గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి

ఫొటో సోర్స్, Screengrab/UGC
గోవాలోని ఓ నైట్ క్లబ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మంది మరణించారని, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు.
మృతుల్లో నైట్ క్లబ్ సిబ్బందితో పాటు కొందరు పర్యటకులు కూడా ఉన్నారని స్థానిక అధికారులు వెల్లడించారు.
ఇప్పటివరకు 12 మందిని గుర్తించినట్లు గోవా ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజీత్ రాణే తెలిపారు.
ఉత్తర గోవాలోని అర్పోరాలో ఉన్న ఓ నైట్ క్లబ్లో ఈ ప్రమాదం జరిగింది.
శనివారం అర్ధరాత్రి క్లబ్ కిచెన్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించాయని పోలీసులు చెప్తున్నారు.
ప్రమాదంపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఆవేదన వ్యక్తంచేశారు.
‘గోవా ప్రజలందరికీ ఇది చాలా బాధాకరమైన రోజు’ అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


‘మృతుల్లో ఎక్కువమంది క్లబ్ సిబ్బంది’
గ్రౌండ్ఫ్లోర్లో ఉన్న కిచెన్ చుట్టూ మంటలు ఎక్కువగా వ్యాపించాయి'' అని గోవా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ చెప్పారు.
''అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. ఇప్పుడు మంటలు అదుపులోకి వచ్చాయి''
''కిచెన్ చుట్టూ మృతదేహాలను ఎక్కువగా గుర్తించారు. క్లబ్లో పనిచేస్తున్న సిబ్బందిగా వారిని భావిస్తున్నాం'' అని అలోక్ కుమార్ తెలిపారు.
గోవాలో ప్రముఖ బీచ్లుండే ప్రాంతమైన బాగాలోని ‘బిర్చ్ బై రోమియో లేన్’ క్లబ్లో ప్రమాదం జరిగిందని ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టు చేసింది.
ఆదివారం ఉదయం కూడా సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ఫొటో సోర్స్, ANI
ఊపిరాడక ఎక్కువ మంది మృతి
మంటల్లో చిక్కుకుని ముగ్గురు చనిపోయారని, మిగిలిన వారు ఊపిరాడక మరణించారని ముఖ్యమంత్రి విలేఖరులతో చెప్పారు.
ముగ్గురు లేదా నలుగురు పర్యటకులు మరణించారని తెలిపారు.
ప్రమాదానికి గల కారణాలు గుర్తించేందుకు ప్రాథమిక దర్యాప్తు మొదలైందని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
''ప్రమాదానికి బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాని, నిర్లక్ష్యం ఉందని తేలితే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.
నైట్ లైఫ్, బీచ్లు, రిసార్టులతో ఉండే గోవాకు ఏటా లక్షలమంది పర్యటకులు వస్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














