ఆంధ్రప్రదేశ్ ఈసీ తొలగింపు: నడుస్తున్నది వ్యక్తుల ప్రభుత్వమా? ప్రజా ప్రభుత్వమా?- అభిప్రాయం

ఏపీ ఎన్నికల అదికారి రమేశ్, సీఎం జగన్
    • రచయిత, మాడభూషి శ్రీధర్
    • హోదా, బీబీసీ కోసం

మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నది సాధించింది. ముఖ్యమంత్రి గవర్నర్ కలిసి అసాధారణ శాసనాధికారాన్ని వినియోగించి చట్టాన్ని సవరించేశారు. ఒక్క రాజ్యాంగ అధికారపీఠంలో ఉన్న ఒక్క స్వతంత్ర వ్యక్తిని ప్రభుత్వ అనుకూల వ్యక్తిగా, అటువంటి వ్యవస్థగా మార్చేందుకు ఎపీ పంచాయతీరాజ్ చట్టం- 1994 సవరించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని మూడేళ్లకు తగ్గించారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు తమ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ పదవీకాలం ఎంత ఉండాలో నిర్ణయించే అధికారం ఉంది. ఉండాలి కూడా. పదవీకాలం అయిదేళ్లు ఉండాలా లేక మూడేళ్లా అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, శాసనసభ నిర్ణయించాల్సిందే. శాసనసభ ఏయే శాసనాలను చేయగలదో ఆ శాసనాలన్నీ ప్రభుత్వం శాసనసభ లేనప్పుడు చేయగలుగుతుంది. ఇదంతా రాజ్యాంగబద్ధమే. మరి, ఈ ఆర్డినెన్సు చేయడం రాజ్యాంగ బద్ధం ఎందుకు కాదన్నది ప్రశ్న.

ఎన్నికలు జరుగుతున్న సమయంలో అధికారంలో ఉన్న పార్టీ తనకు అనుకూలంగా అధికారాన్ని వాడి, ప్రజాభిప్రాయాన్ని తమవైపు మలచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ పని అధికారంలో ఉన్న ప్రతి పార్టీ చేస్తుంది. వారి దుర్వినియోగ తీవ్రతలో తేడా ఉంటుందేమో గాని, అంతా ఒక్కటే. ఎన్నికల సమయంలో దుర్వినియోగం ఫిర్యాదులు వచ్చినపుడు మంత్రులు ముఖ్యమంత్రి వంటి పెద్దలకు వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వవలసి వస్తుంది. అందుకు ఎన్నికల కమిషనర్ మీద కోపతాపాలు రావడం, అప్పుడు వారిని పదవి నుంచి తొలగించాలనుకోవడం రాజుల అలవాటు. ఈ విధంగా తొలగించడానికి వీల్లేకుండా కమిషనర్ పదవిలో ఉన్నవారికి ఒక కచ్చితమైన పదవీకాలం, ఇతర స్థిర ప్రయోజనాలు కల్పించడం చట్టం బాధ్యత. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే కమిషనర్‌కు అయిదేళ్ల పదవీ కాలం ఇవ్వాలని, మధ్యలో తొలగించడానికి వీల్లేదని, ఒకవేళ తొలగించవలసినంత తప్పు చేసినా హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే భారీ స్థాయి విధానాన్ని అనుసరించాలని చట్టం నిర్దేశించింది. అంటే పార్లమెంటు మాత్రమే తొలగించాలి, రాష్ట్ర ప్రభుత్వం కాదు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగింది? స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకగ్రీవ ఎన్నికల కోసం అనేక చోట్ల అనేక హింసా సంఘటనలు, బెదిరింపులు దాడులు జరిగాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఒక లేఖలో పేర్కొంటూ తనకే రక్షణ లేదని హోం మంత్రికి చెప్పుకున్నారు. అయితే, ఆయన ఈ ఫిర్యాదులపై స్పష్టంగా అభిశంసన ఆదేశాలు ఇవ్వలేదు. కానీ, ఫిర్యాదులు వచ్చిన జిల్లాలలో పని చేసే రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులను చాలామందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అదే సమయంలో, కరోనావైరస్ వ్యాప్తిని కారణంగా చెబుతూ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు. సహజంగానే ప్రభుత్వానికి నచ్చలేదు. రమేశ్ కుమార్‌కు కుల, పార్టీ పక్షపాతాన్ని అంటగడుతూ తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే.

ఇక్కడ ప్రభుత్వం సరైన పని చేసిందా లేక ఎన్నికల కమిషనర్ తప్పు చేశారా అన్నది ప్రశ్న కాదు. అందరూ నిష్పాక్షికంగా నిర్ణయాలు తీసుకుంటున్నారో లేదో అని ఎవరూ నిర్ధరించనవసరం లేదు.

న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, స్పీకర్లు, గవర్నర్లు స్వతంత్రంగా వ్యవహరించాలని రాజ్యాంగం ఆశిస్తున్నది. కానీ, స్వతంత్రంగా లేనందుకు శిక్షించే అవకాశం ఎక్కడా ఉండదు. కేవలం వీరే స్వతంత్రంగా ఉన్నా సరిపోదు. యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణులై ఒక మంత్రికి ఉన్నంత ఉన్నత అధికారం కలిగి ఉన్న సివిల్ సర్వీసులో ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు కూడా స్వతంత్రంగా పక్షపాత రహితంగా వ్యవహరించాలి. కానీ, వారు మంత్రుల అడుగులకు మడుగులు వత్తితే ఏం చేయాలి? లేదా మాజీ పాలకులకు అనుకూలంగా వ్యవహరిస్తే ఏం చేయాలి? రాజ్యాంగం గానీ ఇతర చట్టాలు గానీ వారిని ఏం చేయగలుగుతాయి?

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ముఖ్యమంత్రులకు మంత్రులకు అనుకూలంగా వ్యవహరించి లాభాలు పొందాలనుకునే అధికారులు, తమకు అనుకూలంగా ఉన్నవారితోనే పాలించాలనుకునే మంత్రులు మన పాలనా వ్యవస్థను అత్యధికంగా శాసిస్తున్న రోజుల్లో ఉన్నాం. అనుకూలంగా వ్యవహరించని అధికారులను, స్వతంత్రంగా నిర్ణయించే వారిని ఇష్టం వచ్చినట్టు మంత్రులు బదిలీ చేస్తూ అడ్డు తొలగించుకుంటున్నారు. తరచుగా అనవసరంగా బదిలీలు చేయడం నియంతృత్వానికి చిహ్నాలు. మంత్రులకు అనుకూలంగా వ్యవహరించడానికి అధికారులు సిద్ధంగా ఉంటే అంతకన్న అవినీతి యంత్రాంగం మరొకటి ఉండదు.

కనుక ఈ ఘర్షణలు జరగడం, చివరకు వ్యవహారాలు కోర్టుకు వెళ్లడం జరుగుతున్నది. అటువంటి ఒక సంఘటన ఇది. రమేశ్ కుమార్‌ను తొలగించడం, తొందరగా తొలగించాలన్న ఆతృత తప్ప ఈ ఆర్డినెన్సుకు మరేదైనా లక్ష్యం ఉందా? ఎన్నికల కమిషన్ స్వతంత్రతను రక్షించడానికే ఈ సవరణ అని చెప్పడం నిజమే అయితే, అవునో కాదో మనం అంచనా వేసుకోవాలి.

ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత అందులో జోక్యం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదు. అధికార దుర్వినియోగాన్ని నివారించడానికి ప్రవర్తనా నియమావళి అమలు చేసి తీరాలి. దానిపై కోర్టులకు కూడా జోక్యం చేసుకునే అధికారం లేదు. కానీ, కమిషనర్ రమేశ్ కుమార్ ఉద్యోగమే పోయింది. తీసేశారు. దానికి చట్టం సవరణ. అందుకు ఆర్డినెన్సు. రెండు జీవోలు. వెంటనే మాజీ జడ్జిగారి నియామకం, వారు పదవీ స్వీకారం జరిగిపోయింది. ఎన్నికలు ఇంకా ముగియలేదు. మొదటిభాగం రమేశ్ కుమార్ నిర్వహిస్తే రెండో భాగం జస్టిస్ కనగరాజు గారు నిర్వహిస్తారు. ఎన్నికలలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో తెలియదు. ఒక్క వ్యక్తి కోసం చట్టం మారింది. కొత్త అధికార పార్టీ కోసం, కమిషనర్ పదవీ కాలం తగ్గింది. చట్టం ప్రజల కోసం అంటారు. ఇదంతా పార్టీ కోసం కాదు, గెలవడానికి కాదు, స్వార్థం కోసం కాదు, కేవలం ప్రజల కోసమనే అనుకోవాలి. తప్పదు.

ఎన్నికల కమిషనర్‌కు మూడేళ్లే పదవీ కాలం ఎందుకు ఉండాలి. అయిదేళ్లు ఎందుకు ఉండకూడదు? ఆర్డినెన్సును ప్రతిపాదించేముందు ప్రభుత్వం ఎవ్వరినైనా అడిగిందా? సంప్రదించిందా? అభిప్రాయ సేకరణ చేసిందా? పోనీ ఎందుకో ముఖ్యమంత్రికి గానీ గవర్నర్‌కు గానీ, మంత్రివర్గ సభ్యులకు గానీ తెలుసా? అసలు ఆలోచించారా ఎవరైనా? ఏ విధంగా రమేశ్ కుమార్‌ను తొలగించాలనే తొందర తప్ప ఇంకే లక్ష్యమేదైనా ఉందా? చెప్పగలరా?

కరోనావైరస్

ఫొటో సోర్స్, FACEBOOL/ANDHRAPRADESH/CMO

ఫొటో క్యాప్షన్, రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో వేడెక్కిన ఏపీ రాజకీయాలు

అంతా చీకటి, రహస్యం, తొందర

స్వేచ్ఛగా ఓటర్లు ఓటు వేయడానికి అనుకూలంగా వాతావరణం ఉండాలన్నది రాజ్యాంగ లక్ష్యం. స్వేచ్ఛా ఎన్నికలు మన రాజ్యాంగ మౌలిక స్వరూపం. ఎంత బాగుందీ మాట?

ఆర్డినెన్సు గురించి ఎవ్వరికీ తెలియదు. చెప్పరు. తరువాత అధికారి పదవీ స్వీకారం చేసేదాకా అంతా రహస్యంగా ఉండడం వ్యూహం, రాజకీయం, పాలనా సామర్థ్యం. ఎత్తుగడ. రాజకీయ అవసరం.

సమాచార హక్కు చట్టం 2005లో పారదర్శకత కోసం వచ్చింది. సెక్షన్ 4(1) సీ, డీ ఎవరూ చదవరు, ఎవరికీ అక్కరే లేదు. ప్రధానమైన విధాన నిర్ణయం తీసుకుంటే అందుకు కారణాలు, అవసరాలు, తొందర, పరిస్థితులు, ప్రయత్నాలు, సంప్రదింపులు, ప్రత్యామ్యాయాల ఆలోచన, మంత్రాంగం, లక్ష్యం ఉద్దేశం అన్నీ చెప్పాలి. తమంతట తామే ప్రజలకు తెలియ చెప్పాలి. ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టి ఎవరో అడిగేదాకా ఆగకూడదని చట్టం చెబుతున్నది. కానీ, చేసేదెవరు? చెప్పేదెవరు?

ప్రభుత్వాలు రాజ్యాంగ నియమాలు తెలిసి పాటించవు. పాటించనక్కర లేదని ప్రముఖ న్యాయవాద నిపుణులే సలహా ఇస్తారు. న్యాయవిభాగం దానికి తగిన ఫైల్ తయారు చేస్తుంది. తరువాత ప్రభుత్వం చేసిన చట్టాలు జీవోలు చెల్లవని కోర్టులో సవాలు చేస్తారు. విచిత్రమేమంటే చాలా సార్లు ప్రభుత్వం ఓడిపోతుంది.

ఎన్నికల కమిషనర్‌ను కేవలం పార్లమెంటు అభిశంసన ద్వారానే తొలగించాలి. మరోరకంగా తొలగించకూడదని ఎపీ చట్టం 200 సెక్షన్, ఆర్టికిల్ 243కె చెబుతున్నది. పదవీ కాలం తగ్గించడం అంటే పదవిలో ఉన్న వ్యక్తిని తొలగించడం ఒకటే కనుక చెల్లదని ఒక వాదం. అవి ఒకటి కాదు కనుక చెల్లుతుందని మరొక వాదం.

ములాయం సింగ్ యాదవ్

ఫొటో సోర్స్, AKHILESH YADAV TWITTER

ఫొటో క్యాప్షన్, ములాయం సింగ్ యాదవ్

రెండు తీర్పులు

ప్రభుత్వం వారు తమకు కావలసిన విధంగా ఉన్నాయనుకుని రెండు తీర్పులు వాడుకున్నారు. మొదటి తీర్పు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విద్యుచ్ఛక్తి సంస్థ అధ్యక్షుడి పదవీ కాలం తగ్గించి, ఆ పదవిలో ఉన్న కైలాస్ చంద్ మహాజన్‌ను తీసేయాలని కొత్త ప్రభుత్వం భావించింది. ఈ రాజకీయ సమస్యను రాజ్యాంగ నియమాలతో సరిచేయాలి. ఇది న్యాయవాదుల ప్రయత్నం. వారికో వీరికో మరెవరికో ఉపయోగపడేవో లేక ఏ ఉపయోగం లేనివో తీర్పులు చాలా కష్టపడి ఇప్పిస్తారు. 1992లో ఇలాగే కష్టపడి ప్రభుత్వాన్ని గెలిపించారు. కైలాస్ చంద్ మహజన్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పదవీ కాలం తగ్గించడం అంటే కైలాస్ చంద్‌ను తొలగించడం కాదు అని చెప్పింది. అధ్భుతమైన తీర్పు ఇప్పుడు ఎపీ ప్రభుత్వానికి ఇంతకన్న అనుకూలమైన తీర్పు మరొకటి లేదని అనుకున్నారు.

ఈ విషయం మరొక కేసులో ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్‌లో అపర్మిత ప్రసాద్ సింగ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేస్తూ స్థానిక ఎన్నికలలో హింసాత్మక సంఘటనలను ప్రశ్నించి కొన్ని బదిలీలు చెల్లవని తీర్పు చెప్పారు. ములాయం సింగ్ ప్రభుత్వానికి అది నచ్చలేదు. కనుక అపర్మిత్‌ను తొలగించాలని నిర్ణయించుకున్నారు. ప్రభువు చట్టం మార్చారు. పదవీకాలం తగ్గించారు. అపర్మిత్‌ను తొలగించారు. ఆయన సవాలు చేశారు. ప్రభుత్వం ఈ విధంగా వాదించింది... చపదవీ కాలం తగ్గించడం, తొలగించడం ఒకటే కాదని, కనుక రాజ్యాంగబద్దమే అని కైలాస్ చంద్ మహాజన్ కేసులో తీర్పు చెప్పారని ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పారు. దాన్ని కోర్టు పరిశీలించింది. కైలాస్ కేసులో ఆయనది రాజ్యాంగ పదవి కాదు. ఆయన్ను తొలగించే అధికారం పార్లమెంటుకే ఉంటుందనీ, రాష్ట్ర శాసనసభకు ఉండకూడదనే రక్షణ లేదు. కాబట్టి ఆ పదవిని తగ్గించడం, తొలగించడం ఒకటి కాదని ఆ కేసులో ఇచ్చిన తీర్పు ఈ కేసులో వర్తించదని సుప్రీంకోర్టు వివరించింది.

రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒకటి కాదు. ఎన్నికల కమిష్నర్‌ను ప్రత్యక్షంగా తొలగించే అధికారం శాసనసభకు ప్రభుత్వానికి లేనపుడు పరోక్షంగా కూడా తొలగించడానికి అధికారం ఉండదు. చట్టం ఉద్దేశానికి నియమాల అమలు ప్రభావానికి వైరుధ్యం ఉండకూడదు. ఎన్నికల కమిషనర్ స్వతంత్రతను రక్షించడమే ఉద్దేశం అని చెబుతూ, అతన్ని మధ్యలో తొలగించే ప్రక్రియను చేపట్టడం ఆ ఉద్దేశానికి వ్యతిరేకం అవుతుంది. ఈ తొలగింపు ఆర్టికిల్ 243కె సూత్రాలకు పూర్తి విరుద్ధంగా ఉంది కనుక రాజ్యాంగ విరుద్ధమే. ఇటువంటి ప్రయత్నాలు ఎప్పుడూ అనుసరించకూడదు అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. కేవలం సర్వీసు నియమాలు మార్చాం, అంతే అని మార్చడంలో తొలగింపు లేదు. కేవలం పదవీకాలం తగ్గింపు మాత్రమే ఉంది అని ప్రభుత్వ న్యాయవాది వాదించారు.

ఏ పేరుతో పిలిచినా పదవిలో ఉన్న వ్యక్తి పదవీకాలం పూర్తికాకముందే తగ్గించడం అంటే అది ఆయనను పదవి నుంచి తొలగించడమే అవుతుందని సుప్రీంకోర్టు చెప్పవలసి వచ్చింది. తనకు లేని అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించింది కాబట్టి అది చెల్లదని తీర్పు చెప్పింది. అయితే, అప్పడికే ములాయంసింగ్ యాదవ్ మరొక వ్యక్తిని ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. తన వాదం వినకుండా తీర్పు ఇవ్వరాదని సుప్రీంకోర్టును కొత్త కమిషనర్ కోరారు. ఆ సాకుతో కోర్టు తీర్పు వాయిదా వేసింది.

ఈ రెండు తీర్పులు తమకు అనుకూలం అని ఎపీ ప్రభుత్వ నిపుణులు భావిస్తున్నారు. కానీ మౌలిక సూత్రాలను పరిశీలిస్తే ఏ తీర్పు కూడా ఈ తొలగింపును సమర్థించే అవకాశం లేదు.

విచిత్రమేమంటే ఈ ఆర్డినెన్సును తొలగింపును సవాలు చేస్తూ మళ్లీ సుప్రీంకోర్టుకో, హైకోర్టుకో వెళ్తారు. కరోనావైరస్ వ్యాధి విస్తరించే ఆందోళనకరమైన సందర్భంలో న్యాయస్థానానికి సమయం దొరికి, ఈ వివాద విషయం పరిశీలనకు వచ్చి, న్యాయాన్యాయాల మీమాంస తేలేవరకు కరోనా వ్యాధి తగ్గిపోవచ్చు, స్థానిక ఎన్నికలు ముగిసి పోవచ్చు. గుర్రాలు రెక్కలొచ్చి ఎగిరినా ఆశ్చర్యం లేదు. అందాకా ప్రభుత్వం అనుకున్నట్టు జరుగుతుంది.

ఇది ప్రజాస్వామ్యమా లేక రాజ్యాంగ పాలనా? మన ప్రభుత్వాలు ప్రజలవా? వ్యక్తులవా? ఇదివరకు చంద్రన్న కానుక, ఇప్పుడు జగనన్న దయ.

(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)