భారత్-శ్రీలంక మధ్య వంతెన కడితే రామ సేతు ధ్వంసమవుతుందా?

రామసేతు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రంజన్ అరుణ్ ప్రసాద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

శ్రీలంక, భారత్‌లను కలిపే వంతెన నిర్మాణానికి సంబంధించి చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి.

శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన భేటీలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.

ఈ వంతెనను నిర్మించడం నిజంగా సాధ్యమేనా? భారతదేశం, శ్రీలంక మధ్య వంతెన కడితే అది 'రామ సేతు'గా భావించే సున్నపురాయి దిబ్బలపై ప్రభావం చూపుతుందా?

రెండు రోజుల కిందట శ్రీలంక అధ్యక్షుడు భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా రెండు దేశాలను అనుసంధానించే పలు ప్రాజెక్టులపై రణిల్ విక్రమ సింఘేతో మోదీ చర్చించారు.

ముఖ్యంగా రెండు దేశాల మధ్య ఫెర్రీ సర్వీసుల పునరుద్ధరణ, విమాన సర్వీసుల విస్తరణ, పైప్ లైన్ పవర్ కనెక్షన్, ఇతర ప్రాజెక్టులపై ఇరు దేశాల నేతలు చర్చించారు.

రెండు దేశాల మధ్య వంతెన నిర్మాణం అవకాశాలను పరిశీలిస్తామని మోదీ తెలిపారు.

మోదీతో రణిల్ విక్రమసింఘే కరచాలనం

ఫొటో సోర్స్, PMD SRI LANKA

ఫొటో క్యాప్షన్, మోదీతో రణిల్ విక్రమ సింఘే

ధనుష్కోడి టు తలైమన్నార్

శ్రీలంక-భారత్ మధ్య వంతెన నిర్మాణం గురించి చాలా ఏళ్లుగా చర్చ జరుగుతోంది.

ఈ వంతెన నిర్మాణానికి సంబంధించి 2015లో చర్చలు ప్రారంభమయ్యాయి.

ధనుష్కోడి, తలైమన్నార్ ప్రాంతాలను కలుపుతూ రూ. 35 కోట్లతో వంతెన నిర్మించాలని యోచిస్తున్నట్లు అధికార పార్టీ నేతలు అప్పట్లో చెప్పారు.

ప్రాజెక్టు నిధుల సేకరణ కోసం కూడా చర్చించారు.

2015లో శ్రీలంక ప్రధానిగా ఉన్న రణిల్ విక్రమసింఘే భారత్‌లో పర్యటించినప్పుడు నరేంద్ర మోదీ ఇదే అంశంపై చర్చించారు.

ఈ ప్రాజెక్టుకు నిధులు అందించేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అప్పట్లో చెప్పారు.

ఆ సమయంలో దక్షిణాసియా ప్రాంతీయ రవాణా కారిడార్‌లను అనుసంధానించేలా ఉండే ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి.

అయితే, ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. రణిల్ విక్రమసింఘే అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో ఇరు దేశాల మధ్య వంతెన ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది.

సముద్రంలో శ్రీలంక, భారతదేశాన్ని కలిపే నిర్మాణాన్ని 'ఆడమ్స్ బ్రిడ్జ్' అని కూడా అంటారు.

ఈ సున్నపురాయి వంతెన నిర్మాణం రామేశ్వరం, మన్నార్ ప్రాంతాలను కలుపుతూ దాదాపు 30 కి.మీ. మేర ఉంది.

రెండు దేశాల మధ్య బ్రిడ్జి నిర్మించాలనుకుంటే అది ఈ నిర్మాణంపైనే ఉంటుందా, లేక మరో చోటనా అనేది ఇంకా తేలలేదు.

నోర్బర్ట్

ఫొటో సోర్స్, UNIVERSITY OF COLOMBO

ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ నోర్బర్ట్

వంతెన నిర్మించడం సాధ్యమేనా?

భౌగోళికంగా భారత్, శ్రీలంక మధ్య వంతెన నిర్మించడం సాధ్యమేనని ప్రొఫెసర్ ఎస్ఏ నోర్బర్ట్ బీబీసీతో చెప్పారు.

ఎస్ఏ నోర్బర్ట్ కొలంబో యూనివర్శిటీలోని జియాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.

భారత్-శ్రీలంక మధ్య సముద్ర ప్రాంతంలో లోతు తక్కువగా ఉందని, అందుకే వంతెనను సులభంగా నిర్మించవచ్చని ఆయన అన్నారు.

సేతు సముద్రం ప్రాజెక్ట్ గురించి చాలా ఏళ్లుగా మాట్లాడుతున్నారు.

ప్రాజెక్ట్‌లో ఏవైనా సవాళ్లు ఉన్నాయా అని అడిగినప్పుడు, "అలాంటివేం ఉండకపోవచ్చు" అని ఆయన చెప్పారు.

సేతు సముద్రం ప్రాజెక్ట్ ఆచరణ సాధ్యం కానప్పటికీ శ్రీలంక, భారత్‌ మధ్య ఈ వంతెన నిర్మాణం సాధ్యమేనన్నారు.

“ఈ వంతెనను నిర్మించడం పెద్ద విషయమేం కాదు. కాంక్రీట్ స్తంభాలను ఏర్పాటుచేయవచ్చు. లోతులేని ప్రాంతాలలో వంతెనలను నిర్మించవచ్చు. వీటికి ఎలాంటి సమస్యా లేదు. వంతెన కోసం ఇది ఒక అనువైన ప్రాంతం” అని నోర్బర్ట్ చెప్పారు.

“ఒక వంతెనను నిర్మించినప్పుడు, ట్రాఫిక్‌ సహా ప్రతిదీ నిర్మించేవారి నియంత్రణలోకి వస్తుంది. చైనాతో పాటు అనేక దేశాలు సముద్రంపై వంతెనలు కట్టాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో భారత్-శ్రీలంక మధ్య వంతెన నిర్మాణం సాధ్యమే” అని ఆయన అభిప్రాయపడ్డారు.

రామసేతు

సున్నపురాయి దెబ్బతింటుందా?

“ధనుష్కోడి నుంచి మార్గం సులభం. ఇది అంత దూరమేం కాదు. ధనుష్కోడి నుంచి పాక్ జలసంధి మీదుగా సముద్రంలోకి వంతెన నిర్మించవచ్చు. శ్రీలంక, భారత్ మధ్య ఉన్న ప్రాంతం సున్నపురాయితో నిండి ఉంది. వాటిపై రైల్వే బ్రిడ్జి తరహాలో వంతెన నిర్మించొచ్చు'' అని నోర్బర్ట్ వివరించారు.

ఈ వంతెన నిర్మాణంలో పాక్ జలసంధిలోని సున్నపురాయికి నష్టం జరిగే అవకాశం ఉందా అని అడగ్గా- ‘ఇది భారీ సున్నపురాయి ప్యాచ్’’ అని, బ్రిడ్జి నిర్మాణం వల్ల దీనికి ఎలాంటి నష్టమూ వాటిల్లదని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)