రామేశ్వరం: మందిరమైనా.. మసీదైనా.. లోపలికెళితే ఒకేలా ఉంటాయిక్కడ

విభిన్న సంస్కృతుల్ని ప్రతిబింబిస్తుంది వాస్తు శిల్పకళ. ప్రతి రాచ వంశీయుడూ తమ కాలానికి చెందిన వాస్తు నిర్మాణ శైలికి అద్దం పట్టేలా తమతమ రాజ్యాల్లో వివిధ కట్టడాలను నిర్మించారు. వారి హయాంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా నాటి వాస్తుకళకు సాక్ష్యాలుగా నిలిచేవే. తమిళనాడులోని రామేశ్వరం ప్రాంతంలో అలాంటి మందిరాలు, మసీదులు చాలా ఉన్నాయి. ఆ ఆధ్యాత్మిక క్షేత్రాలు చారిత్రక వారసత్వాన్ని ఒక తరం నుంచి మరో తరానికి ఎలా చేరుస్తున్నాయో ఓసారి చూద్దాం.
రామేశ్వరంలో హిందూ-ముస్లింల స్నేహానుబంధానికి సంబంధించి ఎన్నో కథలున్నాయి.
రామేశ్వరం, దాని పరిసరాల్లో ఉండే చాలా ఆలయాలు, మసీదుల్లో ఒకే రకమైన వాస్తు నిర్మాణ శైలి కనిపిస్తుంది.
‘‘మత సామరస్యానికి తమిళనాడు పెట్టింది పేరు. ఎందుకంటే ఇక్కడకు ఇస్లాం వాణిజ్యం ద్వారా అడుగు పెట్టింది.. ఉత్తర భారతంలోలా యుద్ధాల ద్వారా కాదు. ఎంతో మంది వ్యాపారస్థులు ఇక్కడికి వ్యాపారం కోసం వచ్చారు’’ అని చరిత్రకారుడు బెర్నార్డ్ డి సమి తెలిపారు.


ఈ మసీదును హిందూ రాజు కిళవన్ సేతుపతి హయాంలో ముస్లిం వ్యాపారి సీతాకథి నిర్మించారు.
‘‘ఈ వాస్తు నిర్మాణంలో మనం ప్రధానంగా గుర్తించాల్సిందేంటంటే.. ఇవన్నీ స్తంభాలతో కూడిన భవనాలు. వాటిపై ఎలాంటి గోపురాలు, గుమ్మటాలు కనిపించవు. అట్లాగే ఇవన్నీ సమతలంగా ఉంటాయి. స్తంభాలన్నీ రాతి నిర్మాణాలే. ఇక రామేశ్వరంలో ఆలయాల్లో, మసీదుల్లో, రామ్నాథ్ ప్యాలస్ - ఈ మూడు చోట్లా నిర్మాణ శైలి ఒకేలా ఉంటుంది. రాచభవనానికి, మసీదుకి, మందిరానికి పెద్ద తేడా ఏమీ కనిపించదు’’ అని సమి చెప్పారు.
సీతాకథి 17వ శతాబ్దంలో ఈ మసీదును ద్రవిడ శైలిలో నిర్మించారు. మసీదు లోపల అంతా హిందూ ఆలయంలాంటి నిర్మాణ శైలి కనిపిస్తుందిక్కడ.


‘‘వాస్తునిర్మాణాలకు ఈ ప్రాంతం చాలా ప్రసిద్ధి. చాలా భవనాలు ఒకేలా ఉంటాయి. అన్నీ ప్రత్యేకమైన ద్రవిడ నిర్మాణ శైలిలో ఉంటాయి. ప్రతి భవనంలోనూ స్తంభాలు కనిపిస్తాయి. అయితే వాటిలో ఒకటి మందిరమైతే.. ఇంకొకటి మసీదు. మందిరంలో ఉన్న స్తంభాలపై శిల్పాలుంటే.. మసీదులో ఉన్న స్తంభాలపై పూల డిజైన్లుంటాయి’’ అని కిళకరై పట్టణానికి చెందిన ఎ.ఎం.ఎం. కధిర్ బక్ష్ అన్నారు.


హిందూ రాచకుటుంబ సభ్యులు రామ్నాథ్ పండగల సందర్భంలో మసీదులకు అతిథులుగా వెళ్తుంటారు.
రామ్నాథ్లో కిళకరైకి చెందిన ముస్లిం సముదాయానికి చెందిన వ్యక్తి పెద్ద క్రీడామైదానాన్ని నిర్మించి, దానికి ముస్లిం వ్యాపారి, హిందూ రాజుల పేర్లతో.. సీతాకథి సేతుపతి మైదానం అని పేరు పెట్టారు.
రామ్నాథ్లోని పెద్దలంతా సేతుపతి, సీతాకథిలా తమ భవిష్యత్ తరాల వారు కూడా మత సామరస్యంతో మెలగాలని ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- హిందూమతం స్వీకరించి, ఆవుల్ని ఆదుకుంటున్న జర్మన్ మహిళ
- వియత్నాం హిందువులు : ఒకప్పుడు రాజ్యాలు ఏలారు.. ఇప్పుడు కనుమరుగవుతున్నారు
- ప్రాణాలు నిలుపుకోడానికి.. మతం మారుతున్నారు!
- ప్రపంచంలో ‘పవిత్రమైన’ ఏడు మొక్కలు
- టర్కీ: ఇస్లాంను తిరస్కరిస్తున్న యువత
- అస్సాం: ‘అడవుల్ని ఆక్రమిస్తున్న టీ తోటలు’.. మనుషుల్ని చంపుతున్న ఏనుగులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









