పాకిస్తాన్ నేషనల్ కమాండ్ అథారిటీ ఏంటి? ఇమ్రాన్ ఖాన్ ఈ మీటింగ్ ఎందుకు పెట్టారు?

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, ISPR

భారత యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్‌లోని జైషే మహమ్మద్ స్థావరాలను టార్గెట్ చేసినట్లు వార్తలు వచ్చిన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

భారత్ దాడుల తర్వాత పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. నేతల సమావేశాలు, ప్రెస్ బ్రీఫింగ్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

భారత ప్రభుత్వం భారత వైమానిక దళ యుద్ధ విమానాలు పాకిస్తాన్‌ లోపల జైషే మహమ్మద్ శిబిరాలను ధ్వంసం చేసిందని చెబుతుంటే, అటు పాకిస్తాన్ మాత్రం తమ వైమానిక దళం భారత యుద్ధ విమానాలను తిప్పికొట్టిందని చెబుతోంది.

భారత్ వైమానిక దాడుల వార్తల తర్వాత పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో భద్రతా సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశం తర్వాత పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ కురేషీ పాకిస్తాన్ సౌర్వభౌమాధికారాన్ని భారత్ ఉల్లంఘించిందని అన్నారు.

భారత్ అనవసర దాడులకు తాము తగిన సమయం, ప్రాంతంలో సమాధానం ఇస్తామని పాకిస్తాన్ చెప్పింది.

ఇప్పుడు అందరూ పాకిస్తాన్ ఏం చేస్తుందా అనేదానిపైనే దృష్టిపెట్టారు.

పాకిస్తాన్ బుధవారం నేషనల్ కమాండ్ అథారిటీ(ఎన్‌సీఏ) సమావేశానికి పిలుపునిచ్చింది. ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది.

ఈ నేపథ్యంలో అసలు ఎన్‌సీఏ అంటే ఏంటి, అది పాక్‌కు అంత కీలకమో తెలుసుకుందాం.

నియంత్రణ రేఖ

ఫొటో సోర్స్, Getty Images

ఎన్‌సీఏ అంటే ఏంటి?

ఇది పాకిస్తాన్ అత్యున్నత స్థాయి సైనిక వేదిక. ఇక్కడ దేశ రక్షణ విధానానికి సంబంధించిన పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. పాకిస్తాన్ అణ్వాయుధాల ప్రయోగంపై కూడా ఎన్‌సీఏ నిర్ణయం తీసుకుంటుంది.

యుద్ధవ్యూహాల విషయంలో కీలకమైన అణు, క్షిపణి సంబంధిత అన్ని పాలసీలపై నిర్ణయం తీసుకునే హయ్యస్ట్ అథారిటీ ఎన్‌సీఏ. దీనితోపాటు అణు, క్షిపణి కార్యక్రమాన్ని అది పర్యవేక్షిస్తుంది.

యుద్ధం జరిగేటపుడు, ఉద్రిక్త పరిస్థితుల్లో ఆర్మీని ఎలా మొహరించాలనేదానిపై ఎన్‌సీఏ నిర్ణయం తీసుకుంటుంది. వీటితోపాటు పాలసీ మేకింగ్, ఆర్మీ ప్రాక్టీస్, మోహరింపు, అనుసంధానం, అభివృద్ధి, పాకిస్తాన్ అణ్వాయుధాల ఆపరేషన్ కంట్రోల్‌కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

ఇందులో రాజకీయ, సైనిక నేతృత్వం రెండూ భాగంగా ఉంటాయి. పాక్ ప్రధాన మంత్రి దీనికి అధ్యక్షుడుగా ఉంటారు. త్రివిధ దళాల చీఫ్, రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి ఇందులో సభ్యులుగా ఉంటారు.

"వైమానిక దాడుల తర్వాత స్పందించిన పాకిస్తాన్ బుధవారం పార్లమెంటు సంయుక్త సమావేశాలు పిలుపునిచ్చినట్లు బీబీసీ ప్రతినిధి షుమాయలా జాఫ్రీ చెప్పారు. దీనితోపాటు నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశానికి కూడా పిలుపునిచ్చారు. ఎన్‌సీఏ సమావేశంలో దాడులపై ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి, భారత్‌కు ఎలాంటి సమాధానం ఇవ్వాలి అనేది పాకిస్తాన్ నిర్ణయిస్తుంది.

పాక్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్

ఫొటో సోర్స్, YOUTUBE

ఫొటో క్యాప్షన్, పాక్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్

ఎన్‌సీఏ సమావేశానికి ఎప్పుడు పిలుపునిస్తారు

సాధారణంగా ఎన్‌సీఏ సమావేశం చాలా అరుదుగా జరుగుతుంది. దేశంలో భద్రత సంబంధిత విషయాలు తలెత్తినపుడు, సరిహద్దు దాటి చొరబాట్లు జరిగినపుడు ఈ సమావేశానికి పిలుపునిస్తారు. ఇది చాలా తీవ్రమైన, అత్యున్నత స్థాయి వేదిక.

2000లో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అణ్వాయుధాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం కోసం ఎన్‌సీఏ సమావేశానికి పిలుపునిచ్చింది.

1999 ఏప్రిల్‌లో అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్‌ అణు మిసైల్ టెక్నాలజీ ఉపయోగించడానికి రెండు నెలల లోపు ఒక సెంట్రల్ కమాండ్ సిస్టమ్ రూపొందిస్తామని చెప్పారు. ఈ సిస్టమ్‌లో నేషనల్ కమాండ్ అథారిటీ, డెవలప్‌మెంటల్ కంట్రోల్ బోర్డ్ గవర్నింగ్ బాడీ, స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ కోసం సెక్రటేరియట్ ఉంటారని ఆయన తెలిపారు.

కానీ సైనిక ఉత్తర్వులు, నియంత్రణతో ఈ కొత్త సంస్థను ఆప్పుడు ఏర్పాటు చేయలేకపోయారు. సైనిక పాలన తర్వాత పర్వేజ్ ముషారఫ్ అధ్యక్షుడు అయ్యాక దీనిని అమలు చేశారు.

2000 ఫిబ్రవరి 2న నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ 'నేషనల్ కమాండ్ అథారిటీ'ని ఏర్పాటు చేసింది. ఇందులో ఎంప్లాయ్‌మెంట్ కంట్రోల్ కమిటీ, డెవెలప్‌మెంట్ కంట్రోల్ కమిటీ, స్ట్రాటజిక్ ఫ్లాస్ డివిజన్స్ ఉంటాయి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)