మహిళల వన్డే ప్రపంచ కప్: భారత జట్టు గెలిచిన ఈ మ్యాచ్‌ మధ్యలో పాకిస్తాన్ జట్టు అమ్మాయిలు కెమికల్స్ ఎందుకు చల్లారు?

భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు పాకిస్తాన్‌ను 88 పరుగుల తేడాతో ఓడించింది.

భారత్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోదిగిన పాకిస్తాన్ జట్టు 43 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది.

పాకిస్తాన్ తరఫున సిద్రా అమీన్ 81 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. దీప్తి శర్మ, క్రాంతి గౌడ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు, చా ఘోష్ చేసిన 35 పరుగుల ఇన్నింగ్స్‌తో భారత్ 50 ఓవర్లలో 247 పరుగులు సాధించింది.

మహిళా క్రికెట్‌లో పాకిస్తాన్ జట్టు భారత జట్టును ఆలౌట్ చేయడం ఇదే తొలిసారి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ నిర్ణయంపై సోషల్ మీడియాలో వివాదం చెలరేగింది.

ఇది మాత్రమే కాదు, భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ సమయంలో, కీటకాల కారణంగా ఆటను కొంతసేపు ఆపాల్సి వచ్చింది.

మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ స్కోరు 34 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 154 పరుగులు.

మైదానంలో ఎగురుతున్న కీటకాలు, ప్లేయర్ల తలలపై తిరుగుతూ వారి కళ్ళలో పడుతుండడంతో బ్యాటింగ్, బౌలింగ్ రెండూ ఇబ్బందిగా మారాయి.

పాకిస్తాన్ ఆటగాళ్లు మైదానంలో పురుగుమందులు పిచికారీ చేశారు.

విమన్స్ వన్డే వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది.

క్రాంతి గౌడ్ మూడు వికెట్లు

248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ పేలవమైన ఆటతీరు కనబరిచింది. 11.1 ఓవర్లలో కేవలం 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

కానీ సిద్రా అమీన్, నటాలియా పర్వేజ్‌లు పాకిస్తాన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టడానికి ప్రయత్నించారు.

వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని క్రాంతి గౌడ్ బ్రేక్ చేసింది. నటాలియాను అవుట్ చేసింది.

నటాలియా 33 పరుగుల వద్ద అవుటైంది. ఆ తర్వాత దీప్తి శర్మ పాకిస్తాన్ ఐదవ వికెట్‌ను తీసింది. ఫాతిమా సనా వేసిన బంతిని క్యాచ్ పట్టి, ఆమెను కేవలం రెండు పరుగులకే పెవిలియన్ దారి పట్టించింది.

అయితే, వరుసగా వికెట్లు పడిపోతున్నప్పటికీ సిద్రా అమీన్ ఒక దశలో గట్టిగా నిలదొక్కుకుంది. సిద్రా నవాజ్ 14 పరుగులు చేసి స్నేహ్ రాణా బౌలింగ్‌లో అవుటైంది.

సెంచరీ చేస్తుందనుకున్న సమయంలో, 81 పరుగుల వద్ద సిద్రా అమీన్‌ని స్నేహ్ రాణా అవుట్ చేసింది.

కాగా దీప్తి శర్మ రమీన్ షమీమ్‌కు పరుగులఖాతా తెరవడానికి అవకాశం ఇవ్వలేదు.

భారత్ తరఫున క్రాంతి గౌడ్ 10 ఓవర్లలో 20 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ కూడా మూడు వికెట్లు పడగొట్టింది. స్నేహ్ రాణా రెండు వికెట్లు తీసింది.

ఇండో పాక్ మ్యాచ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టాస్ సమయంలో భారత్, పాకిస్తాన్ కెప్టెన్లు కరచాలనం చేసుకోలేదు.

టాస్ పై వివాదం

భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ విషయంలో కూడా వివాదం నెలకొంది.

టాస్ సమయంలో తీసుకున్న నిర్ణయాన్ని సోషల్ మీడియాలో చాలామంది ప్రశ్నించారు. టాస్ సమయంలో ఫాతిమా సనాను అడిగినప్పుడు, ఆమె "టెయిల్స్" అని చెప్పింది.

కానీ అక్కడ ఉన్న మ్యాచ్ అధికారులు హెడ్స్ అని అన్నారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాణెం విసిరిన తర్వాత, హెడ్స్ పైకి రావడంతో, పాకిస్తాన్‌ టాస్ గెలిచిందిని ప్రకటించారు.

"పాకిస్తాన్ కెప్టెన్ టెయిల్స్ అంటే, మ్యాచ్ అధికారులు హెడ్స్ అన్నారు. టాస్ ఫలితాన్ని పాకిస్తాన్‌కు అనుకూలంగా ఇచ్చారు" అని అభిషేక్ శెట్టి అనే యూజర్ సోషల్ మీడియాలో రాశారు.

పాకిస్తాన్ ప్లేయర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫాతిమా సనా ఏరోసోల్ స్ప్రేతో కీటకాలను తరిమడానికి ప్రయత్నించింది.

247 పరుగులకు భారత్ ఆలౌట్

కొలంబోలోని ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది.

స్మృతి మంథాన, ప్రతికా రావల్ జంట భారత్‌కు శుభారంభాన్నిచ్చింది. అయితే, 9వ ఓవర్ చివరి బంతికి స్మృతి మంథాన (23) అవుట్ అయింది.

ప్రతికా రావల్ 23, హర్లీన్ దేవల్ 46 పరుగులు చేశారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా 19 పరుగులు చేసింది. జెమిమా రోడ్రిగ్స్ 32 పరుగులు చేసింది.

35 ఓవర్లలో భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఆ తర్వాత దీప్తి శర్మ 25, స్నేహ్ రాణా 20 పరుగులు చేసి భారత్ స్కోరును 200 దాటించారు.

చివరగా, ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న రిచా ఘోష్ 20 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 35 పరుగులు చేసింది.

పాకిస్తాన్ ఐదుగురితో బౌలింగ్ చేయించింది. డయానా బేగ్ నాలుగు వికెట్లు పడగొట్టగా, కెప్టెన్ ఫాతిమా సనా, సాదియా ఇక్బాల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా, టాస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా టాస్ గెలిచింది.

షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు

ఆసియా కప్‌లో భారత, పాకిస్తాన్ క్రికెటర్ల మాదిరిగానే మహిళల ప్రపంచ కప్‌లో కూడా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ తీసుకోలేదు.

టాస్ వేసే సమయంలో, మ్యాచ్ తర్వాత ఇరు జట్లు కరచాలనం చేసుకోలేదు.

భారత మహిళా జట్టు వన్డేల్లో పాకిస్తాన్ జట్టుపై ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఓడిపోలేదు. రెండు జట్లు ఇప్పటివరకు 12 సార్లు తలపడ్డాయి. ప్రతిసారీ భారత జట్టే విజయం సాధించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)