తెలంగాణ: ‘ఆ అయిదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారారనడానికి ఆధారాలు లేవు’.. అనర్హత పిటిషన్లు కొట్టివేసిన స్పీకర్

Gaddam Prasada Kumar

ఫొటో సోర్స్, facebook/Gaddam Prasad Kumar

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలలో అయిదుగురిపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు.

''ఎమ్మెల్యేలు పార్టీ మారారని చెప్పడానికి సరైన ఆధారాలు లేవు'' అంటూ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేసినట్లుగా స్పీకర్ కార్యాలయం ప్రకటించింది.

తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీకి మారారంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేశారు స్పీకర్.

స్పీకర్ నిర్ణయానికి సంబంధించిన ప్రెస్ నోట్

అయితే, స్పీకర్ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మీడియాతో చెప్పారు.

ఈ పూర్తి వ్యవహారంలో పది మంది ఎమ్మెల్యేలపై పార్టీ మారారంటూ స్పీకర్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అనర్హత పిటిషన్లను దాఖలు చేసింది.

ఇందులో మొదటగా ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ పూర్తి చేసి తెలంగాణ స్పీకర్ ఈ మేరకు నిర్ణయం వెల్లడించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
supreme court

ఫొటో సోర్స్, Getty Images

సుప్రీంకోర్టు ఏమని తీర్పు ఇచ్చింది

తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈ ఏడాది జులైలో సుప్రీంకోర్ట్ తుది తీర్పు వెలువరించింది.

తెలంగాణలో బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వేసిన పిటిషిన్‌పై.. ''పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై త్వరితగతిన.. మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి'' అని జులై 31 (గురువారం) సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.

సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందించారు.

''ఎమ్మెల్యేలకు గతంలోనే నోటీసులు ఇచ్చాం. న్యాయ నిపుణులను సంప్రదిస్తాం'' అని చెప్పారు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్.

న్యాయ నిపుణులేమన్నారు?

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అప్పట్లో బీబీసీ తెలుగు కొందరు న్యాయ నిపుణులతో మాట్లాడింది.

స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని విజయవాడ సిద్ధార్థ లా కాలేజీ ప్రిన్సిపల్ సీహెచ్ దివాకర్ బాబు బీబీసీతో చెప్పారు.

''స్పీకర్‌కు డెడ్‌లైన్ విధించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా అనే ప్రశ్న ఇక్కడ రావొచ్చు. కచ్చితంగా.. నిర్దేశిత సమయం చెప్పి నిర్ణయం తీసుకోవాలని చెప్పే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది'' అని దివాకర్ బాబు స్పష్టం చేశారు.

అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్లకు డెడ్‌లైన్ పెట్టే అధికారం సుప్రీంకోర్టుకు ఉందని న్యాయ నిపుణులు మాడభూషి శ్రీధర్ బీబీసీతో చెప్పారు.

''నిర్దేశిత సమయంలో నిర్ణయం తీసుకోవాలని కోర్టులు చెప్పవచ్చు. కానీ, అంతిమంగా నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం స్పీకరుకే ఉంటుంది'' అని చెప్పారు.

కేసీఆర్, రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, FB/Revanth,Kcr

ఎవరెవరిని అనర్హులను చేయాలంటూ బీఆర్ఎస్ పిటిషన్ వేసింది?

బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారారంటూ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో గతంలో పిటిషన్లు దాఖలయ్యాయి.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద ఈ పిటిషన్లు దాఖలు చేశారు.

ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (ఖైరతాబాద్), అరెకపూడి గాంధీ (శేరిలింగంపల్లి), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), కడియం శ్రీహరి (స్టేషన్‌‌ఘన్‌పూర్), కాలె యాదయ్య (చేవెళ్ల), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్ర నగర్), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్‌చెరు), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి (గద్వాల), ఎం.సంజయ్ కుమార్ (జగిత్యాల) పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని బీఆర్ఎస్ గతంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. వారిపై అనర్హత వేటువేయాలని ఆ ఫిర్యాదులో పేర్కొంది.

ఈ ఫిర్యాదుపై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ముందుగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.

దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి.. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో మాట్లాడి నిర్దేశిత సమయంలోగా చర్యలు తీసుకునేలా చూడాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించారు.

''నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోకపోతే సుమోటోగా తీసుకుంటాం'' అని 2024 సెప్టెంబరు 9న హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తెలిపింది.

దీనిపై స్పీకర్ కార్యాలయం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.

''సహేతుకమైన సమయంలోగా నిర్ణయం తీసుకోవచ్చు'' అని 2024 నవంబరు 22న తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఏప్రిల్ 3న తుది తీర్పును రిజర్వ్ చేసి, జులై 31న తీర్పును వెలువరించింది.

తెలంగాణ అసెంబ్లీ

ఫొటో సోర్స్, legislature.telangana.gov.in/main/Screengrab

తెలంగాణ అసెంబ్లీలో ఎవరి బలం ఎంత?

తెలంగాణ అసెంబ్లీకి 2023 నవంబరులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. మిత్రపక్షంగా ఉన్న సీపీఐ నుంచి ఒకరు గెలిచారు.

ఆ తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీగణేశ్ విజయం సాధించడంతో ఆ పార్టీ బలం 65కు పెరిగింది.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కంటోన్మెంట్ స్థానాన్ని కోల్పోవడంతో పాటు పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా బీఆర్ఎస్ చెబుతుండటంతో.. ఈ పార్టీ బలం 28కు తగ్గినట్లు అయింది.

మరోవైపు, గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.

''వారు పార్టీ మారనే లేదు, అభివృద్ధిలో కలిసి వచ్చామని చెబుతున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు. ఉప ఎన్నికలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు'' అని మార్చిలో అసెంబ్లీలో ప్రకటించారు.

తాజాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడారు.

''ఉపఎన్నికలు ఎలా వస్తాయి అధ్యక్షా.. అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును తప్పు పట్టేలా వ్యాఖ్యానించారు. ఇపుడు ఉప ఎన్నికలు ఎలా వస్తాయో సుప్రీంకోర్టు చెప్పింది'' అని అన్నారు.

మూడు నెలల వరకు ఆగకుండా స్పీకర్ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

అయితే పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ ప్రచారాన్ని ఖండిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

2014, 2018లో బీఆర్ఎస్‌లోకి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు మారిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

''గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లో చేర్చుకున్నప్పుడు వారిని అనర్హులుగా ప్రకటించి ఎన్నికలకు ఎందుకు వెళ్లలేదు'' అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్.

కేసీఆర్

ఫొటో సోర్స్, FB/BRSParty

బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగింది?

తెలుగు రాష్ట్రాలలో పార్టీ ఫిరాయింపులు కొత్త విషయమేం కాదు.

2014లో రెండు రాష్ట్రాలుగా విడిపోయి, తగిన మెజారిటీతో రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పడినా, అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించాయి.

ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రతిపక్ష వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 66 మంది ఎమ్మెల్యేలలో 23 మందిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తమవైపు తిప్పుకొంది.

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బీఆర్ఎస్) 15 మంది సభ్యులున్న టీడీపీ శాసనసభా పక్షం మొత్తాన్ని విలీనం చేసుకుంది.

మొదట ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపు వెళ్లగా, ఆ తర్వాత 10మంది ఎమ్మెల్యేలు టీడీపీ శాసన సభా పక్షాన్ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాల్సిందిగా స్పీకర్‌ను కోరడం, ఆయన దాన్ని ఆమోదించడం జరిగిపోయాయి.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 15 సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ తరపున నాలుగేళ్లు గడిచేసరికి రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఆర్.కృష్ణయ్యలు మాత్రమే మిగిలారు.

తెలంగాణలో 2018 ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు (సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు) కూడా తమను పార్టీలో విలీనం చేసుకోవాల్సిందిగా టీఆర్ఎస్‌ను కోరగా ఆ విలీనం కూడా జరిగిపోయింది.

2018 ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా దశలవారీగా 16 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరగా, కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేసినట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ నుంచి ఎన్నికైన సభ్యులు ముగ్గురే అసెంబ్లీలో మిగిలారు.

''గతంలో బీఆర్ఎస్‌లోకి తెలుగుదేశం, కాంగ్రెస్ శాసన సభాపక్షాల విలీనం జరిగింది. వాటిని ఫిరాయింపులుగా భావించకూడదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం, మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు అది శాసన సభాపక్షం విలీనం అవుతుంది'' అని బీబీసీతో చెప్పారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.

ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఈ విలీన ప్రక్రియకు ముందే అప్పటి స్పీకర్‌కు విజ్జప్తి చేశామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

''కాంగ్రెస్ నుంచి నలుగురైదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారగానే అనర్హులుగా ప్రకటించాలని కోరాం. కానీ తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలు కూడా చేరడంతో విలీనం అయినట్లుగా ప్రకటించారు'' అని చెప్పారు అద్దంకి దయాకర్.

రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌కు పార్టీలు వక్రభాష్యం చెబుతున్నాయని అభిప్రాయపడ్డారు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్.

''రాజ్యాంగంలో ఎక్కడా లెజిస్లేచర్ పార్టీ అనేది ఉండదు. రాజకీయ పార్టీ విలీనం ఉంటుంది కానీ లేజిస్లేచర్ పార్టీ విలీనం ఉండదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన లేజిస్లేచర్ పార్టీ విలీనాన్ని తప్పుగా అన్వయించారు. లెజిస్లేచర్ పార్టీ అనేది కేవలం అసెంబ్లీకి పరిమితమైన వ్యవహారం. పార్టీ విలీనం అంటే.. ఆ తర్వాత ఆ పార్టీయే ఉండకూడదు. కానీ విలీనం తర్వాత కూడా తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ఉంది కదా'' అని ప్రొఫెసర్ నాగేశ్వర్ వివరించారు.

revanth reddy

ఫొటో సోర్స్, Telangana CMO

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పిందంటే...

రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం ఒక పార్టీ నుంచి ఎన్నికైన వ్యక్తి పార్టీని విడిచినా లేదా చట్టసభల్లో ఓటింగ్ సమయంలో పార్టీ నాయకత్వం ఆదేశాలు ధిక్కరించినా ఫిరాయింపులకు పాల్పడినట్లుగా పరిగణిస్తారు.

పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీ 2024 లోక్ సభ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో ఒక ప్రకటన చేసింది.

''రాజ్యాంగంలోని పదో షెడ్యూలుకు సవరణ చేసి, ఎమ్మెల్యేలు లేదా ఎంపీ పార్టీ మారితే ఆటోమేటిక్‌గా అనర్హులయ్యేలా చట్టం చేస్తాం'' అని చెప్పింది.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని తాము అడుగుతున్నామని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ బీబీసీకి వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)