టెక్సస్ వరదలు: నదికి 500 అడుగుల దూరంలోని బాలికల సమ్మర్ క్యాంప్ మునిగిపోయింది.. ఎటుచూసినా భయానక దృశ్యాలే

ఫొటో సోర్స్, REUTERS/Sergio Flores
- రచయిత, గేరీ ఓ డోనోగ్యూ, ఆనా ఫాగై
- హోదా, బీబీసీ ప్రతినిధులు
టెక్సస్లోని గ్వాడాలుపే నది ఒడ్డున ఉన్న ‘క్యాంప్ మిస్టిక్’లోని క్రైస్తవ బాలికల శిబిరం కొన్నిరోజుల కిందటి వరకు నవ్వులు, ప్రార్థనలు, సాహసాలకు కేంద్రంగా ఉండేది.
జులై 4న అక్కడ ప్రభుత్వ సెలవు దినం కావడంతో ఈ క్యాంపులోని బాలికలంతా విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఆ సమయంలో కుండపోత వర్షాల కారణంగా గ్వాడాలుపే నదిలో ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. 45 నిమిషాల వ్యవధిలోనే 26 అడుగుల ఎత్తుకు ప్రవాహం పెరిగింది.
నది ఒడ్డుకు 500 అడుగుల దూరంలో లోతట్టు ప్రాంతాన ఉన్న క్యాబిన్లలో అనేక మంది బాలికలు నిద్ర పోతున్నారు.
ఆ క్యాబిన్లలో ఉన్న అనేక బంక్ బెడ్ల మీద ఇప్పుడు మట్టి పేరుకుపోయింది. వేసవి శిబిరం విషాదకరంగా మధ్యలోనే ఆగిపోయింది.
శిబిరంలోని పిల్లలు క్యాంప్ఫైర్ వేసుకుని బైబిల్ చదవుతూ పాటలు పాడే ప్రాంతమంతా ధ్వంసమైంది.
వారి వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. లోపలున్న వస్తువులన్నీ నీటిలో నానిపోయాయి.
సెంట్రల్ టెక్సస్లో వరదల వల్ల ఇప్పటి వరకు 78 మంది చనిపోయినట్లు నిర్ధరించారు.
అందులో 28 మంది పిల్లలు సహా 68 మంది కెర్ కౌంటీకి చెందిన వారే. ఈ ప్రాంతంలోనే క్యాంప్ మిస్టిక్ ఉంది.
చనిపోయిన వారిలో కొంతమంది యువతులతో పాటు క్యాంపుకు దీర్ఘకాలంగా డైరెక్టర్గా ఉన్న రిచర్డ్ డిక్ ఈస్ట్ ల్యాండ్ ఉన్నారు.
క్యాంపులో పది మంది బాలికలు, ఒక కౌన్సెలర్ ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు.


ఫొటో సోర్స్, Camp Mystic
నిద్ర లేచేసరికి..
13 ఏళ్ల స్టెల్లా థాంప్సన్ ఉండే క్యాబిన్ చాలా ఎత్తులో ఉంది. శుక్రవారం ఉదయం కురుస్తున్న వర్షాలకు ఆమె నిద్రలేచారు.
పైన హెలికాప్టర్ల శబ్దం వినిపించడంతో ఏదో జరిగిందని ఆమె గ్రహించారు. గ్వాడాలుపే నది పక్కన ఉన్న క్యాంపులోకి వరద నీరు వచ్చిందని ఆమె క్యాబిన్లోని మిగతా బాలికలకు తెలిసింది.
"మాకు ఆ వార్త తెలిసిన వెంటనే అందరం ప్రార్థనలు చేశాం" అని స్టెల్లా డాలస్ ఎన్బీఎస్ వార్తాసంస్థ ప్రతినిధితో చెప్పారు.
"మేమందరం చాలా ఆందోళన చెందాం. నిజంగానే భయపడ్డాం. అయితే అది మా గురించి కాదు. అవతలి వైపు ఉన్న వారి గురించి" అని ఆమె చెప్పారు.
మిలటరీ ట్రక్కుల్లో తమను తరలిస్తున్నప్పుడు తాను చూసిన ‘భయానక’ దృశ్యాలను స్టెల్లా వివరించారు.
"కయాక్లు(చిన్న పడవలు) ప్రవాహంలో కొట్టుకుపోయి చెట్లలో చిక్కుకున్నాయి. సహాయ బృందాలు అమ్మాయిలను నీటి నుంచి బయటకు లాగుతున్నాయి’ అని చెప్పారు.
"పెద్ద పెద్ద చెట్లు వేళ్లతో సహా నేలను చీల్చుకుని బయటకు వచ్చాయి. అది క్యాంప్ మిస్టిక్ లాగా ఏమాత్రం అనిపించలేదు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎత్తైన ప్రదేశాల్లో ఉన్నప్పటికీ..
నది ఒడ్డున ఎత్తైన ప్రదేశంలో ఉన్నవారికి కూడా భద్రత లేదు.
‘కొండల పైభాగంలో ఉన్న మా క్యాబిన్లు కూడా పూర్తిగా వరద నీటితో నిండిపోయాయి’ అని క్యాంప్ మిస్టిక్ పక్కనే ఎత్తైన ప్రాంతంలో ఉంటున్న కేథరిన్ సోమర్ విల్లే ‘ఫాక్స్ న్యూస్’తో చెప్పారు.
"మీరంతా ఈ విధ్వంసాన్ని చూశారు. ఇలా జరుగుతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు" అని ఆమె చెప్పారు.
తన క్యాంపులో ఉన్నవారంతా భద్రంగా ఉన్నారని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆమె తెలిపారు.
ఒక క్యాంపులో మెడ వరకు నీరు రావడంతో, అందులో ఉన్న బాలికలు ఈదుకుంటూ బయటకు వెళ్లేందుకు వీలుగా ఆ క్యాంపు కౌన్సెలర్ కిటికీని బద్దలు కొట్టారని టెక్సస్ లెఫ్టినెంట్ గవర్నర్ డాన్ పాట్రిక్ చెప్పారు.
"ఆ చిన్న పిల్లలు పది, పదిహేను నిమిషాలు ఈదుతూనే ఉన్నారు" అని ఆయన ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్ వీకెండ్ టెలివిజన్ కార్యక్రమంలో చెప్పారు.
"చీకట్లో వేగంగా ప్రవహించే నీటిలో మీ వైపు చెట్లు, రాళ్లు దూసుకు వస్తాయని మీరు ఉహించగలరా? ఆ ప్రవాహం మిమ్మల్ని భూమి మీద ఎక్కడకో చేరుస్తుంది" అని పాట్రిక్ ఆ కార్యక్రమంలో చెప్పారు.
ఆదివారం బీబీసీ ఆ క్యాంప్కు చేరుకున్నప్పుడు వర్షం కురుస్తూనే ఉంది.
ప్రస్తుతం క్యాంప్ ప్రవేశ ద్వారాన్ని పోలీసులు మూసివేశారు.
మరింత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం కురిస్తే సహాయ కార్యక్రమాలకు మరిన్ని సమస్యలు ఏర్పడతాయి.
వరదలు వచ్చిన మూడు రోజుల తర్వాత, ఆశలు సన్నగిల్లుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

నదీ తీరంలో క్యాంపులు
క్యాంప్ మిస్టిక్ను కొన్ని తరాలుగా ఒకే కుటుంబం నిర్వహిస్తోంది.
బాలికలు 'ఆధ్యాత్మికంగా' పూర్తిస్థాయి క్రైస్తవ వాతావరణంలో పెరిగేందుకు వీలు కలిపిస్తున్నట్లు తన వెబ్సైట్లో పేర్కొంది.
టెక్సస్ రాష్ట్రంతో పాటు రాజకీయ ప్రముఖులు, అమెరికాలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారు తమ పిల్లల్ని ఈ క్యాంప్కు పంపిస్తారు.
ఇక్కడికి వచ్చేవారు ప్రతి వేసవిలో ఈత కొట్టడం, పడవలు నడపడం, గుర్రపు స్వారీ వంటివి నేర్చుకుంటారు.
గ్వాడాలుపే నది సౌందర్యాన్ని చూసేందుకు ఇక్కడకు అనేక మంది వస్తుంటారు. అయితే అది చాలా ప్రమాదకరమైన ప్రాంతమని వరదలు నిరూపించాయి.
చిన్న పాటి హెచ్చరికతో వచ్చిన వరద ప్రవాహం నదీ తీరంలోని ప్రకృతి సౌందర్యాన్ని ధ్వంసం చేసింది. ఈ ప్రాంతంలో దాదాపు 20 యూత్ క్యాంపులు ఉన్నాయి.
అన్నింటికంటే క్యాంప్ మిస్టిక్ భారీగా నష్టపోయింది. వరద తీవ్రత, నష్టం భారీగా ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు.
సమీపంలోని ‘హార్ట్ ఓ ద హిల్స్’ క్యాంప్ కూడా వరదల్లో మునిగిపోయింది. ఇక్కడ అందరూ బాలికలే ఉంటారు.
ఈ క్యాంపు యజమాని జేన్ రగ్స్డేల్ చనిపోయారు. అదృష్టత్తువశాత్తూ వరదలు వచ్చినప్పుడు ఈ క్యాంపులో కార్యక్రమాలేవీ జరగడం లేదు.
వారాంతపు సెలవు కావడంతో అనేక మంది నది తీర ప్రాంతంలో క్యాంపింగ్కు వచ్చారు.
నది తీరంలో అన్ని క్యాంపులు ఎందుకు ఉన్నాయి. వరదలు రాగానే పిల్లల్ని ఎందుకు సురక్షిత ప్రాంతాలకు తరలించలేకపోయారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ సభ్యుడు చిప్ రాయ్ వరద నష్టాన్ని అంగీకరిస్తూనే వాస్తవాలు తెలియకుండా ఆరోపణలు చేయవద్దని కోరారు
"స్పందన ఉంటుంది. మనం ఈ శిబిరాలన్నింటినీ తరలించాలి. నది ఒడ్డున క్యాంపులు ఎందుకు పెట్టారు" అని ఆయన అన్నారు.
కనిపించకుండా పోయిన వారి బంధువులు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని భయంతో ఎదురు చూస్తున్నారు. సహాయ బృందాలు పడవల్లో ప్రజలను తరలిస్తున్నాయి. మరికొందరు శిథిలాల కింద ఎవరైనా ఉన్నారేమోనని వెదుకుతున్నారు.
ఆచూకీలేని ప్రతీ ఒక్కరి గురించి తెలిసే వరకు మిషన్ కొనసాగుతందని టెక్సస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ హామీ ఇచ్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














