కరోనావైరస్ మహమ్మారిని తెచ్చింది పేదలు కాదు... సంపన్నులే - అభిప్రాయం

కరోనావైరస్‌ వ్యాప్తికి పొట్టకూటి కోసం వలస వచ్చిన వాళ్లు బాధితులవుతున్నారు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కరోనావైరస్‌ వ్యాప్తికి పొట్టకూటి కోసం వలస వచ్చిన వాళ్లు బాధితులవుతున్నారు
    • రచయిత, ప్రొఫెసర్ బద్రీ నారాయణ్
    • హోదా, సామాజికవేత్త, బీబీసీ కోసం

సాధారణంగా ఏదైనా మహమ్మారి వ్యాపించినప్పుడు అందరి కన్నా పేదలే ఎక్కువ నష్టపోతుంటారు. వ్యాధి వ్యాప్తికి కూడా వాళ్లే కారణమని అందరూ భావిస్తుంటారు.

పేదల ద్వారానే మహమ్మారులు ప్రబలుతాయన్న అభిప్రాయం మధ్య, ధనిక తరగతుల్లో ఎక్కువగా ఉంటుంది. కానీ చరిత్రను మనం నిశితంగా గమనిస్తే, మహమ్మారులను పేద, మధ్య తరగతి వాళ్ల వరకూ మోసుకువచ్చేది ధనిక, ఉన్నత తరగతుల వాళ్లే అన్న విషయం తెలుస్తుంది.

అలహాబాద్ సమీపంలోని ఓ గ్రామంలో ఉండే ఒక ముసలాయనతో నేను ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్నా. కరోనావైరస్ గురించి, దాని నుంచి రక్షణ కోసం పాటించాల్సిన జాగ్రత్తల గురించి మేం చర్చిస్తూ ఉన్నాం.

‘‘మహమ్మారులు పేదల ద్వారా వ్యాపిస్తాయా? ధనికుల ద్వారా వ్యాపిస్తాయా?’’’ అని ఆయన నన్ను ప్రశ్నించారు.

అది నాకు ‘యక్షుడి ప్రశ్న’లా అనిపించింది. నగరాల్లో ఉండే మధ్య తరగతి ప్రజల్లో ఎవరిని అడిగినా, వాళ్లు వెంటనే ‘మురికివాడల్లో ఉండే జనాలు అపరిశుభ్రంగా ఉంటారు. వారి అపరిశుభ్రత నుంచే మహమ్మారులు వ్యాపిస్తాయి’ అని జవాబిస్తారు.

దినసరి కూలీలు, అసంఘటిత రంగ కార్మికులు, రైతులు లాక్‌డౌన్‌కు మూల్యం చెల్లించుకుంటున్నారు

ఫొటో సోర్స్, GETTYIMAGES

ఫొటో క్యాప్షన్, దినసరి కూలీలు, అసంఘటిత రంగ కార్మికులు, రైతులు లాక్‌డౌన్‌కు మూల్యం చెల్లించుకుంటున్నారు

చరిత్ర చెప్పిన పాఠాలేంటి

ప్రపంచంలో ఇప్పటివరకూ వ్యాపించిన మహమ్మారుల తాలూకు అనుభవాలను గమనిస్తే, ఓ ఆశ్చర్యకర విషయం బయటపడుతుంది.

165-180ల మధ్య వ్యాపించిన ఆంటోనియన్ ప్లేగు, 1520లకు అటూఇటుగా వ్యాపించిన స్మాల్ పాక్స్ లేదా యెల్లో ఫీవర్, 1817లో వ్యాపించిన రష్యన్ ఫ్లూ, ఆసియన్ ఫ్లూ, కలరా, ఇండియన్ ప్లేగు... ఇలా వీటిలో ఏయే వ్యాధి ఎవరి నుంచి ఎవరికి ప్రబలిందన్నది పరిశీలిస్తే, ధనికుల్లోని కొందరు, మధ్యతరగతి నుంచి ధనికవర్గంలో చేరే క్రమంలో ఉన్న వాళ్లు మొదట వ్యాధిని మోసుకువస్తారన్న విషయం బోధపడుతుంది.

ప్రపంచాన్వేషణలో ఉన్న నావికులు, వ్యాపారులు, ఓడలు నడిపేవాళ్లు, వాటిలోని సిబ్బంది, యుద్ధాల్లో పాల్గొనే సైనికులు, పర్యాటకులు, వలసవాద పాలన సమయంలో పాలకులు, అధికారులు, సిబ్బంది... ఇలా వీళ్లందరూ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వ్యాధులను మోసుకుపోతుండేవారు.

ఆ తర్వాత ఆయా దేశాల్లోని కాస్త వెనుకబడిన మధ్యతరగతి ప్రజలు, వాళ్ల నుంచి కింది స్థాయి తరగతులకు వ్యాధులు వ్యాపించేవి.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్‌ను మోసుకువచ్చింది ఎవరు

ప్రస్తుతం అన్ని దేశాలూ కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.

దీన్ని కూడా పర్యాటకులు, ప్రపంచాన్ని విమానాల్లో చుట్టేసేవాళ్లు, విదేశాల్లో పనిచేసే వాళ్లు, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కొందరు గాయకులు, పెద్ద పెద్ద అధికారులు, ఐదు నక్షత్రాల హోటళ్లలో పార్టీలు ఇచ్చేవాళ్లు, హనీమూన్‌ల కోసం గ్రీస్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌లకు వెళ్లేవాళ్లే మన దేశానికి తీసుకువచ్చారు.

ఓ సంభాషణ సందర్భంగా నా మిత్రుడు కరోనావైరస్ గురించి ఓ ఆసక్తికర అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘‘సోదరా! కరోనావైరస్ భలే విచిత్రమైన రోగం. విమానాల్లో తిరుగుతుంది. ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉంటుంది. గ్లోబలైజేషన్, నియో లిబరల్ ఎకానమీలను సొమ్ము చేసుకునేవారితో కలిసి మన దేశంలోకి వస్తుంది’’ అని అన్నారు.

‘‘కానీ, ట్యాక్సీ డ్రైవర్లు, హోటల్ వెయిటర్లు, దుకాణాలు నడుపుకునేవాళ్లు... అంటే పొట్టకూటి కోసం దేశంలో ఓ పట్టణం నుంచి ఇంకో పట్టణానికి వెళ్లినవాళ్లు దీనికి బాధితులవుతున్నారు. వివిధ సమాజాల్లోని కొన్ని శక్తిమంతమైన వర్గాలు కరోనా మహమ్మారిని పేదల వరకూ తీసుకువస్తున్నాయి’’ అని చెప్పారు.

మహమ్మారులు వ్యాపించినప్పుడు అందరి కన్నాఎక్కువ నష్టపోయేది పేదలే

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, మహమ్మారులు వ్యాపించినప్పుడు అందరి కన్నాఎక్కువ నష్టపోయేది పేదలే

మన సమాజంలోని పేదలు, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ లాంటి రాష్ట్రాల నుంచి ముంబయి, దిల్లీ లాంటి మహానగరాలకు వలస వచ్చిన కూలీలు ఈ వ్యాధిని మోసుకురాలేదు.

మురికి, రోగాలకు వ్యాపించేందుకు కారణమని మనం భావించే మురికివాడల వాళ్లు ఈ మహమ్మారిని తీసుకురాలేదు.

మన దృష్టి మారాల్సిన అవసరం ఉందని ఈ మహమ్మారుల వ్యాప్తులన్నీ చెబుతున్నాయి.అంటు వ్యాధులకు పేదరికం కారణమన్న ఆలోచనను మన మెదళ్ల నుంచి, మనసుల నుంచి తీసివెయ్యాలి. లేకపోతే, మన మహానగరాల్లోని ‘ఉన్నత’ శ్రేణులు కార్మికులను, పేదలను, మురికివాడల జనాలను చిన్నచూపు చూస్తూనే ఉంటాయి.

కరోనావైరస్‌ను నివారించేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు.. వ్యాధి వ్యాప్తితో ఏ సంబంధమూ లేని దినసరి కూలీలు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు మూల్యం చెల్లించుకుంటున్నారు.

అలాంటి వర్గాల సమస్యలను అర్థం చేసుకుని, కరోనా కవర్ కింద అనేక పథకాలను ప్రభుత్వాలు తీసుకురావడం మంచి విషయం.

మహమ్మారుల వ్యాప్తిని కూడా మనం అంతే సున్నితత్వం, వాస్తవిక దృష్టితో చూసి అర్థం చేసుకోవాలి.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)