బ్రెగ్జిట్: ఐదు వారాల పాటు బ్రిటన్ పార్లమెంటు రద్దు.. ముందస్తు ఎన్నికల ప్రతిపాదన తిరస్కరించిన ఎంపీలు

ప్రతినిధుల సభలో ఎంపీల నిరసన

ఫొటో సోర్స్, Rosie Duffield MP

ఫొటో క్యాప్షన్, ప్రతినిధుల సభలో ఎంపీల నిరసన

యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంటును ఐదు వారాల పాటు అధికారికంగా రద్దు చేశారు. దీంతో అక్టోబర్ 14వ తేదీ వరకు ఎంపీలు పార్లమెంటుకు హాజరుకారు.

అయితే, ప్రతినిధుల సభలో మంగళవారం ఈ ప్రొరోగ్ కార్యక్రమం జరుగుతున్నప్పుడు కొందరు ఎంపీలు దీన్ని వ్యతిరేకిస్తూ ‘సిగ్గు..సిగ్గు’ అంటూ నినాదాలు చేయగా, మరికొందరు తమను మాట్లాడకుండా చేశారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

కాగా, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రతిపాదనను ఎంపీలు తిరస్కరించారు. ఈ ప్రతిపాదనకు రెండింట మూడొంతుల మద్దతు లభించాల్సి ఉండగా కేవలం 293 మంది ఎంపీలు మాత్రమే అనుకూలంగా ఓటు వేశారు.

ఆగస్టులో పార్లమెంటు ప్రొరోగ్ సిఫార్సుకు ఆమోదం తెలిపిన మహారాణి

బ్రిటన్ పార్లమెంటును ప్రొరోగ్ చేయాలన్న ప్రభుత్వ సిఫార్సుకు ఆ దేశ మహారాణి ఆగస్టు 28వ తేదీన ఆమోదముద్ర వేశారు. సెప్టెంబరులో పార్లమెంటును ప్రొరోగ్ చేయనున్నారు.

సెప్టంబర్‌లో ఎంపీలు వచ్చిన కొన్ని రోజుల తర్వాత, బ్రెగ్జిట్ డెడ్‌లైన్‌కు కొన్ని రోజుల ముందు పార్లమెంటును ప్రొరోగ్ చేయాలని ప్రభుత్వం సిఫారసు చేసింది.

"పార్లమెంటు ప్రోరోగ్ చేసిన తర్వాత అక్టోబర్ 14న మహారాణి ప్రసంగం ఉంటుంది. అందులో ఆమె ఒక అద్భుతమైన ఎజెండా రూపురేఖలు సిద్ధం చేస్తారు" అని ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు.

ఎంపీ డామినిక్ గ్రివ్ ప్రభుత్వ చర్యను అసంబద్ధమైనదిగా వర్ణించారు. దీనివల్ల బోరిస్ జాన్సన్ ప్రభుత్వం కూలిపోవచ్చని హెచ్చరించారు.

కానీ ప్రధాని బోరిస్ జాన్సన్ మాత్రం "ఇది పూర్తిగా అబద్ధం. సస్పెన్షన్ ఒప్పందాన్ని పూర్తి చేయకూడదనే ఆయన ఇలా చేస్తున్నారు. నేను బ్రెగ్జిట్ వరకూ వేచిచూడలేను. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే నా ప్రణాళికలు అమలు చేసేందుకు ఎదురుచూడలేను" అన్నారు.

దానితోపాటు పార్లమెంటు దగ్గర బ్రిటన్ విడిపోవడం గురించి చర్చించడానికి ఇంకా 'తగినంత సమయం' ఉందని అన్నారు.

"మనకు కొత్త చట్టం అవసరం ఉంది. మనం కొత్త, ముఖ్యమైన బిల్లు తీసుకుని వస్తున్నాం. అందుకే మేం మహారాణి ప్రసంగం ఏర్పాటు చేయబోతున్నాం" అని బోరిస్ జాన్సన్ చెప్పారు.

పార్లమెంట్ ప్రొరోగ్ చేయాలనే ఆలోచన వివాదాస్పదమవుతోంది. ఇది బ్రెగ్జిట్ అంశంలో ఎంపీలు తమ ప్రజాస్వామ్య భాగస్వామ్యం నిలబెట్టుకోడాన్ని అడ్డుకుంటుందని విమర్శకులు అంటున్నారు.

మాజీ ప్రధాన మంత్రి జాన్ మేజర్ సహా చాలా మంది ప్రముఖులు దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తామని బెదిరించారు. ఎస్ఎన్‌పి న్యాయ ప్రతినిధి జోవానా చెరీ ఇప్పటికే ఈ అంశాన్ని సవాలు చేసేందుకు స్కాటిష్ కోర్టుల్లో పనులు ప్రారంభించేశారు.

బోరిస్ జాన్సన్

ఫొటో సోర్స్, Getty Images

మహారాణి పాత్ర

"మహారాణి ప్రసంగానికి ముందే పార్లమెంటును ప్రొరోగ్ చేయడానికి ఇది ఉదాహరణ. ఇప్పుడు ప్రభుత్వ అభ్యర్థనను రాణి తిరస్కరించడం అసాధ్యం" అని బీబీసీ రాజ ప్రతినిధి జానీ డైమండ్ అన్నారు.

"నేను ఒక డీల్‌తోపాటు అక్టోబర్ 31న యూరోపియన్ యూనియన్ వీడాలని అనుకుంటున్నాను. కానీ ఇది అటో ఇటో తేల్చుకోవాల్సి స్థితి" అని ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు.

ఈ ప్రణాళికను అడ్డుకోడానికి ఎంపీలందరూ ఏకం కావాలని స్కాట్లాండ్ మంత్రి నికోలా స్టర్జన్ పిలుపునిచ్చారు. లేదంటే ఈరోజు బ్రిటన్ ప్రజాస్వామ్యానికి చరిత్రలో ఒక చీకటి రోజుగా నిలిచిపోతుందని అన్నారు.

బోరిస్ జాన్సన్ తన ప్రణాళిక గురించి చెబుతూ "ఇది ఒక ముఖ్యమైన శాసన కార్యక్రమంలా ఉంటుంది. కానీ అందులో ఎంపీల ఆకాంక్షలకు ఎలాంటి లోటూ ఉండకూడదని" ఎంపీలకు లేఖలు రాశారు.

ఆయన అక్టోబర్ 31 వరకూ పార్లమెంటులో 'ఐక్యత, సంకల్పం' చూపించాలని అర్థించారు. దాని వల్ల ప్రభుత్వానికి యూరోపియన్ యూనియన్‌తో ఒక కొత్త ఒప్పందాన్ని కాపాడే అవకాశం లభిస్తుందని అన్నారు.

"ఎలాంటి ఒప్పందం లేకుండా యూరోపియన్ యూనియన్ వదిలే సన్నాహాలపై ప్రభుత్వం ఈలోపు ఒక బాధ్యతాయుతమైన వైఖరి అవలంబిస్తుంది" అని బ్రిటన్ ప్రధాని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)