుకుని పాక్ సైన్యంపై గ్రెనేడ్ విసిరా"
- సైనికులు సోషల్ మీడియా యాప్లు ఉపయోగిస్తే ప్రమాదం ఏంటి?
- భారత్-చైనా సరిహద్దు ఘర్షణ: రెండు దేశాల బలగాలు ఎక్కడ 'ఢీ అంటే ఢీ' అన్నట్లున్నాయి?
- చైనా దాడిపై భారత్కు నిఘా సమాచారం అందలేదా?
- ‘లద్దాఖ్లో మన భూమిపై కన్నేసినవారికి తగిన సమాధానం చెప్పాం’ - చైనా పేరెత్తకుండా వ్యాఖ్యలు
- 1962 చైనాతో యుద్ధానికి ముందే నెహ్రూ ఆధిపత్యానికి అంతం మొదలైంది ఇలా..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








