కరోనావైరస్‌: 90 నిమిషాల్లో కోవిడ్-19 టెస్ట్‌ ఫలితం, దీంతో ఇతర వ్యాధులనూ గుర్తించొచ్చు

కరోనావైరస్ పరీక్ష

ఫొటో సోర్స్, Getty Images

కరోనావైరస్‌తోపాటు సాధారణ జ్వరాలను గంటన్నర సమయంలో గుర్తించగలిగే కొత్త రకం టెస్టింగ్‌ కిట్‌లను బ్రిటన్‌లోని కేర్‌హోమ్‌లు, లేబొరేటరీలలో వచ్చేవారం నుంచి ప్రవేశపెట్టబోతున్నారు.

ఈ ఆన్‌-ది-స్పాట్, డీఎన్‌ఏ టెస్టుల వల్ల సాధారణ సీజనల్‌ జ్వరాలు, కోవిడ్‌-19కు మధ్య తేడా తెలుసుకోవడం సులభమవుతుందని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా సీజనల్‌ వ్యాధులు ప్రబలే శీతాకాలంలో ఈ టెస్టింగ్‌ విధానం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని బ్రిటన్ హెల్త్ సెక్రటరీ వెల్లడించారు.

ప్రస్తుతం జరుగుతున్న టెస్టుల్లో మూడోవంతు పరీక్షలకు ఫలితాలు రావడానికి 24 గంటలు పడుతుండగా, పావువంతు టెస్టులకు దాదాపు రెండురోజుల సమయం పడుతోంది.

సరిపడినన్ని కిట్‌లు అందుబాటులో లేకపోవడంతో జులైలో లక్ష్యంగా పెట్టుకున్న టెస్టుల సంఖ్యలో ప్రభుత్వం కోత విధించిన నేపథ్యంలో ఈ కిట్‌లపై బ్రిటన్ ప్రభుత్వం తాజాగా ప్రకటన చేసింది.

లేబొరేటరీలు, అడల్ట్‌ కేర్‌ సెంటర్లలో దాదాపు 5 లక్షల టెస్ట్‌కిట్‌లు వచ్చేవారం నుంచి అందుబాటులో ఉంటాయని, మరో పదిలక్షల కిట్‌లు వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.

వీటితోపాటు లండన్‌లోని 8 ఆసుపత్రులలో ఇప్పటికే అందుబాటులో ఉన్న వేలాది డీఎన్‌ఏ మెషీన్‌లను సెప్టెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌హెచ్‌ఎస్‌ ఆసుపత్రులలో అందుబాటులో ఉండేలా చూస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

రాబోయే కొద్దినెల్లలో దాదాపు 5,000 మెషీన్‌లతో 5.8 మిలియన్ల టెస్టులు చేయబోతున్నామని హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది. తాజాగా రూపొందించిన టెస్టింగ్‌ విధానం ఎంతో కీలకమైందని హెల్త్ సెక్రటరీ మాట్‌ హాన్‌కాక్‌ అభిప్రాయపడ్డారు.

90 నిమిషాలలో ఫలితాలను ఇచ్చే ఈ టెస్టు వైరస్‌ వ్యాప్తి చైన్‌ను గుర్తించడానికి ఎంతో ఉపయోగపడుతుందని హాన్‌కాక్‌ అన్నారు.

"త్వరలో శీతాకాలం వస్తోంది. ఈ సమయంలో ఏది కోవిడ్‌, ఏది సాధారణ జ్వరం అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. త్వరగా ఫలితం తేలడం వల్ల పేషెంట్లు సరైన చికిత్సను పొందగలరు'' అని ఆయన అన్నారు.

కరోనావైరస్ పరీక్ష

ఫొటో సోర్స్, AL SEIB

కచ్చితమైన ఫలితాలు

ఈ ర్యాపిడ్‌ టెస్టులు అత్యంత కచ్చితమైన ఫలితాలను ఇస్తున్నాయని ఈ మెషీన్‌లను తయారు చేసిన డీఎన్‌ఏ నడ్జ్‌ సంస్థ సహవ్యవస్థాకుడు ప్రొఫెసర్‌ క్రిస్‌ టొమజౌ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఇది అందరికీ సులభంగా అందుబాటులో ఉండగల సామర్ధ్యం ఉన్న టెస్టింగ్‌ సాధనమని ఈ మెషీన్‌ను సరఫరా చేస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ నానోపోర్‌ సంస్థ సీఈవో గోర్డాన్‌ సంఘేరా అన్నారు.

జులై 6 నాటికి ఈ టెస్టింగ్‌ సాధనాలు కేర్‌హోమ్స్‌లో ఉంటున్నవారికి, సిబ్బందికి అందుబాటులోకి తీసుకురావాలని భావించినా, సెప్టెంబర్‌ మొదటివారం వరకు అందుబాటులోకి రాకపోవచ్చని అధికారులు చెబుతున్నారు.

కేర్‌హోమ్‌లకు తక్కువ కిట్‌లు అందుబాటులో ఉండటానికి అనేక కారణాలున్నాయని, వీటిని పెంచడానికి కృషి చేస్తున్నామని బ్రిటన్ ఆరోగ్య శాఖ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

గత నెలలలో ఇంటి దగ్గర నిర్వహించగల పరీక్షలకు సంబంధించిన ఒక బ్రాండ్‌కు చెందిన కిట్‌లను భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం నిషేధించింది.

మరోవైపు వ్యాధిబారి నుంచి బైటపడ్డవారు ప్లాస్మాను దానం చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్లాస్మా సహకారంతో రోగులకు నేషనల్ హెల్త్‌ సర్వీస్‌ చికిత్స అందించబోతోంది.

రోగ నిరోధకతను వృద్ధి చేసుకోలేక ఇబ్బంది పడుతున్న కోవిడ్‌-19 రోగులకు ప్లాస్మాను ఎక్కించడం వల్ల ఏ మేరకు ప్రయోజనం ఉంటుదన్న దానిపై వైద్యరంగ నిపుణులు కీలకమైన ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.

బ్రిటన్‌లో ఆదివారం 8 మంది కోవిడ్‌-19 కారణంగా మరణించగా, ఇప్పటి వరకు ఇక్కడ చనిపోయినవారి సంఖ్య 46,201కి చేరింది. నివేదికలు రావడంలో ఆలస్యం కారణంగా వారాంతాలలో మరణాల సంఖ్య తక్కువగా కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 744 కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.

తెరుచుకుంటున్న హోటళ్లు

ఫొటో సోర్స్, PA Media

కరోనా రోగుల ఇతర వ్యాధులను కూడా గుర్తించవచ్చు

హెల్త్‌ కరస్పాండెంట్‌లారెన్‌ మాస్‌ విశ్లేషణ

కోవిడ్‌-19 పరీక్ష ఫలితం ఎంత సమయంలో వస్తే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది అన్నది గుర్తించడంపై చాలారోజుల నుంచి పరిశీలన నడుస్తోంది.

దాదాపు ముప్పావువంతు టెస్టుల్లో ఫలితాలు 24 గంటల్లో వెలువడుతుండగా, పావువంతు టెస్టులకు రెండు రోజుల సమయం పడుతోంది.

తాజాగా వచ్చిన ర్యాపిడ్‌ టెస్ట్‌కిట్‌లు వేగంగా అంటే 90 నిమిషాల్లో ఫలితాలను ఇవ్వడం అనేది చాలా కీలకమైన అంశం.

ఈ పరీక్ష ఫలితాల నాణ్యతపై ఇంత వరకు ఎలాంటి డేటా అందుబాటులో లేకపోయినా, తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువని దీని రూపకర్తలు చెబుతున్నారు.

ఇతర సీజనల్‌ వ్యాధులను కూడా గుర్తించడం ఈ టెస్ట్‌కిట్‌ల మరో ప్రధానమైన ప్రత్యేకత. కరోనావైరస్‌ పేషెంట్లకు ఇతర సీజనల్‌ వ్యాధులు కూడా ఏమైనా ఉన్నాయా అన్న విషయాన్ని డాక్టర్లు సులభంగా గుర్తించే అవకాశం ఉండటం ఇందులోని ప్రధాన ప్రయోజనం.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)