కేంద్ర పాలిత ప్రాంతం అంటే ఏమిటి.. యూటీలు ఎన్ని రకాలు.. వాటి అధికారాలేమిటి?

ఫొటో సోర్స్, Getty Images
జమ్మూ-కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించే పునర్విభజన బిల్లు సోమవారం రాజ్యసభలో ఆమోదం పొందింది.
ఈ బిల్లు జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రతిపాదించింది. అయితే, ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు(యూటీ) ఒక విధమైనవి కావు.
ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన సమయంలో అమిత్ షా మాట్లాడుతూ, చట్టసభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ-కశ్మీర్, చట్టసభలేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్ ఉంటుందని ప్రకటించారు.
లద్దాఖ్ వాసులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న కేంద్ర పాలిత హోదా ఇప్పుడు ఆ ప్రాంతానికి దక్కిందని ఈ సందర్భంగా అమిత్ షా చెప్పారు.

ఫొటో సోర్స్, lstv
అంతర్గత భద్రత, సీమాంతర ఉగ్రవాదాన్ని దృష్టిలో పెట్టుకొని జమ్మూ-కశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చినట్లు తెలిపారు. అయితే, దీనికి శాసన సభ ఉంటుందని చెప్పారు
కేంద్రపాలిత ప్రాంతం అంటే?
కేంద్ర పాలనలో ఉండే చిన్న ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతం అంటారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ప్రాంత పాలన ఉంటుంది. ఇప్పటి వరకు దేశంలో ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. దిల్లీ, పుదుచ్చేరి, అండమాన్-నికోబర్ దీవులు, దాద్రా-నగర్ హవేలీ, చంఢీగర్, డామన్-డయ్యూ, లక్షదీవులు. కొత్తగా నిర్ణయించిన జమ్మూ కశ్మీర్, లద్ధాఖ్ యూటీలు కూడా ఏర్పడితే కేంద్ర పాలిత ప్రాంతాలు తొమ్మిది అవుతాయి.
అయితే, దిల్లీ, పుదుచ్చేరి చట్టసభలున్న కేంద్రపాలిత ప్రాంతాలు కాగా, మిగిలినవి చట్టసభలు లేని కేంద్రపాలిత ప్రాంతాలు.

ఫొటో సోర్స్, Getty Images
రాష్ట్రంతో పోల్చితే యూటీ ఏ విధంగా భిన్నమైంది?
ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాన్ని కలిగి ఉన్న పరిపాలనా విభాగంగా రాష్ట్రాలను నిర్వచిస్తారు. ఇవి సొంతంగా చట్టాలను రూపొందించుకోవచ్చు. పారిపాలన కోసం ముఖ్యమంత్రి, మంత్రివర్గం ఉంటుంది. చట్ట సభ ఉంటుంది.
రాజ్యసభకు ప్రాతినిధ్యం ఉంటుంది. కానీ, కేంద్ర పాలిత ప్రాంతం పాలన నేరుగా కేంద్ర చేపడుతుంది.
శాసన సభ ఉన్న, లేని కేంద్రపాలిత ప్రాంతాలకు బేధం ఏమిటి?
దిల్లీ, పుదిచ్చేరి మాదిరిగా ఉన్న యూటీలకు శాసన సభ ఉంటుంది. ఎన్నుకున్న ఎమ్మేల్యేలు ఉంటారు. అయితే, ఎగువ సభ(విధాన సభ) ఉండదు. తుది నిర్ణయం లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటుంది. ఈయనను కేంద్రం నియమిస్తుంది. చట్టసభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఒక విధంగా పాక్షిక రాష్ట్రం అని చెప్పొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
లద్దాఖ్, జమ్మూ-కశ్మీర్లకు తేడా ఏమిటి?
ఈ బిల్లు చట్టంగా మారితే లద్దాఖ్ కేంద్ర పాలనలో ఉండే యూటీ అవుతుంది. జమ్మూ-కశ్మీర్ పాక్షక రాష్ట్ర హోదా ఉండే యూటీ అవుతుంది. అయితే, సరైన సమయం వచ్చినప్పుడు జమ్మూ-కశ్మీర్ను తిరిగి రాష్ట్రంగా మార్చడానికి కేంద్రం సిద్ధంగా ఉందని అమిత్ షా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- సుష్మా స్వరాజ్ ‘తెలంగాణ చిన్నమ్మ’ ఎలా అయ్యారు? రాష్ట్ర ఏర్పాటులో ఆమె పాత్ర ఏంటి?
- కశ్మీరీ పండిట్లు: 'ఎన్నో మరణాలు, రక్తపాతాలు చూశాం. కానీ, ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు'
- ఆర్టికల్ 370 సవరణ: ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తారా?
- 'ఆర్టికల్ 370 సవరణ' తర్వాత కశ్మీర్లో పరిస్థితి ఎలా ఉంది? స్థానికులు ఏమంటున్నారు?
- ఆర్టికల్ 370 సవరణ: 'కశ్మీర్కు భారత్ ద్రోహం చేసింది, పాకిస్తాన్ను కాదని భారత్లో విలీనమై మేం తప్పు చేశాం'
- 'ఆర్టికల్ 370 సవరణ', జమ్మూ కశ్మీర్ విభజన: 'ఏదో ఒక రోజు మళ్లీ రాష్ట్రం హోదా ఇస్తాం'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








