గుజరాత్ అల్లర్ల కేసు: తీస్తా సెతల్వాద్ను అహ్మదాబాద్కు తరలించిన ఏటీఎస్, అక్కడ ఆమె ఏమన్నారంటే...

ఫొటో సోర్స్, ANI
తీస్తా సెతల్వాద్ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు ఆదివారం అహ్మదాబాద్ నేర విభాగానికి అప్పగించారు.
ముంబయిలో శనివారం మధ్యాహ్నం ఆమెను అదుపులోకి తీసుకున్న తర్వాత మరో కొత్త కేసులో ఆమెను అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్కు తరలించారు.
''అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్కు చెందిన ఒక ఇన్స్పెక్టర్ శనివారం ఆమెపై ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. దీని తర్వాతే ఏటీఎస్ బృందం ముంబయిలో ఆమెను అదుపులోకి తీసుకుందని'' వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఆమెను తొలుత ముంబయిలోని శాంతాక్రుజ్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. తర్వాత గుజరాత్ పోలీసులు, ఆమెను అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అహ్మదాబాద్కు తరలించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆదివారం సివిల్ ఆసుపత్రిలో తీస్తాకు వైద్యపరీక్షలు నిర్వహించారు. తన చేతికి గాయమైందని, దాన్ని వైద్యులు పరీక్షించారని ఆసుపత్రిలో విలేఖరులతో తీస్తా చెప్పారు. తనను మెజిస్ట్రేట్ కోర్టుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత తీస్తా మాట్లాడుతూ... తన అరెస్ట్ చట్ట విరుద్ధమని, తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
మాజీ డీజీపీ అరెస్ట్, మాజీ ఐపీఎస్పై ఎఫ్ఐఆర్
శనివారం తీస్తా సెతల్వాద్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోనే మాజీ ఐపీఎస్ అధికారులు ఆర్బీ శ్రీకుమార్, సంజీవ్ భట్ల పేర్లు కూడా ఉన్నాయి. శనివారమే శ్రీకుమార్ను అరెస్ట్ చేశారు.
సంజయ్ భట్ వేరే కేసులో జైలులోనే ఉన్నారు. ఆయన జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
శనివారం ఉదయం వార్తా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తీస్తా సెతల్వాద్ గురించి ప్రస్తావించారు.
2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల గురించి తీస్తా సెతల్వాద్ నిరాధారమైన విషయాలు చెబుతున్నారని ఇంటర్వ్యూలో అమిత్ షా అన్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
శనివారం ఉదయం 10.07 గంటలకు ఏఎన్ఐ... భారత హోం మంత్రి అమిత్ షా ఇంటర్వ్యూలో 30 సెకండ్ల వీడియోను పోస్ట్ చేసింది.
ఆ వీడియోలో అమిత్ షా, 'తీస్తా సెతల్వాద్ ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సంస్థ (ఎన్జీఓ) బీజేపీ కార్యకర్తల గురించి అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసింది. ఆ ఫిర్యాదులన్నింటినీ వాస్తవాలుగా భావిస్తూ మీడియా నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చింది' అని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, AFP
తీస్తా సెతల్వాద్ ఎవరు?
ముంబయిలో ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్.
గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని నరేంద్ర మోదీకి క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ జాకియా జాఫ్రీ అనే మహిళ న్యాయ పోరాటానికి దిగారు. అహ్మదాబాద్లోని గుల్బర్గ్ సొసైటీలో జరిగిన అల్లర్లలో మరణించిన కాంగ్రెస్ మాజీ ఎంపీ అహ్సన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ.
ఈ న్యాయ పోరాటంలో జాకియాకు తీస్తా సెతల్వాద్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచారు. ఆమె ఈ కేసులో సహ పిటిషనర్ కూడా.

ఫొటో సోర్స్, MANOJ PATIL/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
తాజా పరిణామాలకు కారణాలేంటి?
2002 గుజరాత్ అల్లర్లలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మరో 63 మందికి సిట్, క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను శుక్రవారం సుప్రీం కోర్టు కొట్టివేసింది.
ఈ పిటిషన్ను జాకియా జాఫ్రి దాఖలు చేశారు.
కాంగ్రెస్ మాజీ ఎంపీ అహ్సన్ జాఫ్రీ సహా 69 మంది ఈ అల్లర్లలో చనిపోగా... ఈ కేసులో నరేంద్ర మోదీతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటోన్న 63 మందికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొంటూ సిట్ వారికి క్లీన్ చిట్ ఇచ్చింది. క్లీన్ చిట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ, దీనిపై తిరిగి దర్యాప్తు చేయాలని అహ్సాన్ జాఫ్రీ భార్య జాకియా డిమాండ్ చేశారు.
నరోడా పాటియా, నరోడా గావ్, గుల్బర్గా సొసైటీ వంటి కేసులు ఒక పెద్ద కుట్రలో భాగమని ఆమె ఆరోపించారు. ఈ కుట్రపై దర్యాప్తు చేయాలని కోరుతూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఫొటో సోర్స్, AFP
సుప్రీం కోర్టు ఏం చెప్పింది?
జాకియా పిటిషన్ను విచారించిన జస్టిస్ ఏఎస్ ఖాన్విల్కర్, దినేశ్ మహేశ్వరీ, సీటీ రవికుమార్లతో కూడిన సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ ఈ ఆరోపణలపై వ్యాఖ్యానిస్తూ... ఈ ఘటనలన్నీ ఒక పెద్ద కుట్రలో భాగమని నిరూపించేందుకు తగిన ఆధారాలు లేవని పేర్కొంది.
ఈ మొత్తం వ్యవహారాన్ని ఇతరులు ప్రోత్సహించిన చర్యగా సుప్రీం కోర్టు పరిగణించింది.
ఈ పిటిషన్కు విచారణ యోగ్యత లేదని వ్యాఖ్యానిస్తూ పిటిషన్ను కొట్టివేసింది.
జాకియా జాఫ్రీ ప్రస్తుతం అనారోగ్యంగా ఉన్నారు. సుప్రీం తీర్పు తర్వాత ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆమె కుమారుడు తన్వీర్ జాఫ్రీ ప్రస్తుతం భారత్లో లేరు. కోర్టు నిర్ణయంతో చాలా నిరుత్సాహానికి గురయ్యామని ఆయన మెసేజ్ ద్వారా తెలిపారు. ''కోర్టు తీర్పును మొత్తం చదివిన తర్వాత మాత్రమే దీనిపై మా అభిప్రాయాన్ని తెలపగలం. తీర్పు మొత్తం 450 పేజీలుగా ఉంది. దీనిపై మా స్పందనను వివరంగా తర్వాత తెలియజేస్తాం'' అని ఆయన సందేశంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, NISHRIN JAFRI HUSSAIN FACEBOOK
ఎప్పుడెప్పుడు ఏం జరిగింది...
- 2002 ఫిబ్రవరి 28న, గోధ్రా మారణకాండ జరిగిన రెండోరోజు అహ్మదాబాద్లోని ముస్లింలు మెజారిటీగా ఉన్నగుల్బర్గ్ సొసైటీపై ఒక గుంపు దాడి చేసింది. ఇందులో కాంగ్రెస్ మాజీ ఎంపీ అహ్సాన్ జాఫ్రీతో పాటు 69 మంది మరణించారు.
- గుంపు దాడి నుండి తప్పించుకోవడానికి చాలా మంది ముస్లింలు జాఫ్రీ ఇంట్లో ఆశ్రయం పొందారు. వారిని చుట్టుముట్టిన హింసాత్మక గుంపు, చాలామందిని సజీవ దహనం చేసింది.
- తన భర్త అహ్సాన్ జాఫ్రీ, అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు ఎంపీలు, పోలీసులు, సీనియర్ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించారని, అయితే ఎవరూ ఆయనకు సహాయం చేయలేదని జాకియా జాఫ్రీ ఆరోపించారు.
- నరేంద్ర మోదీతో సహా మొత్తం 63 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని 2006 జూన్లో జాకియా జాఫ్రీ, గుజరాత్ డీజీపీని కోరారు.
- మోదీతో సహా మిగతా అందరూ ఉద్దేశపూర్వకంగానే అల్లర్ల సమయంలో బాధితులను రక్షించడానికి ప్రయత్నించలేదని జాకియా జాఫ్రీ ఆరోపించారు.
- తన విజ్ఞప్తిని డీజీపీ తిరస్కరించడంతో జాకియా జాఫ్రీ, గుజరాత్ హైకోర్టులో అప్పీల్ చేశారు.
- 2007లో కోర్టు, ఆమె అప్పీల్ను తిరస్కరించింది.
- 2008 మార్చిలో జాకియా జాఫ్రీ, సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ అనే సంస్థ సుప్రీంకోర్టులో ఉమ్మడిగా అప్పీలును దాఖలు చేశారు.
- ఈ కేసులో అమికస్ క్యూరీగా ప్రశాంత్ భూషణ్ను సుప్రీంకోర్టు నియమించింది.
- గుజరాత్ అల్లర్లపై విచారణ కోసం అప్పటికే ఏర్పాటైన 'సిట్'ను ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని 2009 ఏప్రిల్లో సుప్రీం కోర్టు ఆదేశించింది.
- 2010 ప్రారంభంలో నరేంద్ర మోదీని సిట్ ప్రశ్నించింది. అదే ఏడాది మే నెలలో తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది.
- 2010 అక్టోబర్లో ఈ కేసు నుంచి ప్రశాంత్ భూషణ్ను తప్పించి ఆయన స్థానంలో రాజు రామచంద్రన్ను సుప్రీంకోర్టు అమికస్ క్యూరీగా నియమించింది.
- 2011 జనవరిలో రాజు రామచంద్రన్ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించారు.
- సిట్ సమర్పించిన సాక్ష్యాలకు, కనుగొన్న విషయాలకు మధ్య సమన్వయం లేనందున దర్యాప్తును కొనసాగించాలని 2011 మార్చిలో సుప్రీంకోర్టు, దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది.
- సాక్షులను, సిట్ అధికారులను కలవాలని 2011 మే నెలలో సుప్రీంకోర్టు, అమికస్ క్యూరీని ఆదేశించింది.
- 2011 సెప్టెంబరులో మోదీపై ఎఫ్ఐఆర్కు సుప్రీం అనుమతించలేదు. ట్రయల్ కోర్టుకు తన నివేదికను సమర్పించాలని సిట్ని ఆదేశించింది.
- ఈ తీర్పును మోదీ, జాకియా జాఫ్రీ ఇద్దరూ తమ విజయంగా పేర్కొన్నారు.
- 2012 ఫిబ్రవరి 8న కేసు ముగింపు కోసం సిట్ ఒక నివేదికను సమర్పించింది. దీనికి వ్యతిరేకంగా 2013 ఏప్రిల్ 15న జాకియా జాఫ్రీ అప్పీల్ చేశారు.
- జాకియా జాఫ్రీ, సిట్ న్యాయవాదుల మధ్య అయిదు నెలల పాటు వాదన జరిగింది.
- 2013 డిసెంబర్లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర అధికారులకు మెట్రోపాలిటన్ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి:
- అనంతపురం: 'మా అమ్మే కిరాయి హంతకులతో నా భర్తను చంపించింది' - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- అమెరికా: అబార్షన్ హక్కును రద్దు చేసిన రోజున ఓ క్లినిక్లో వాతావరణం ఎలా ఉందంటే...
- అగ్నిపథ్: సైన్యంలో ఉద్యోగాల కోసం పుట్టుకొచ్చిన కోచింగ్ సెంటర్లు, విద్యార్థుల కలలు కల్లలేనా
- ఎమర్జెన్సీ: ‘అక్రమ నిర్బంధానికి బలైన’ స్నేహలతారెడ్డి జైలు డైరీ
- రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్నవారికి, తీసుకోని వారికి కరోనావైరస్ లక్షణాలలో ప్రధాన తేడా అదే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)












