అమెరికా: టోర్నాడో‌తో తుడిచిపెట్టుకు పోయిన పట్టణం... 26 మంది మృతి

కుప్పగా పడి ఉన్న కార్లు

ఫొటో సోర్స్, Reuters

అమెరికాలోని మిసిసిప్పి, అలబాబాలలో వచ్చిన టోర్నాడోల వల్ల సుమారు 26 మంది చనిపోయారు.

మిసిసిప్పిలో ఎమర్జన్సీ విధించారు. సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన చేపడుతున్న ప్రభుత్వం తెలిపింది.

రోలింగ్ ఫోర్క్‌లో నుజ్జునుజ్జు అయిన కార్లు, కూలిన ఇళ్లు, చెత్తాచెదారం, గాజు ముక్కలు ఇలా అన్నింటితో వీధులు నిండిపోయాయి. ఆ నగరం దాదాపుగా తుడుచు పెట్టుకు పోయింది.

కొన్ని ప్రాంతాల్లో టోర్నడోలు దాదాపు 9 వేల మీటర్ల ఎత్తుకు పైగా సామగ్రి తీసుకెళ్లి కిందపడేశాయి.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా మిస్సిస్సిపీ చిత్రాలను చూసి "హృదయ విదారకం" అంటూ ఆవేదన చెందారు.ఫెడరల్ ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తుందని హామీ ఇచ్చారు.

"మీతోనే ఉంటాం. మీరు కోలుకోవడానికి అవసరమైన సహాయాన్ని అందించడానికి మేం కలిసి పని చేస్తాం" అని బైడెన్ ఒక ప్రకటనలో తెలిపారు.

మరోవైపు ఆదివారం తెల్లవారుజామున అలబామా, జార్జియాలోని కొన్ని ప్రాంతాలను మరిన్ని తుఫానులు తాకవచ్చని, భారీ వడగళ్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

టోర్నడో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టోర్నడో ధాటికి రోలింగ్ ఫోర్క్ పట్టణం తుడిచిపెట్టుకుపోయింది.
మిస్సిస్పిపీలో సుడిగాలులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టోర్నడో ధాటికి సామగ్రి వేల అడుగుల ఎత్తుకు ఎగిరాయి.

'మా పట్టణం తుడిచిపెట్టుకుపోయింది'

మిస్సిస్సిప్పిలోకి వచ్చిన తుఫాను సుడిగాలిని సృష్టించింది. ఇది అక్కడి కమ్యూనిటీలకు విపత్కర నష్టాన్ని కలిగించింది.

ఈ సుడిగాలి అనేక చిన్న పట్టణాలలో డజన్ల కొద్దీ భవనాలను తుడిచిపెట్టింది. కార్లను తిప్పి పడేసింది. విద్యుత్ లైన్లను పడగొట్టింది.

పశ్చిమ మిస్సిస్సిప్పిలోని షార్కీ కౌంటీలో ఉన్న చిన్న పట్టణం రోలింగ్ ఫోర్క్. ఇది తుడిచిపెట్టుకుపోయిందని అక్కడి మేయర్ స్పష్టంచేశారు.

"నా నగరం పోయింది" అని మేయర్ ఎల్డ్రిడ్జ్ వాకర్ సీఎన్ఎన్ వార్తాసంస్థతో అన్నారు. "కానీ మేం ధైర్యంగానే ఉన్నాం, మేం కోలుకుంటాం" అన్నారు.

చాలా కుటుంబాలు ప్రభావితమయ్యాయని, బాధకు గురవుతున్నాయని చెప్పారు. ఇక చూడగలిగేది వినాశనం మాత్రమే అని మేయర్ ఆవేదన వ్యక్తంచేశారు.

రోలింగ్ ఫోర్క్ నివాసితుల ఇళ్లలో కిటికీలు ఊడిపోయాయని చెప్పారు.

స్థానిక నివాసి బ్రాందీ షోవా సీఎన్ఎన్‌తో మాట్లాడుతూ "నేను ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు. ఇది చాలా గొప్ప చిన్న పట్టణం, ఇప్పుడు నాశనమైంది" అన్నారు.

బాత్ రూంలో ఉండటం వల్ల తాను బతికి పోయినట్లు ఫ్రాన్‌సిస్కో మెక్‌‌నైట్ అనే వ్యక్తి తెలిపారు. టోర్నాడో రాగానే తాను బాత్‌రూంలోకి వెళ్లి బాత్ టబ్‌లో దాక్కున్నట్లు ఆయన వెల్లడించారు. మిగతా ఇల్లు మొత్తం కొట్టుకొని పోయినట్లు చెప్పారు.

5 నుంచి 10 నిమిషాల పాటో టోర్నాడో ఉందని ఫ్రాన్‌సిస్కో అన్నారు. అయితే టోర్నాడో గురించి ముందే తమకు ఎటువంటి హెచ్చరికలు రాలేదని తెలిపారు.

మిస్సిస్సిపీలో సుడిగాలులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సుడిగాలుల కారణంగా మిస్సిస్సిపీలో వేలాది మంది రోడ్డున పడ్డారు.

సుడిగాలికి ముందు నిశ్శబ్ధం, చీకటిగా ఆకాశం

కార్నెల్ నైట్ అనే వ్యక్తి అసోసియేటెడ్ ప్రెస్‌ వార్తాసంస్థతో మాట్లాడుతూ '' నేను, నా భార్య కుమార్తెతో రోలింగ్ ఫోర్కులోని బంధువుల ఇంట్లో ఉన్నాం. సుడిగాలి తాకడానికి ముందు నిశ్శబ్దంగా ఉంది. ఆకాశం నల్లగా మారింది'' అని తెలిపారు.

ఈ సుడిగాలి తనకు సంబంధించిన మరో బంధువుల ఇంటిని తాకిందని, అక్కడ గోడ కూలిపోయి లోపల చాలామంది చిక్కుకుపోయారని ఆయన చెప్పారు.

సిల్వర్ సిటీ, వినోనాను మిస్సిస్సిపీ గవర్నర్ టేట్ రీవ్స్ సందర్శించి సుడిగాలి బాధిత నివాసితులను కలుసుకున్నారు. పరిస్థితి విషాదంగా ఉందన్నారు.

తాము ధైర్యవంతులమని, సమర్థంగా ప్రతిస్పందిస్తామని, తమను పొరుగువారు ప్రేమతో ఆశీర్వదించారని, దయచేసి తమ కోసం ప్రార్థించడం కొనసాగించడంటూ టేట్ రీవ్స్ కోరారు.

శుక్రవారం రాత్రి ఈ ప్రాంతాన్ని ఎన్ని టోర్నడోలు తాకాయనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

నేషనల్ వెదర్ సర్వీస్ అనేక టోర్నడోలు వచ్చే అవకాశం ఉందని శుక్రవారం హెచ్చరించింది. అయితే "స్కిప్పింగ్ టోర్నడో" వల్ల విధ్వంసం సంభవించే అవకాశం ఉంది.

ఈ సుడిగాలి ఉపరితలం నుంచి పైకి లేచి మళ్లీ భూమిని తాకుతుంది.

యూనివర్శిటీ ఆఫ్ ఓక్లహోమాలోని స్కూల్ ఆఫ్ మెటియోరాలజీకి చెందిన సామ్ ఎమ్మెర్సన్ మాట్లాడుతూ అత్యంత అధిక పరిమాణం గలిగిన ఈ సుడిగాలి దాదాపు 9,144 మీటర్ల ఎత్తుకు శిథిలాలను లేపి, కింద పడేసింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)