ఏపీలో బుడమేరు, తెలంగాణలో మున్నేరు- వరద ఉధృతితో పల్లెలు, పట్టణాల్లోకి భారీగా నీరు

ఫొటో సోర్స్, UGC
- రచయిత, బళ్ల సతీశ్, లక్కోజు శ్రీనివాస్, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ ప్రతినిధులు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జనజీవనానికి ఆటంకంగా మారాయి. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో వానలతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. ఏర్లు, నదులకు భారీగా వరద నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
బుడమేరు వరద ఉధృతితో విజయవాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షాలు, వరదలకు విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు కాగా, కొన్నింటిని దారి మళ్లించారు.
కొండపల్లి, రాయనపాడులో రైలుపట్టాలపై వరదతో, ట్రాక్పైనే రైళ్లు నిలిచి పోయాయి. బస్సుల్లో ప్రయాణికులను అధికారులు తరలించారు.

ఫొటో సోర్స్, I&PR
భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
బాధితులను పరామర్శించేందుకు విజయవాడ సింగ్ నగర్లో ఆయన పర్యటించారు. బుడమేరు ఉప్పొంగి ప్రవహించడంతో సింగ్ నగర్ జలదిగ్బంధంలో చిక్కుకుంది.
విజయవాడలో ఇంత పెద్ద విపత్తును తాను ఎన్నడూ చూడలేదని చంద్రబాబు అన్నారు.
వరద పరిస్థితిపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.



ఫొటో సోర్స్, UGC
తెలంగాణలో వర్ష బీభత్సం: ఉప్పొంగిన మున్నేరు, రైళ్లు రద్దు
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం స్తంభించింది. రోడ్లు కొట్టుకుపోయి ఏపి, తెలంగాణ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల రైల్వే ట్రాక్ లకు నష్టం కలగడంతో అధికారులు రైళ్లను దారిమళ్లించారు.
భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 9మంది చనిపోయినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు.
ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లను రంగంలోకి దించుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి హెలికాప్టర్ను రప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్త పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు.
పునరావాస, రక్షణ చర్యలపై సీనియర్ మంత్రులతో ఫోన్లో మాట్లాడి సూచనలు చేశారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతి రాజ్, వైద్య ఆరోగ్య శాఖ వంటి అత్యవసర శాఖల ఉద్యోగుల సెలవులను రద్దు చేసి రంగంలోకి దించాలని, జిల్లాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించి చర్యలు తీసుకోవాలని టెలికాన్ఫరెన్స్ లో కలెక్టర్లను ఆదేశించారు సీఎం.
ఎంపీ, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉండి పరిస్థితులను సమీక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ఫొటో సోర్స్, UGC
జలదిగ్బంధంలో ఖమ్మం, మహబూబాబాద్
భారీ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలపై పడింది.
ఖమ్మం పట్టణంలో మున్నేరు ఉధృతికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. ప్రకాశ్ నగర్ వద్ద మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో వరద ప్రవాహానికి రైల్వే పట్టాలకింద కంకర కొట్టుకుపోయింది. ట్రాక్ దెబ్బతినడంతో ఆ రూట్ లో రైళ్ల ను నిలిపివేశారు.
మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో నిలిపివేసిన మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ ప్రయాణీకులకు స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు ఆహారపదార్ధాలు, నీరు అందించారు. ప్రస్తుతం ట్రాక్ పునరుద్ధరణ పనులు సాగుతున్నాయి.
ఏపీ, తెలంగాణలో ఏర్పడ్డ పరిస్థితులపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ సికింద్రాబాద్ రైల్ నిలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు, పట్టాల మరమ్మతు, రైల్ సర్వీసుల పునరుద్ధరణపై చర్చించారు.
అధికారులు విజయవాడ-కాజీపేట మార్గంలో పలు రైళ్లను పూర్తిగా రద్దుచేయడం లేదా దారి మళ్లించడం చేశారు.

ఫొటో సోర్స్, UGC
జలదిగ్బంధంలో ఖమ్మం
ఖమ్మం పట్టణాన్ని ఊహించని వరద చుట్టుముట్టింది. మున్నేరు నది ఉధృతంగా పారుతోంది. ప్రస్తుతం 27.5 అడుగుల ఎత్తులో మున్నేరు ప్రవహిస్తోంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
పట్టణంలోని సగం కాలనీలు నీట మునిగాయి. ప్రకాశ్ నగర్ ప్రాంతం జలదిగ్బంధంలో ఉంది. ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపై తొమ్మిది మంది ఉదయం నుండి చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు హెలికాప్టర్ ను రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చీకటి పడటంలో బ్రిడ్జిపైన చిక్కుకున్న వారి భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది.
“ఖమ్మం పట్టణం గతంలో ఎన్నడూ చూడని వరద ఇది. సగం కాలనీలు మునిగిపోయాయి. నీరు చేరని ప్రదేశం అంటూ లేదు. పట్టణం నడిబొడ్డున 5 అడుగుల నీరు ప్రవహిస్తోంది. వరద అంచనా, సహాయక చర్యల్లో అధికారులు విఫలం అయ్యారు. జిల్లా నుండి ముగ్గురు మంత్రులు ఉన్నా సమయానికి హెలికాప్టర్ను రప్పించలేకపోయారు.’’ అని తన వివరాలు వెల్లడించడానికి ఇష్టపడని జర్నలిస్ట్ ఒకరు బీబీసీ తో చెప్పారు.
“మున్నేరుకు ప్రొటెక్షన్ వాల్ నిర్మాణ పనులు నత్తనడక కొనసాగుతున్నాయి. నాలాల కబ్జా, మున్నేరు వరద ఒత్తిడితో నీరు బయటికి పోవడం లేదు.’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, UGC
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితి
మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది.
నెక్కొండ మండలం వెంకటాపురం సమీపంలో శనివారం రాత్రి నుండి 40 మంది ప్రయాణీకులతో ఉన్న ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుపోగా, ఆదివారం నాడు అధికారులు వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
తెలంగాణకు 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్ తెలిపారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో ఆయన పరిస్థితిపై ఫోన్లో ఆరా తీసారు.
ఎన్టీఆర్ఎఫ్ ఉన్నతాధికారులతో మాట్లాడిన బండి సంజయ్ రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయకచర్యల్లో పాల్గొనాలని సూచించారు.
మరోవైపు భారీ వర్షాలతో తెలంగాణ ప్రాజెక్టుల్లోకి భారీ వరద చేరుతోంది. మేడిగడ్డ బరాజ్ కు 1.57 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లు 53వేల ఇన్ ఫ్లో వస్తుండగా ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం 80.5 టీఎంసీలకు గాను 63 టీఎంసీల కు నిల్వ చేరింది.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు 1.20 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా , ప్రస్తుతం ప్రాజెక్ట్ లో 20 టీఎంసీల పూర్తి నిల్వ సామర్థ్యానికి గాను 17 టీఎంసీలకు నిల్వ చేరింది.
భారీ వర్షాల నేపథ్యంలో రేపు తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తున్నట్టుగా మంత్రి పొంగులేటి తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)















