ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు చైనా పెను ముప్పు: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ రాట్‌క్లిఫ్

అమెరికా, చైనా డేటా చౌర్యం

రెండో ప్రపంచ యుద్ధం నుంచి చైనా ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు పెను ముప్పుగా మారిందని అమెరికా టాప్ ఇంటెలిజెన్స్ అధికారి అన్నారు.

"అమెరికా రహస్యాలు దొంగిలిస్తూ, మార్కెట్లో అమెరికా సంస్థలను భర్తీ చేస్తూ చైనా తన శక్తి పెంచుకుంటోంద"ని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జాన్‌ రాట్‌క్లిఫ్ అన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనంలో చెప్పింది.

ట్రంప్ ప్రభుత్వం చైనాపై కఠినంగా వ్యవహరిస్తోంది. చైనా వస్తువులపై సుంకాలు విధించింది. తమ మేధోసంపత్తిని దొంగిలిస్తున్నారని ఆ దేశంపై ఆరోపణలు చేసింది. కానీ, చైనా ఈ ఆరోపణలపై ఇంకా స్పందించలేదు.

అయితే, తమ టెక్ దిగ్గజం హువావేను అమెరికా మార్కెట్‌కు దూరంగా పెట్టడం, తమ వస్తువులపై సుంకాలు విధించడం లాంటి చర్యలపై చైనా స్పందించింది.

"ఆర్థికంగా, సైనికపరంగా, సాకేతికంగా ప్రపంచ ఆధిపత్యమే లక్ష్యంగా చైనా అమెరికాను ఎదుర్కోవడానికి సన్నాహాలు చేస్తోంద"ని రాట్‌క్లిఫ్ ఆరోపించారు.

ఆయన కొన్ని వ్యాఖ్యల్లో అంతకు ముందు విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో, ఎఫ్‌బీఐ చీఫ్ క్రిస్టఫర్ ప్రస్తావించిన అంశాలు కూడా ప్రతిధ్వనించాయి.

అయితే, అమెరికా మిత్రదేశమైన ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచిన చైనా, ఆస్ట్రేలియా వైన్ మీద దిగుమతిపై సుంకాలు విధించి, అఫ్గానిస్తాన్‌లో హక్కుల ఉల్లంఘన గురించి ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్న సమయంలో రాట్‌క్లిఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

‘‘చైనాపై రకరకాల రాజకీయ అణచివేత చర్యలను ప్రారంభించారు. చైనాను అదుపు చేయాలనే ఒక బలమైన సైద్ధాంతిక పక్షపాతం, వ్యూహంతో ఇలా చేస్తున్నారు. అందరిపై గూఢచారులనే ముద్ర వేయడం అమెరికా మానేస్తుందని మేం ఆశిస్తున్నాం" అని చైనా విదేశాంగ మంత్రి హువా చున్యింగ్ బుధవారం ఆరోపించారు.

చైనా సైనికులు

ఫొటో సోర్స్, Reuters

రాట్‌క్లిఫ్ ఇంకా ఏమన్నారు

అమెరికా ఇంటెలిజెన్స్ ప్రధానంగా తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, రష్యాపై దృష్టిపెట్టేదని, ఇప్పుడు వాటి స్థానాన్ని చైనా భర్తీ చేసిందని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ రాట్‌క్లిఫ్ అన్నారు.

చైనా ఒకరకమైన ఆర్థిక గూఢచర్యంలో మునిగుందన్న ఆయన ఆ చర్యలను 'రాబ్, రెప్లికేట్, రీప్లేస్‌'గా వర్ణించారు.

ప్రపంచమంతటా తన ఉత్పత్తులు అమ్మాలనుకున్న ఒక చైనా విండ్ టర్బైన్ సంస్థ, అమెరికాలో తన ప్రత్యర్థి సంస్థ సమాచారం దొంగిలించి దోషిగా నిలిచిందని దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పారు. షేర్ల ధరలు పడిపోవడంతో సదరు అమెరికా సంస్థ తమ సిబ్బందిని కూడా తొలగించిందని చెప్పారు.

అమెరికా నుంచి ప్రతి ఏటా 500 బిలియన్ డాలర్ల విలువైన మేథోసంపత్తి చౌర్యానికి గురవుతోందని, తమ పరిశోధనలను దొంగిలిస్తున్న చైనీయులను ఎఫ్‌బీఐ తరచూ అరెస్ట్ చేస్తోందని రాట్‌క్లిఫ్ అన్నారు.

హార్వార్డ్ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం చీఫ్‌కు, ఈ ఏడాది ప్రారంభంలో ఆయన అరెస్ట్ అయ్యే ముందు వరకూ అది నెలకు 50 వేల డాలర్లు చెల్లించేదని ఆరోపించారు.

హువావే లాంటి టాప్ చైనా టెక్నాలజీ సంస్థలు అందించే సాంకేతికతలో చైనా నిఘా ఇంటెలిజెన్స్ వర్గాలు జోక్యం చేసుకుంటున్నాయని, ఫలితంగా.. చైనా టెక్నాలజీని ఉపయోగించే మిత్రదేశాలతో తమ నిఘా సమాచారాన్ని పంచుకోలేకపోతున్నామని తెలిపారు.

జీవశాస్త్రపరంగా మెరుగైన సామర్థ్యాలు ఉన్న సైనికులను తయారు చేయడానికి చైనా తమ సైన్యంలో 'మనుషులపై ప్రయోగాలు చేసిందనే విషయాన్ని అమెరికా నిఘా దళాలు బయటపెట్టాయని అన్నారు.

చైనా తమ కాంగ్రెస్ సభ్యులను రష్యాకంటే ఆరు రెట్లు, ఇరాన్ కంటే 12 రెట్లు ఎక్కువగా లక్ష్యంగా చేసుకుందన్నారు.

అమెరికాలాగే మిగతా దేశాలు కూడా చైనా నుంచి ఇలాంటి సవాళ్లే ఎదుర్కుంటున్నాయి.

"తాము అగ్ర స్థానంలో లేని ప్రపంచ క్రమాన్ని చైనా ఒక చారిత్రక ఉల్లంఘనగా భావిస్తోంది. దానిని మార్చి, ప్రపంచమంతటా వ్యాపించిన స్వేచ్ఛను లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)