బ్యాంకు ఖాతాలలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే జరిమానా పడుతుందా?

బ్యాంక్, మనీ

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లోని బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు వచ్చిన తర్వాత, బ్యాంకు అకౌంట్ తెరవడం, లోన్ తీసుకోవడం చాలా తేలికైంది, వేగవంతమైంది.

కానీ, అదే సమయంలో పలు బ్యాంకులు సర్వీస్ చార్జీలు విపరీతంగా పెరిగాయి.

ప్రతి నెలా మీ పొదుపు ఖాతాలో సగటున ఉంచాల్సిన కనీస మొత్తాలను (మినిమమ్ బ్యాలెన్స్‌లను) ఉంచకపోతే, మీరు జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది.

అంతేకాక, నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువసార్లు ఏటీఎంను వాడితే చార్జీలు చెల్లించాలి.

అమౌంట్‌ను బట్టి ఆన్‌లైన్ సర్వీసుల కోసం కూడా వివిధ రకాల చార్జీలు ఉన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆన్‌లైన్ సేవలు అందిస్తూ గత ఐదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.2,300 కోట్లకు పైగా సంపాదించినట్లు ఇటీవలే ప్రభుత్వం లోక్‌సభలో తెలిపింది.

ఇది మాత్రమే కాక.. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా సర్వీసుల ద్వారా గత ఐదేళ్లలో రూ. 2,043 కోట్లను ఆర్జించినట్లు తెలిసింది.

కనీస మొత్తాలను నిర్వహించనందుకు ఎస్‌బీఐ ఏమైనా జరిమానా విధిస్తుందా అనే ప్రశ్నను పార్లమెంట్‌లో అడిగారు.

ఈ ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ ఛౌదరి, '' ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, బ్యాంకులు తమ బోర్డు ఆమోదించిన విధానం ప్రకారం కనీస మొత్తాలను నిర్వహించనందుకు ఖాతాదారులపై చార్జీలను విధించవచ్చు'' అని తెలిపారు.

ప్రభుత్వ రంగ బ్యాంకులు అలాంటి చార్జీల ద్వారా గత ఐదేళ్లలో రూ.8,495 కోట్లను ఆర్జించినట్లు చెప్పారు.

ఛార్జీలు

ఫొటో సోర్స్, Getty Images

బ్యాంకు సర్వీసులకు బోలెడన్ని చార్జీలు

చెక్ బుక్ ఫీజులు, యాన్యువల్ డెబిట్ కార్డు ఫీజులు, అకౌంట్‌ స్టేట్‌మెంట్ ఫిజికల్ కాపీలకు, ఫోన్ బ్యాంకింగ్, డూప్లికేట్ పాస్‌బుక్ జారీ, చెక్ క్యాన్సిలేషన్ వంటి ఎన్నో రకాల సర్వీసులకు బ్యాంకులు కస్టమర్ల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నాయి.

అదేవిధంగా, ఒకవేళ కస్టమర్లు కొత్తగా తమ డెబిట్ కార్డు పిన్‌ను జనరేట్ చేసినా బ్యాంకులు చార్జీలను విధిస్తాయి.

తగినంత బ్యాలెన్స్ లేకపోతే ఇతర బ్యాంకుల ఏటీఎంల వద్ద రిజక్ట్ అయిన ట్రాన్సాక్షన్స్‌కు కూడా ఫీజులు చెల్లించాల్సి వస్తుంది.

నెఫ్ట్ (NEFT) లావాదేవీలకు ప్రతి లక్ష రూపాయలకు కూడా ఫీజు వర్తిస్తుంది.

సిగ్నేచర్ అటెస్టేషన్, కార్డులెస్ క్యాష్ విత్‌డ్రాయల్, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ (ఈసీఎస్) రిటర్న్, చెక్ రిటర్న్, అకౌంట్ క్లోజర్, ఫోటో అటెస్టేషన్ వంటి అన్ని సర్వీసులకు కూడా జీఎస్టీతో సహా ఫీజులను బ్యాంకులకు చెల్లించాలి.

ఉదాహరణకు.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏటీఎం విత్‌డ్రాయల్ ఫీజుల రూపంలో ఎస్‌బీఐ రూ.331 కోట్లను ఆర్జించింది.

మిగిలిన 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ సమయంలో రూ.925 కోట్ల నష్టాన్ని ఎదుర్కొన్నాయని ప్రభుత్వం లోక్‌సభలో తెలిపింది.

2025 మార్చి డేటా ప్రకారం.. ఎస్‌బీఐ మాత్రమే దేశంలోని మొత్తం ఏటీఎం విత్‌డ్రాయల్స్‌లో 31 శాతాన్ని కలిగి ఉందని తెలిసింది.

బ్యాంకుల్లో వివిధ రకాల ఛార్జీలు

ఫొటో సోర్స్, Getty Images

కనీస మొత్తాలపై చర్చ, ఆర్‌బీఐ ఏం సమాధానమిచ్చింది..

అన్ని ప్రైవేట్ బ్యాంకులు, కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు కనీస మొత్తాల (మినిమమ్ బ్యాలెన్స్) నిబంధనలను అమలు చేస్తున్నాయి.

అకౌంట్‌లో కనీసం ఉంచాల్సిన మొత్తాలను నిర్వహించకపోతే (మినిమమ్ బ్యాలెన్స్ పెట్టకపోతే).. కస్టమర్లపై జరిమానాలు విధిస్తున్నాయి.

ఇటీవల ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంకు మెట్రోలు, నాన్ మెట్రో నగరాలకు కనీస మొత్తాల పరిమితిని రూ.10 వేల నుంచి రూ.50 వేలకు పెంచి పలు విమర్శలను ఎదుర్కొంది.

ఈ విమర్శల తర్వాత కనీస మొత్తాల పరిమితిని రూ.50 వేల నుంచి రూ.15 వేలకు తగ్గించింది.

బ్యాంకు ప్రకటన ప్రకారం.. ఆగస్టు 1 నుంచి తెరిచే కొత్త పొదుపు ఖాతాలకు ఈ చార్జీలు అమలవుతాయి.

సెమీ అర్బన్ ప్రాంతాల్లోని బ్రాంచుల అకౌంట్లకు కనీస మొత్తాల పరిమితిని రూ.25 వేలకు పెంచింది. అంతకుముందు ఈ పరిమితి రూ.5 వేలుగా ఉండేది.

అలాగే, గ్రామాల్లోని అకౌంట్లకు కనీస మొత్తాల పరిమితిని రూ.5 వేలకు బదులు రూ.10 వేలు చేసింది.

అయితే, కనీస మొత్తాల పరిమితిని సొంతంగా నిర్ణయించుకునే అధికారం ప్రైవేట్ బ్యాంకులకు ఉందని రిజర్వు బ్యాంకు గవర్నర్ సంజయ్ మల్హోత్రా వార్తా సంస్థ ఏఎన్ఐకి చెప్పారు.

కనీస మొత్తాల ఛార్జీలు

ఫొటో సోర్స్, Getty Images

ఒక్కో బ్యాంకులో ఒక్కో రకంగా కనీస మొత్తాల నిబంధన

భారత్‌లో కనీస మొత్తాల నిబంధనలు ఒక్కో బ్యాంకులో ఒక్కో రకంగా ఉన్నాయి.

ఉదాహరణకు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అర్బన్ బ్రాంచులలోని అకౌంట్లకు కనీస నెలవారీ బ్యాలెన్స్‌ను రూ.10 వేలు ఉంచాలనే నిబంధన విధించింది.

లేదంటే, ఏడాది ఒక్కరోజుకు మెచ్యూరిటీ అయ్యే ఎఫ్‌డీలో లక్ష రూపాయలను డిపాజిట్ చేసైనా ఉంచాలి.

ప్రైవేట్ రంగంలోని కొటక్ మహింద్రా బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్లకు కనీస మొత్తాల నిబంధన రూ.10 వేల నుంచి రూ.20 వేలు మధ్యలో ఉంది.

ఒకవేళ మీ బ్యాంకులో అంతకంటే తక్కువ మొత్తం ఉంటే 6 శాతం చార్జీని విధిస్తుంది.

యాక్సిస్ బ్యాంకు నిబంధనల ప్రకారం.. అర్బన్ లేదా గ్రామీణ ప్రాంతాల్లోని ఏ బ్రాంచు అకౌంట్‌లోనైనా మినిమమ్ బ్యాలెన్స్ రూ.10 వేలు ఉంచాలి.

లేదంటే.. ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలానికి కనీసం రూ.50 వేలను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి ఉండాలి.

ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకు ఆఫ్ బరోడా నిబంధన ప్రకారం.. మెట్రో శాఖలలో చెక్ ఫెసిలిటీ కోసం త్రైమాసిక సగటు మొత్తం రూ.2 వేలు ఉంచాలి.

అలాగే, సెమీ అర్బన్ బ్రాంచు అకౌంట్లకు అయితే, రూ.వెయ్యి రూపాయలు అవసరం.

పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ కనీస మొత్తాల నిబంధనను తొలగించింది.

అలాగే, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా మెట్రో నగరాల్లోని సేవింగ్స్ అకౌంట్లకు రూ.1000 సగటు త్రైమాసిక మొత్తాలు అవసరం.

కెనరా బ్యాంకుకు ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన లేదు.

అలాగే, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో నెలవారీ లేదా త్రైమాసిక బేసిస్‌లో కనీస మొత్తాలను నిర్వహించాల్సిన అవసరం లేదు.

ఇండియన్ బ్యాంకులో అయితే, మీకు చెక్ బుక్ కావాలంటే, మెట్రో, అర్బన్ బ్రాంచు అకౌంట్లలో అయితే కనీసం రూ.2500ను మెయింటైన్ చేయాలి.

చెక్ బుక్ అవసరం లేదనుకుంటే, రూ.1000 సరిపోతాయి.

కనీస మొత్తాలను నిర్వహించాలని అప్పట్లో ఎస్‌బీఐ చెప్పేది. వాటి నుంచి భారీ మొత్తంలో లాభాలను కూడా ఆర్జించేది.

2017 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో కనీస మొత్తాలను నిర్వహించనందుకు కస్టమర్ల నుంచి జరిమానాల రూపంలో ఎస్‌బీఐ రూ. 1771 కోట్లను సేకరించింది. అలాగే, 2017 జులై నుంచి సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ.1581 కోట్ల లాభాలను ఆర్జించింది.

ఆ తర్వాత 2020లో కనీస మొత్తాల నిబంధనను ఎస్‌బీఐ తొలగించింది.

బ్యాంకులు

ఫొటో సోర్స్, Getty Images

కనీస మొత్తాలను నిర్వహించనందుకు బ్యాంకులు ఎందుకు చార్జీలు విధిస్తాయి?

రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం.. అకౌంట్‌ను నిర్వహించినందుకు, సర్వీసు అందించినందుకు అయిన ఖర్చులను భరించేందుకు బ్యాంకులు కనీస మొత్తాల నిబంధనను తీసుకొచ్చాయి.

సేవింగ్స్ అకౌంట్లలో కనీస మొత్తాలను నిర్వహించకపోతే కస్టమర్ల నుంచి బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తాయి. సేవింగ్స్ అకౌంట్లకు చెందిన కనీస మొత్తాలపై ఆర్‌బీఐ ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయలేదు.

ప్రస్తుతం ఎస్‌బీఐ, బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ బరోడా, మరికొన్ని ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులలో కనీస మొత్తాలను నిర్వహించనందుకు ఎలాంటి చార్జీలు విధించడం లేదు.

కొన్ని బ్యాంకులు చెక్ సదుపాయం కోసం కనీస మొత్తాలను నిర్వహించాలని కోరుతున్నాయి.

కనీస మొత్తాలను నిర్వహించకపోతే జరిమానా ఎంత

సగటున ప్రతి నెలా ఉంచాల్సిన కనీస మొత్తాలను కస్టమర్లు ఉంచకపోతే భారీ మొత్తంలో జరిమానాలను చెల్లించాలి.

ఉదాహరణకు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్‌లో కనీస మొత్తాలను ఉంచకపోతే.. రూ.300 నుంచి రూ.600 వరకు జరిమానా ఉంది.

అలాగే, యాక్సిస్ బ్యాంకు రూ.50 నుంచి రూ.600 వరకు పెనాల్టీ విధిస్తుంది.

ఎంత మినిమమ్ బ్యాలెన్స్ తగ్గిందో దానిపై ఒక పర్సంటేజ్ రూపంలో ఈ చార్జీలను బ్యాంకులు విధిస్తాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)