రిలయన్స్ జియోలో 9.99 శాతం వాటాను రూ. 46 వేల కోట్లకు కొనుగోలు చేసిన ఫేస్‌బుక్

జియో ఫేస్‌బుక్

ఫొటో సోర్స్, Getty Images

రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం, డిజిటల్ విభాగం రిలయన్స్ జియోలో ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ భారీ పెట్టుబడులు పెట్టింది. రూ. 43,574 కోట్లకు జియోలో 9.9 శాతం వాటాను ఆ సంస్థ కొనుగోలు చేసింది.

ఈ విషయాన్ని ఫేస్‌బుక్ బుధవారం ప్రకటించింది. తమ న్యూస్ రూమ్ పేజీలో ఈ ఒప్పందం గురించి వివరాలు వెల్లడించింది.

భారత్ పట్ల, భారత్‌లో రిలయన్స్ జియో తెచ్చిన మార్పుల పట్ల తమ ఉత్సాహం, నిబద్ధతకు ఈ పెట్టుబడి నిదర్శనమని ఫేస్‌బుక్ పేర్కొంది.

నాలుగేళ్ల కన్నా తక్కువ సమయంలోనే 38.8 కోట్ల మందికి ఇంటర్నెట్ సేవలు అందేలా చేయడంలో జియో విజయవంతమైందని ఫేస్‌బుక్ వ్యాఖ్యానించింది.

కొత్త సంస్థల పురోగతిలో జియో ముఖ్య పాత్ర పోషించిందని, జనాలను కొంగొత్త పద్ధతుల్లో అనుసంధానం చేసిందని అభిప్రాయపడింది.

‘‘జియోతో కలిసి భారత్‌లో ప్రజలను అనుసంధానం చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం. డిజిటల్ సాంకేతికతను అందింపుచ్చుకుని సామాజికంగా, ఆర్థికంగా భారత్ వేగంగా మారుతోంది. గత ఐదేళ్లలో భారత్‌లో 56 కోట్ల మంది ఇంటర్నెట్ వాడటం మొదలుపెట్టారు’’ అని ఫేస్‌బుక్ పేర్కొంది.

‘‘అన్ని రకాల వ్యాపారాలకు కొత్త అవకాశాలు కల్పించడం మా లక్ష్యం. దేశవ్యాప్తంగా ఉన్న ఆరు కోట్లకుపైగా చిరు వ్యాపారాలకు మేం సాధికారత కల్పించాలనుకుంటున్నాం. ఇలాంటి చిరు వ్యాపారాలే దేశానికి ఎక్కువ ఉద్యోగాలు సృష్టిస్తాయి. కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో మనం కలిసి పనిచేయడం చాలా ముఖ్యం. రాబోయే రోజుల్లో ప్రజలకు, వ్యాపారాలకు తోడ్పడే వేదికను తయారు చేయడం కూడా అవసరం’’ అని వ్యాఖ్యానించింది.

రిలయన్స్ జియోతో కలిసి ప్రజల కోసం కొత్త అవకాశాలు సృష్టించే ఆస్కారం ఉందని, ఆ సంస్థతో కలవడం వెనుక తమ ఉద్దేశం అదేనని ఫేస్‌బుక్ పేర్కొంది.

డిజిటల్ ఆర్థికవ్యవస్థలో ప్రభావవంతంగా పనిచేయడం, ప్రజలకు, వ్యాపారాలకు కొత్త మార్గాలు సృష్టించడంపై దృష్టి పెడతామని తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఈ ఒప్పందం ప్రాముఖ్యత ఏంటంటే...

భారత్‌లో మరో మైలు రాయిని చేరుకోవడంలో ఫేస్‌బుక్‌కు ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందని బీబీసీ ప్రతినిధి నిఖిల్ ఈనామ్‌దార్ అభిప్రాయపడ్డారు. ‌వీడియో స్ట్రీమింగ్, మ్యూజిక్ స్ట్రీమింగ్, చెల్లింపుల ఫ్లాట్‌ఫామ్ లాంటి చాలా రకాల సేవలను జియో అందిస్తోందని, వాటిన్నింటితో అనుసంధానమయ్యే అవకాశం ఫేస్‌బుక్‌కు చిక్కుతుందని చెప్పారు.

ప్రస్తుతం ఫేస్‌బుక్‌కు భారత్‌లోనే అత్యధిక మంది వినియోగదారులు ఉన్నారు. ‌ఆ సంస్థకు చెందిన వాట్సాప్ మెసేజింగ్ యాప్‌ను కూడా భారత్‌లో 30 కోట్లకుపైగా మంది వినియోగిస్తున్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ కోణంలో చూస్తే, ఈ ఒప్పందం రుణాలను తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది. 2021 మార్చి కల్లా ‘రుణ విముక్త సంస్థ’గా మారాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)