గ్రౌండ్రిపోర్ట్: ‘మా అమ్మాయిపై చేతులు వేసిన వాళ్లకు ఉరిశిక్ష పడాలి’

ఫొటో సోర్స్, RAVI PRAKASH/BBC
- రచయిత, రవిప్రకాశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
''వాళ్లు మా అమ్మాయి ఒంటిపై ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి తడిమారు. జంతువులు కూడా ఇంత క్రూరంగా వేటాడవు. ఇలాంటి ఘటనపై ఏం మాట్లాడాలి? వాళ్లను ఉరితీయాలి. నా మనవరాలు ఆ రోజు ఇంటికి ఏడ్చుకుంటూ వచ్చింది. నేను ఎంత అడిగినా ఏం చెప్పలేదు. 29వ తేదీన పోలీసులు మా ఇంటికి వచ్చినపుడు మొత్తం విషయం బయటకు వచ్చింది. వాళ్లకు మరణశిక్ష పడాలి.''
ఇది చెప్పి ఆమె ఏడ్వడం ప్రారంభించారు. ఆపై మాట్లాడ్డం ఆమె వల్ల కాలేదు. ఇటీవల బిహార్లో కొంతమంది ఒక బాలిక మీద పడి ఎక్కడ పడితే అక్కడ తడుముతున్న వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలోని బాలిక నానమ్మ ఆమె.
తన కుమారునికి (బాధితురాలి తండ్రికి) ఈ ఘటన గురించి చెప్పలేదని ఆ వృద్ధురాలు తెలిపారు. ఆమె కుమారుడు దిల్లీలో కూలీ పని చేస్తున్నాడు.
70 ఏళ్ల ఆ వృద్ధురాలు, ఆమె భర్త, ముగ్గురు కుమారులు, మనవలు, మనవరాళ్లు అంతా గ్రామంలోనే నివసిస్తున్నారు. తన కుటుంబంలో బాధితురాలే పెద్దది. ఆ గ్రామం నుంచి జెహానాబాద్కు వెళ్లి చదువుకున్నది కూడా ఆమె ఒకర్తే.

ఫొటో సోర్స్, RAVI PRAKASH/BBC
గ్రామంలోని దళితుల స్థితి
83వ జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఆ గ్రామంలో నేను కొంత సేపు ఉన్నాను.
ఆ గ్రామంలో సుమారు 400 కుటుంబాలున్నాయి. ఇక్కడ రవిదాస్ కులానికి చెందిన వారు ఉంటున్నారు. బిహార్ ప్రభుత్వం రవిదాస్లను మహాదళితుల్లోకి చేర్చింది. గ్రామంలో ఎక్కువ మంది ఈ కులానికి చెందిన వారే. వాళ్ల తర్వాత ఎక్కువ జనాభా మాంఝీలది. గ్రామంలో యాదవులు, ముస్లింలు కూడా ఉన్నారు.
చాలా ఏళ్ల క్రితం ముస్లింలు రవిదాస్లకు భూమినిచ్చి అక్కడే ఉండమనన్నారు. అయితే వాళ్లకు ఇచ్చిన భూములకు పట్టాపత్రాలు లేవు. అందువల్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం వీళ్లకు వర్తించలేదు. ఇక్కడ 90 శాతం ఇళ్లు కచ్చావే. వీళ్లు ప్రధానంగా కూలి పని చేసి జీవిస్తుంటారు.
బాధితురాలి ఇంటికి వెళ్లడానికి నేను ఇరుకైన సందుల గుండా వెళ్లాల్సి వచ్చింది. వాళ్ల ఇంటి వద్ద రక్షణ కోసం పోలీసులను ఏర్పాటు చేశారు. ఎంతో ప్రయత్నిస్తే కానీ వాళ్ల ఇంటికి వెళ్లడానికి అనుమతి దొరకలేదు.
ఆ ఇంటికి పల్చని పరదా వేలాడుతోంది. పరదా వెనకాల కూర్చున్న బాధితురాలి పక్కనే ఆమె స్నేహితురాళ్లు కొంతమంది కూర్చున్నారు. కానీ వాళ్లు నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు.

ఫొటో సోర్స్, RAVI PRAKASH/BBC
కన్నతల్లి ఆక్రోశం
బాధితురాలి ఇంట్లో నేను ఆమె తల్లిని ఇదంతా ఎలా జరిగిందని ప్రశ్నించాను. ''ఏం జరిగిందో చెప్పాల్సింది మీరే. మా కూతురు ఏప్రిల్ 25న జెహానాబాద్లోని కోచింగ్ సెంటర్కు వెళ్లింది. ఉదయం 9 గంటలకు క్లాసులు అయిపోయాయి. అప్పుడు తన స్నేహితురాలి బంధువు ఒకరు వచ్చి ఆమెను ఇంటి దగ్గర దిగబెడతాన్నాడు. వాళ్లిద్దరూ ఇంటికి వస్తుండగా ఈ సంఘటన జరిగింది'' అని ఆమె తెలిపారు.
జరిగిన సంఘటన గురించి నేను మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా ఆమె కోపంతో,''నాకేమీ తెలీదు. మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోండి'' అన్నారు.

ఫొటో సోర్స్, RAVI PRAKASH/BBC
'ఒక్కరే పరారీలో ఉన్నారు..'
ఏప్రిల్ 25న బాధితురాలి వీడియో వైరల్ కావడంతో, బిహార్ పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేశారు. మొత్తం 13 మంది నిందితుల్లో 12 మందిని అరెస్ట్ చేశారు.
జెహానాబాద్ ఎస్పీ మనీష్, ''ప్రస్తుతం ఆ బాలికను బైక్ మీద తీసుకెళ్లిన కుర్రాడు మాత్రం పరారీలో ఉన్నాడు'' అని బీబీసీకి తెలిపారు.
త్వరలోనే అతణ్ని కూడా పట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








