‘దేవతలను సంతృప్తి’ పరచడానికి 227 మంది పిల్లల సామూహిక బలి.. పెరూలో బయటపడ్డ 500 ఏళ్లనాటి మృతదేహాలు

చిన్నారుల సామూహిక బలుల ప్రాంతం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, గత ఏడాది జరిగిన తవ్వకాల్లో 200 మంది పిల్లలను బలి ఇచ్చిన ప్రాంతం బయటపడింది

పెరూలో జరిగిన తవ్వకాల్లో ఒకే చోట పిల్లలను సామూహికంగా బలి ఇచ్చిన ప్రాతాన్ని పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇప్పటివరకూ మనుషులను బలి ఇచ్చిన చాలా ప్రాంతాలను కనుగొన్న పరిశోధకులు దీనిని దేశ చరిత్రలోనే అతిపెద్దదిగా భావిస్తున్నారు.

పెరూ రాజధాని లిమాకు ఉత్తరంగా ఉన్న హుయాన్‌చాకో పట్టణంలో జరిగిన తవ్వకాల్లో ఐదు నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్న 227 మంది పిల్లల మృతదేహాలు బయటపడ్డాయి.

ఈ పిల్లలను 500 ఏళ్ల క్రితం బలి ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. ఏడాది క్రితం పెరూలోనే 200 మంది చిన్నారులను బలి ఇచ్చిన రెండు ప్రాంతాలను కనుగొన్నారు.

వార్తా సంస్థ ఏఎఫ్‌పీతో మాట్లాడిన పురాతత్వవేత్తలు "తాజాగా తవ్వితీసిన పిల్లల మృతదేహాల్లో కొన్నింటికి చర్మం, వెంట్రుకలు ఇప్పటికీ ఉన్నాయని" చెప్పారు.

చిన్నారుల సామూహిక బలుల ప్రాంతం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, చీమూ వారి ఆధ్యాత్మిక వేడుకలలో 'బలి' ఒక భాగం

దేవతలను సంతృప్తి పరచడానికేనా

పిల్లల మృతదేహాలను చూస్తుంటే, వాతావరణం చల్లగా ఉన్న సమయంలో వారిని చంపినట్లు కనిపిస్తోంది.

పిల్లల మృతదేహాల ముఖాలన్నీ సముద్రం వైపు ఉండేలా పూడ్చిపెట్టారు. అంటే చీమూ వారు తమ దేవతలను సంతృప్తి పరచడానికి చిన్నారులను బలి ఇచ్చి ఉండచ్చని భావిస్తున్నారు.

ఇది ఎప్పుడు జరిగింది అనేది మాత్రం తెలీడం లేదు.

చీమూ ప్రజలు పెరూ ఉత్తర తీరమంతటా నివసించేవారు. ఈ ప్రాంతంలోని అత్యంత శక్తివంతమైన నాగరికతల్లో వారిది ఒకటి.

1200-1400 మధ్య ఇక్కడ ఘనంగా జీవించిన చీమూ వారిని ఇంకాస్ ఓడించారు. తర్వాత ఇంకాస్‌పై స్పానిష్ విజయం సాధించారు.

చిన్నారుల సామూహిక బలుల ప్రాంతం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, మరిన్ని మృతదేహాలు దొరకవచ్చని పరిశోధకులు చెబుతున్నారు

తవ్వుతున్న కొద్దీ మృతదేహాలు

చీమూ వారు 'షి విచ్' అనే చంద్ర దేవతను పూజించేవారు. ఇంకాస్ పూజించే సూర్యుడి కంటే తమ దేవతను బలమైనదిగా భావించేవారు.

ఆధ్యాత్మిక ఆచారాల్లో చీమూ భక్తులు తమ దేవుడికి నైవేద్యాలు, మానవ బలులు సమర్పించేవారు.

పిల్లలను బలి ఇచ్చి సామూహిక ఖననం చేసిన ఈ ప్రాంతంలో తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక్కడ మరిన్ని మృతదేహాలు దొరకవచ్చని పురాతత్వ వేత్తలు చెబుతున్నారు.

"చిన్న పిల్లలను ఇలా సామూహిక బలి ఇవ్వడం దారుణం. ఎక్కడ తవ్వినా మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి" అని చీఫ్ ఆర్కియాలజిస్ట్ ఫెరెన్ కాస్టిల్లో ఏఎఫ్‌పీతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)