FASTag: వాహనాలపై ఫాస్టాగ్ స్టిక్కర్ స్కాన్ చేసి డబ్బులు దొంగిలిస్తున్నారన్న వీడియోలో నిజమెంత

ఫొటో సోర్స్, Getty Images
వాహనాల టోల్ చెల్లించడానికి వీలుగా అతికించే ఫాస్టాగ్ స్టిక్కర్ను స్కాన్ చేసి అకౌంట్లోంచి డబ్బులు కొట్టేస్తున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి అన్ని వేదికల్లోనూ ఈ వీడియో విపరీతంగా షేర్ అవుతోంది.
అయితే, ఇదెంతవరకు నిజం? ఫాస్టాగ్ స్టిక్కర్ స్కాన్ చేసి డబ్బులు దోచుకోవడం సాధ్యమేనా?
ఎలాంటి నిజనిర్థరణ చేసుకోకుండా, ఈ వీడియోను సాధారణ ప్రజలు, సెలబ్రిటీలు కూడా తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తున్నారు.
కారు తుడుస్తానంటూ ఒక కుర్రాడు వచ్చి తన చేతికున్న వాచీతో ఫాస్టాగ్ స్టిక్కర్ను స్కాన్ చేసినట్టు ఈ వీడియోలో కనిపిస్తుంది.
ఆ పిల్లాడు కారు తుడిచిన తరువాత డబ్బులు అడక్కుండా వెళిపోతుంటే, కారు ఓనర్ వెనక్కి పిలిచి "కారు తుడిచావు కదా, డబ్బులు అడగలేదేమి?" అని ప్రశ్నించారు.
"నీ చేతికి ఉన్న వాచీ చూపించు" అని అడగ్గానే ఆ పిల్లాడు అక్కడి నుంచి పరుగందుకున్నాడు. కారులో కూర్చున్న మరో వ్యక్తి పిల్లాడిని వెంబడించారు. కానీ, ఆ పిల్లాడు దొరక్కుండా పారిపోయాడు. వెంబడించిన వ్యక్తి వెనక్కి వచ్చి కారులో కూలబడతారు . అప్పుడు డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తి ఫాస్టాగ్ స్కామ్ల గురించి వివరించి చెబుతారు. ఇవీ ఆ వీడియోలో కనిపించే దృశ్యాలు.
కార్లు తుడుచుకునే పిల్లలు లేదా జంక్షన్ల దగ్గర భిక్షమెత్తుకునే పిల్లలకు ఇలాంటి స్మార్ట్ వాచీలు ఇచ్చి, ఫాస్టాగ్ బార్కోడ్ స్కాన్ చేసేలా ప్రోత్సహిస్తున్నారని, తద్వారా పేటీఎం ఫాస్టాగ్ అకౌంట్లలో ఉండే డబ్బులు దోచుకుంటున్నారని కారులోని వ్యక్తి ఆరోపిస్తున్నారు. ఇదో కొత్త తరహా మోసం అంటున్నారు.
వీడియోలో వ్యక్తి హిందీలో మాట్లాడారు. వీడియోలో చెబుతున్న విషయాల వెనుక నిజానిజాలు పరిశీలించకుండా.. "నా ఫాస్టాగ్ అకౌంట్లో కూడా డబ్బు పోయింది. నేను వెళ్లని చోట ఫాస్టాగ్లో డబ్బులు కట్ చేశారు" అంటూ కొందరు యూజర్లు పోస్టులు పెడుతున్నారు.

ఫాస్టాగ్ అంటే ఏంటి?
హైవేలపై ప్రయాణిస్తున్నప్పుడు వాహనాలకు టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ టోల్ చెల్లింపు వ్యవస్థకు బదులుగా 2021 జనవరి నుంచి ఫాస్టాగ్ పద్ధతిని తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. ఫాస్టాగ్ స్టిక్కర్ను వాహనాల అద్దాలపై బయటకు కనిపించేటట్టు అంటించాలి.
టోల్ గేట్ల దగ్గర ఆగి, క్యూలో వాహనాలను నిలబెట్టి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా, వాహనం నడుస్తుండగానే స్కానర్లు ఫాస్టాగ్ స్టిక్కర్లను స్కాన్ చేసి, చెలించాల్సిన మొత్తాన్ని కట్ చేస్తాయి.
2021 ఫిబ్రవరి 15 నుంచి ఫాస్టాగ్ స్టిక్కర్లను తప్పనిచేశారు. ఫాస్టాగ్ లేకుండా టోల్ ప్లాజా దాటేందుకు ప్రయత్నించేవారు అంతకు రెండింతలు చెల్లించాల్సి ఉంటుందని రోడ్డు రవాణా, హైవేస్ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
ఈ ఫాస్టాగ్.. బ్యాంక్ ఖాతాలు, వ్యాలట్లకు లింక్ చేసుకోవాలి.. వాహనదారులు ఈ అకౌంట్లో ముందే కొంత డబ్బు వేసి ఉంచుకోవచ్చు.
ఇప్పుడు దాదాపు 90 శాతం వాహనాలు ఫాస్టాగ్ ద్వారానే టోల్ చెల్లిస్తున్నాయి. కారు, బస్సు, ట్రక్కు లాంటి వాహనాలకు షోరూంలోనే ఫాస్టాగ్ స్టిక్కర్ అతికించి విక్రయిస్తున్నారు.
తాజాగా, ఫాస్టాగ్ మోసాలు జరుగుతున్నాయని వీడియో ప్రచారంలోకి రావడంతో వాహనదారులు ఉలిక్కిపడ్డారు.

ఫొటో సోర్స్, PAYTM
'అది ఫేక్ వీడియో'
ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఫాస్టాగ్ సర్వీసు అందించే సంస్థ పేటీఎం ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియో ఫేక్ అని కొట్టిపారేసింది.
"స్మార్ట్వాచ్ ద్వారా ఫాస్టాగ్ను స్కాన్ చేయవచ్చని చెబుతున్న వీడియో Paytm FASTag గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోంది. NETC నియమాల ప్రకారం, ఆథరైజేషన్ ఉన్న వ్యాపారులు మాత్రమే ఫాస్టాగ్ బార్కోడ్ను స్కాన్ చేయగలరు. అనేక దశలలో పరీక్షించిన తరువాతే ఈ వ్యవస్థను ప్రారంభమైంది. పేటీఎం ఫాస్టాగ్ పూర్తిగా సురక్షితమైనది" అంటూ స్పష్టం చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
భారత ప్రభుత్వ సమాచార శాఖ 'ప్రెస్ ఇంఫర్మేషన్ బ్యూరో' (పీఐబీ) కూడా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
"వాచీల్లాంటి డివైజులతో ఫాస్టాగ్ బార్కోడ్ స్కాన్ చేయవచ్చని చెబుతున్న ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియో ఫేక్. అలాంటి లావాదేవీలు అసాధ్యం. ప్రతీ టోల్ ప్లాజాకు ప్రత్యేకమైన కోడ్ ఉంటుంది" అని ట్వీట్టర్లో పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో "నిరాధారమైనదని, నకిలీ" అని చెబుతూ, "ఓపెన్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ద్వారా ఎలాంటి లావాదేవీలు జరగవని" నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పష్టం చేసింది. ఆ మేరకు, ఫాస్టాగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. నకిలీ వీడియోలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
కాగా, వీడియో క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరు, ఎందుకు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు, కారు తుడిచిన బాలుడు ఎవరు, ఇందులో ఎవరి ప్రమేయం ఉంది మొదలైన విషయాలు ఇప్పటివరకు స్పష్టం కాలేదు.
ఈ వీడియోపై ఆరా తీయాల్సిందా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సైబర్ విభాగాన్ని కోరినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి:
- క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్న 4 కొత్త మందులు
- నాజీల క్యాంప్ గార్డుగా పని చేసి, వేల హత్యలకు బాధ్యుడైన 101 ఏళ్ళ వృద్ధుడికి అయిదేళ్ళ జైలు శిక్ష
- చెస్ ఒలింపియాడ్ 2022: తమిళనాడులో రష్యా-యుక్రెయిన్ పోరు
- అమెరికా-టెక్సస్: రోడ్డు పక్కన వదిలేసిన ట్రక్కులో 46 మృతదేహాలు... గాలీ, నీరూ లేక ఉక్కిరిబిక్కిరై చనిపోయారు
- సెక్స్ అంటే అరబ్ కుర్రాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, వయాగ్రాకు అక్కడ ఎందుకంత డిమాండ్?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)













