కునాల్ కమ్రా: ఫేక్ న్యూస్ నిబంధనలపై ఈ కమెడియన్ కోర్టుకు ఎందుకు వెళ్లారు?

కునాల్ కమ్రా

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కొత్త రూల్స్‌పై బొంబై హైకోర్టుకి వెళ్లిన కునాల్ కమ్రా
    • రచయిత, రాఘవేంద్ర రావు
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ

భారత ప్రభుత్వం ఏప్రిల్‌ నెలలో నకిలీ వార్తల కట్టడి కోసం సరికొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది.

ఈ రూల్స్ ద్వారా, తన సొంత ఫ్యాక్ట్ చెక్ యూనిట్ చెప్పిన దాని ప్రకారం ‘‘తప్పుడు, నకిలీ లేదా తప్పుదోవ పట్టించే’’ వార్తలను ప్రకటించే అధికారం ప్రభుత్వానికి వస్తుంది.

ఈ సవరించిన సమాచార సాంకేతిక(ఐటీ) నిబంధనలు ట్విటర్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా సంస్థలకు కూడా వర్తిస్తాయి.

ప్రభుత్వ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ చెబితే, ఆ సంస్థలు తమ కంటెంట్‌ను తొలగించాల్సి ఉంటుంది.

ఒకవేళ ఈ నిబంధనలకు సోషల్ మీడియా సంస్థలు కట్టుబడి ఉండకపోతే, ఆ సంస్థలు తమ ‘సేఫ్ హార్బర్’ అంటే సురక్షితమైన సాధనమనే స్టేటస్‌ను కోల్పోతాయి.

ఈ నిబంధనలను ప్రస్తుతం కోర్టులో సవాలు చేశారు. దీంతో, జూలై 5 వరకు ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌ను నోటిఫై చేయడం లేదని ప్రభుత్వం తెలిపింది. అంటే, ప్రస్తుతానికి ఈ కొత్త నిబంధనలు దేశంలో అమల్లోకి రావడం లేదు.

కానీ, ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిబంధనలు దేశంలో పత్రికా స్వేచ్ఛపై ప్రతికూల ప్రభావాలు చూపనున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఈ కొత్త నిబంధనలను చాలా కఠినమైనవిగా పేర్కొంది.

సహజ న్యాయ సిద్ధాంతాలకు ఇవి వ్యతిరేకంగా ఉన్నాయని, సెన్సార్‌షిప్‌కు సమానమైనవిగా వీటిని వర్ణించింది.

తమతో ఎలాంటి అర్థవంతమైన చర్చలు జరపకుండా ఈ కొత్త నిబంధనలను ప్రభుత్వం రూపొందించిందని గిల్డ్, ఇండియాస్ న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ తెలిపింది.

ఈ కొత్త నిబంధనలను సవాలు చేస్తూ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా కోర్టుకు వెళ్లారు.

ముంబైకి చెందిన కునాల్ కమ్రా బాంబే హైకోర్టులో తన పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కొత్త రూల్స్ వాక్ స్వతంత్ర హక్కును హరిస్తున్నాయని తన పిటిషన్‌లో చెప్పారు.

తనకు సంబంధించిన ఏ వ్యాపారంలో అయినా, కేవలం ఒకే ఒక్క నమ్మకమైన మధ్యవర్తిగా ప్రభుత్వం ఉండాలనుకుంటోందన్నారు.

కమ్రా తన స్టాండప్ కమెడియన్ షోలలో సామాజిక పరంగా, రాజకీయం అంశాలపై పలు చమత్కారాలు చేస్తూ ఉంటారు.

సమాజంలో అందుబాటులో ఉన్న అతిపెద్ద మెగాఫోన్‌ను ప్రభుత్వం కలిగి ఉందని, ఒకవేళ బాధకలిగితే, సాధ్యమయ్యే ప్రతి మౌలిక సదుపాయ యాక్సస్‌ను పొంది, పెద్ద ఎత్తున రీచ్ అవ్వగలదన్నారు.

ప్రభుత్వం తీసుకునే చర్యలపై కునాల్ కమ్రా తన కామెంటరీలో పలు ఛలోక్తులు విసురుతూ ఉంటారు.

తాను ఇంటర్నెట్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాలో తన వర్క్‌ను షేర్ చేయడం ద్వారా అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఒకవేళ ప్రభుత్వం తీసుకొచ్చే ఏకపక్షమైన ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌కి వారు కట్టుబడి ఉండాల్సి వస్తే, తన రాజకీయ ఛలోక్తుల సామర్థ్యం బాగా తగ్గిపోతుందని కమ్రా తెలిపారు.

రాజకీయ ఛలోక్తుల ఉద్దేశ్యం పూర్తిగా ఓటమి పాలవుతుందన్నారు.

ఫేక్ న్యూస్

ఈ నిబంధనల వల్ల తమపై చర్యలు తీసుకుంటారనే భయంతో సెల్ఫ్ సెన్సార్‌కి వ్యంగ్య రచయితలు పరిమితమై, పొలిటికల్ కామెంటరీ విషయంలో వారి ఎంగేజ్‌మెంట్‌ను పరిమితం చేస్తారని అన్నారు.

అలాగే ఈ కొత్త నిబంధనల వల్ల కంటెంట్‌ను క్రియేట్ చేసే కమెడియన్ల లేదా రాజకీయ వ్యంగ్య రచయితల సోషల్ మీడియా అకౌంట్ల రద్దుకు లేదా డీయాక్టివేషన్‌కు ఆస్కారం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు పెద్ద మొత్తంలో ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా తాము ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చామని తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం కోర్టుకి తన అఫిడవిట్‌ను దాఖలు చేసింది.

సాక్ష్యాధారాలతో కూడిన ఫ్యాక్ట్ చెకింగ్ విధానాన్ని ఈ నిబంధనలు అందిస్తాయని ప్రభుత్వం తెలిపింది.

గతంలో అల్లర్లు, మూకుమ్మడి హత్యలు, ఇతరాత్ర నేరాలకు కారణమైన తప్పుడు, నకిలీ లేదా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని డీల్ చేసేందుకు ఒక మెకానిజాన్ని క్రియేట్ చేస్తుందన్నారు.

ఈ యూనిట్ పరీక్షించే కంటెంట్ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు, నోటిఫికేషన్లు, నిబంధనలు, నియంత్రణలు, వాటి అమలుకు పరిమితమవుతుందని కూడా తెలిపింది.

అలాగే, ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కేవలం తప్పుడు వార్తలను, నకిలీ వార్తలను, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని మాత్రమే గుర్తిస్తుందని, ఎలాంటి అభిప్రాయంలో, ఛలోక్తులలో జోక్యం చేసుకోదని చెప్పింది.

అయితే, ఈ కొత్త రూల్స్ సెటైర్ లేదా పారడీ ద్వారా ప్రభుత్వంపై న్యాయపరమైన విమర్శలను రక్షించేలా కనిపించడం లేదని అంతకుముందు విచారణలో కోర్టు తెలిపింది.

ఈ నిబంధనలు ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని ప్రముఖ రాజకీయ కార్టూనిస్ట్ మంజుల్ చెప్పారు.

దేశద్రోహ చట్టం వల్లే ప్రజలకు వ్యతిరేకంగా ఈ రూల్స్‌ను ప్రమాదకరమైన రీతిలో అమలు చేయనున్నారని పేర్కొన్నారు.

నకిలీ వార్తల ప్రమాదం గురించి ఎలాంటి చర్చ ఉండదని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రిక సంపాదకీయం పేర్కొంది.

ఆన్‌లైన్ కంటెంట్ నిజాయితీని గుర్తించే విచక్షణాధికారాన్ని ప్రభుత్వానికి చెందిన ఈ యూనిట్ కలిగి ఉండనుందని, ఇది చాలా ప్రమాదకరంతో కూడుకున్నదని అని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)