ఇటలీ నుంచి ఇండియా వచ్చిన విమానంలోని ప్రయాణికులలో మళ్లీ పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు

AMRISTAR AIRPORT

ఫొటో సోర్స్, AMRISTAR AIRPORT

ఇటలీ నుంచి భారత్ వచ్చిన మరో విమానంలోని ప్రయాణికుల్లోనూ పెద్ద సంఖ్యలో కరోనా సోకినవారు ఉన్నారని అధికారులు వెల్లడించారు.

రోమ్ నుంచి శుక్రవారం అమృత్‌సర్ వచ్చిన ఓ విమానంలో 285 మంది ప్రయాణికులు ఉండగా వారిలో 173 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది.

ఇంతకుముందు బుధవారం మిలన్ నుంచి భారత్ వచ్చిన విమానంలో 100 మందికి పైగా ప్రయాణికులు కరోనా బారిన పడ్డారు.

గురువారం ఇటలీలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు 2,20,000కు పైగా నమోదయ్యాయి.

భారత్‌లో శుక్రవారం లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగానే కేసులు శరవేగంగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇటలీ నుంచి వచ్చిన విమానాలలో పెద్దసంఖ్యలో కేసులు బయటపడిన పంజాబ్ రాష్ట్రంలో ఇప్పటికే కోవిడ్ ఆంక్షలున్నాయి. అక్కడ నైట్ కర్ఫ్యూ విధిస్తూ గత మంగళవారమే ఆదేశాలు జారీ చేశారు.

పాఠశాలలు, కాలేజీలు మూసివేశారు.

రోమ్ నుంచి వచ్చినవారిలో కరోనా పాజిటివ్‌గా తేలిన ప్రయాణికులను వారివారి సొంత జిల్లాల్లో ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌కు తరలించారు.

అంతకుముందు మిలన్ నుంచి వచ్చిన వారిలో కరోనాపాజిటివ్‌గా నిర్ధరణైన ప్రయాణికులను ఆసుపత్రులలో చేర్చారు.

అయితే, మిలన్ నుంచి వచ్చినవారిలో 13 మందికిపైగా క్వారంటైన్ నుంచి తప్పించుకున్నారని, వారిపై కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

కరోనా కారణంగా భారత్‌లో ఇంతవరకు మొత్తంగా 3.5 కోట్ల మందికిపైగా కరోనావైరస్ బారినపడగా 4,83,000 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)