రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సిద్ధూ ప్రశ్న: ‘రఫేల్’తో సైన్యం స్థైర్యం దెబ్బతినదా?

సిద్ధూ

ఫొటో సోర్స్, AFP/Getty Images

పాకిస్తాన్ గత ప్రభుత్వాలతో పోలిస్తే ప్రస్తుత ఇమ్రాన్‌ ఖాన్ ప్రభుత్వం ఎంతో భిన్నమైనదని కాంగ్రెస్ నాయకుడు, పంజాబ్ పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకొనేందుకు భారత్ చొరవ చూపాలని ఆయన సూచించారు.

సిద్ధూ చండీగఢ్‌లో బీబీసీ ప్రతినిధి అర్వింద్ ఛాబ్రాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

భారత్‌లోని సిక్కుల ఆకాంక్షకు అనుగుణంగా పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను తెరిచేందుకు పాక్ అంగీకరించిందని, తద్వారా రెండు అడుగులు ముందుకు వేసిందని, దీనిని దృష్టిలో ఉంచుకొని భారత్ కనీసం ఒక్క అడుగైనా వేయాలని ఆయన సూచించారు.

70 ఏళ్లుగా కర్తార్‌పూర్ సాహిబ్‌ను సందర్శించడానికి భారత్‌లోని సిక్కులకు అనుమతి లేదని సిద్ధూ చెప్పారు.

ఫొటో సోర్స్, Wikipedia

ఫొటో క్యాప్షన్, 70 ఏళ్లుగా కర్తార్‌పూర్ సాహిబ్‌ను సందర్శించడానికి భారత్‌లోని సిక్కులకు అనుమతి లేదని సిద్ధూ చెప్పారు.

బీబీసీ: కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ అంశంలో గందరగోళం నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఒక పాకిస్తాన్ మంత్రేమో భారతీయులను అనుమతిస్తామని చెబుతున్నారు, మరొకరేమో దీనిపై సమాచారం లేదని అంటున్నారు. వాస్తవం ఏమిటి?

సిద్ధూ: గందరగోళం ఏమీ లేదు. గురునానక్ బోధనలను విశ్వసించే పది కోట్ల మంది (నానక్-నామ్ లేవా శర్దాలూస్) దృష్టిలోంచి చూడాల్సి ఉంది. కర్తార్‌పూర్ సాహిబ్‌లో గురునానక్ 18 ఏళ్లు ఉన్నారు. ఇది సిక్కులకు మక్కా లాంటిది. 70 ఏళ్లుగా కర్తార్‌పూర్ సాహిబ్‌ను సందర్శించడానికి భారత్‌లోని సిక్కులకు అనుమతి లేదు. దీనిని సందర్శించాలనుకొనేవారి కోణంలోంచి మనం ఆలోచించాల్సి ఉంది.

ఇమ్రాన్ ఖాన్, సిద్ధూ

ఫొటో సోర్స్, AFP

బీబీసీ: గత నెల్లో ఇస్లామాబాద్‌లో పాక్ సైన్యాధిపతి ఖమర్ జావేద్ బాజ్వాను మీరు ఆలింగనం చేసుకోవడం భారత సైనిక బలగాల స్థైర్యాన్ని దెబ్బతీసిందన్న రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై మీరేమంటారు?

సిద్ధూ: సిద్ధూ అంత పెద్దోడా? అరక్షణంపాటు సిద్ధూ చేసుకున్న ఆలింగనంతోనే సైన్యం స్థైర్యం దెబ్బతింటుందా? రఫేల్ యుద్ధవిమానాల కుంభకోణంతో సైన్యం స్థైర్యం దెబ్బతినదా? కర్తార్‌పూర్ సాహిబ్ సందర్శించాలనుకుంటున్న పది కోట్ల మంది ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొనే నేను అలా వ్యవహరించాను.

సిద్ధూ

ఫొటో సోర్స్, NARINDER NANU/GETTY IMAGES

బీబీసీ: భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ మళ్లీ మొదలవ్వాలని మీరు అనుకుంటున్నారా?

సిద్ధూ: ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు జరగడం మంచి సంకేతం. క్రీడాకారులు దేశాల మధ్య వారధులుగా నిలుస్తారు. అడ్డుగోడలను తొలగిస్తారు. చర్చలు, వాణిజ్యం తప్పనిసరి. అలాగే రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు కూడా. ఈ చర్యలతో ఉభయ దేశాలు దగ్గరవుతాయి.

పాక్, భారత్ క్రికెటర్లు

ఫొటో సోర్స్, Getty Images

బీబీసీ: మాదక ద్ర్యవాలు, నిరుద్యోగిత- ఇలా చాలా సమస్యలను పంజాబ్ రాష్ట్రం ఎదుర్కొంటోంది. వీటి గురించి ఎవరూ మాట్లాడటం లేదు...

సిద్ధూ: ఈ సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నారు. రుణాల పంపిణీ చేపడుతున్నారు.

బీబీసీ: ఈ చర్యలు సరిపోతాయా?

సిద్ధూ: గత ప్రభుత్వాలు ఏం చేశాయి? అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వాలు గత పదేళ్లలో ఏమైనా చేశాయా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరే అయ్యింది. ఈ సమస్యల పరిష్కారం అంత సులభం కాదు. సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)