తండ్రి మారుతీరావు మరణం తర్వాత తొలిసారి తల్లిని కలిసిన అమృత - ప్రెస్ రివ్యూ

అమృత

ఫొటో సోర్స్, AMRUTHA.PRANAY.3/FACEBOOK

ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆయన కుమార్తె అమృత పోలీసుల రక్షణలో తల్లిని కలిసిందని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్యకేసులోని ప్రధాన నిందితుడు మారుతీరావు కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే.. తండ్రిని కడసారి చూడటానికి వెళ్లిన అమృతను కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకోవడంతో వెనుదిరిగింది.

శనివారం నాడు సాయంత్రం మీడియా కంట పడకుండా.. పోలీసుల రక్షణతో మిర్యాలగూడలోని తల్లి గిరిజ నివాసానికి అమృత వెళ్లింది అని పత్రిక రాసింది.

తన ఇంటి నుంచి కారులో తన కొడుకుతో కలిసి అమృత వెళ్లగా.. వెనుక పోలీసులు ఫాలో అవుతూ వచ్చారని చెప్పింది.

అయితే తల్లిని కలుస్తున్నాన్న విషయాన్ని అమృత మీడియాకు చెప్పలేదు. అంతేకాదు.. తల్లిని కలిసిన తర్వాత మీడియాతో కూడా అమృత మాట్లాడలేదు.

అమృత తన కుమారుడ్ని తీసుకుని తల్లి వద్దకు వెళ్లింది. అమృతను చూసిన గిరిజ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యింది. సుమారు పావుగంట పాటు తల్లి-అమృత ఇద్దరు మాట్లాడుకున్నారు.

తల్లిని పరామర్శించిన అనంతరం మారుతీరావు నివాసం నుంచి పోలీసుల రక్షణతో తిరిగి తన అత్తారింటికి అమృత వెళ్లిపోయింది. స్థానికులు చెప్పడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసిందని పత్రిక తెలిపింది.

నామినేషన్ల ప్రక్రియ

ఫొటో సోర్స్, facebook/Va Sam

రణరంగంగా మారిన ఉపసంహరణ ప్రక్రియ

జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ, మునిసిపల్ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ రణరంగంలా మారిందని ఈనాడు కథనం ప్రచురించింది.

ప్రతిపక్ష అభ్యర్థులను బెదిరించి వారిని శనివారం కార్యాలయాలకు రప్పించి అధికార పక్ష నాయకులు చుట్టుముట్టి ఉపసంహరణ పత్రాలపై సంతకాలు చేయించారనే ఆరోపణలు వచ్చాయి అని రాసింది.

నామినేషన్ల దాఖలుకు వచ్చిన స్థాయిలోనే భారీగా ఉపసంహరణలకూ వచ్చారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిపల్ అభ్యర్థుల నామినేషన్ల వ్యవహారం పలు జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తలకు కారణమైంది.

గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ తరఫున నామినేషన్లు వేసిన ఇద్దరు అభ్యర్థులు ఉపసంహరించుకోగా.. జనసేన అభ్యర్థి బాలూనాయక్ నిరాకరించారు.

నామినేషన్ వేసినప్పటి నుంచి స్థానికంగా లేకపోయినా ఆయన ఆచూకీ కనుగొన్న వైసీపీ నాయకులు.. ఒక వాహనంలో మధ్యాహ్నం 2.50 గంటలకు ఆయన్ను తీసుకొచ్చి.. రిటర్నింగ్ అధికారి దగ్గరకు బలవంతంగా లాక్కెళ్లి బలవుంతంగా నామినేషన్ పత్రాలపై సంతకం చేయించారు అని కథనంలో చెప్పింది.

అదే జిల్లా ముప్పాళ్లలో టీడీపీ అభ్యర్థిని గోగుల గంగమ్మను బలవంతంగా రిటర్నింగ్ అధికారి దగ్గరకు తీసుకెళ్లి ఉపసంహరణ పత్రంపై వేలిముద్ర వేయించారని రాశారు.

పలు ఎంపీటీసీ స్థానాల్లో బరిలో ఉన్న టీడీపీ, ఇతర ప్రతిపక్ష అభ్యర్థులతో బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేశారని ఈనాడు చెప్పింది.

కళ్లముందే బీ-ఫారాలు చించేస్తున్నా పోలీసులు మిన్నకుండిపోయారని పత్రిక కథనంలో వివరించింది.

వైసీపీ

ఫొటో సోర్స్, facebook/YSR Congress Party - YSRCP

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మొత్తం 652 స్థానాల్లో 125 స్థానాలు ఏకగ్రీవంగా గెలుచుకుందని సాక్షి కథనం రాసింది.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసే సరికి అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏకగ్రీవాల్లో సరికొత్త రికార్డు సృష్టించిందని చెప్పింది.

రాష్ట్రంలో 652 జెడ్పీటీసీ స్థానాలకు గాను 125 స్థానాలను ఆ పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. శనివారం రాత్రి 12 గంటల సమయానికి జిల్లాల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కార్యాలయానికి అందిన ప్రాథమిక సమాచారం మేరకు 9,696 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, అందులో 2000 స్థానాలకు పైగా ఏకగ్రీవం అయ్యాయి.

మండలానికి ఒక జెడ్పీటీసీ స్థానం ఉంటుంది. ఈ లెక్కన 125 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడం అరుదని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నట్లు సాక్షి చెప్పింది.

గత ఐదేళ్ల పాలనలో జన్మభూమి కమిటీలు, టీడీపీ నేతల ఆగడాల పట్ల ప్రజలకు ఉన్న వ్యతిరేకత, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 9 నెలల జనరంజక పాలన పట్ల గ్రామీణ ప్రజలు చూపిస్తున్న ఆదరణతోనే స్థానిక టీడీపీ నేతలు పలుచోట్ల పోటీకి దూరంగా ఉన్నారనేది స్పష్టమైందని కథనంలో చెప్పారు.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది.

దీంతో ఆయా స్థానాల్లో ఎంత మంది పోటీలో ఉన్నారన్న వివరాలతో జిల్లాలో ఎక్కడికక్కడ రిటర్నింగ్‌ అధికారులు జాబితాలు విడుదల చేశారు.

ఒక్క అభ్యర్థే పోటీలో ఉన్న చోట ఎన్నిక ఏకగ్రీవం ఎన్నికయినట్లు రిటర్నింగ్‌ అధికారులు స్థానికంగా ప్రకటించినట్లు సాక్షి వివరించింది.

అనుష్క

ఫొటో సోర్స్, facebook/Anushka Shetty

పెళ్లి గురించి వస్తున్న వార్తలను పట్టించుకోనని నమస్తే తెలంగాణకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సినీ నటి అనుష్క చెప్పారు.

పెళ్లి గురించి చెబుతారా అని అడిగితే..

పెళ్లికి నేను వ్యతిరేకం కాదు. అందుకు టైమ్‌ రావాలి. సరైన భాగస్వామి దొరకాలి. జీవితంలో అమ్మానాన్నలు ఎంత ముఖ్యమో పెళ్లిచేసుకునే వ్యక్తికి అంతే ప్రాధాన్యం ఉంటుంది. పెళ్లి అనేది ఓ అందమైన భావన. దానిని రహస్యంగా దాచిపెట్టలేం. పెళ్లిచేసుకుంటే అందరికీ తెలిసిపోతుంది. పెళ్లి గురించి రూమర్స్‌ వచ్చినపుడు పట్టించుకోకుండా వదిలివేస్తాను అని అనుష్క చెప్పారు.

ఈ మధ్యకాలంలో మీ పెళ్లిపై చాలా వార్తలు వినిపించాయి?

వాటిలో చాలావరకు నా వరకు రాలేదు. నేను టీవీ చూడను. వార్తలు చదవను. ఎవరైనా నీ గురించి ఫలానా వార్త వచ్చిందని చెబితేనే నాకు తెలుస్తుంది. ఎందుకు రాస్తారో నాకు తెలియదు. సోషల్‌మీడియాలో నేను లేను. నా అభిమానులే ఓ ఖాతాను కొనసాగిస్తున్నారు. అందులో నా గురించిన పాజిటివ్‌ వార్తలే పోస్ట్‌ చేస్తుంటారు. రూమర్స్‌ వస్తూనే ఉంటాయి. వాటి గురించి ఏం చేయలేము అని తెలిపారు.

'బాహుబలి' చిత్రం మీకు ఎలాంటి సంతృప్తిని మిగిల్చింది?

నా కెరీర్‌లో అన్ని షేడ్స్‌ ఉన్నగొప్ప పాత్రను పోషించే అవకాశం రావడం అదృష్టంగా అనిపించింది. యువరాణిగా, తల్లిగా, బందీగా నా పాత్రలో భిన్న పార్శాలుంటాయి. నటనపరంగా, వ్యక్తిగతంగా ప్రతి అంశంలో ఈ సినిమా సంతృప్తిని మిగిల్చింది. అందరం కుటుంబంలా కలిసిపోయి పనిచేశాం. మా కష్టానికి పెద్ద స్థాయిలో విజయం దక్కడంతో కన్నీళ్లు వచ్చాయి. కొన్నిసార్లు అలాంటి అద్భుతాలు జరుగుతాయి అని సమాధానం ఇచ్చారు.

Sorry, your browser cannot display this map