నీటి పైపుల్లో నోట్ల కట్టలు, అవాక్కయిన అధికారులు - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, ANI Video Grab
కర్ణాటకలో ఒక ప్రభుత్వ అధికారి ఇంట్లోని నీటి పైపుల్లో నోట్ల కట్టలు దాచినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అనుమానం రాకుండా ప్రభుత్వ ఉద్యోగులు తమ అక్రమార్జనను దాచుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు.
కల్బుర్గిలోని ఓ అధికారి తన ఇంటి నీటిపైపుల్లో నోట్ల కట్టలు దాచడం చూసిన ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. ఆ అధికారి ఇంటి నుంచి మొత్తం 54 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో దాదాపు 13 లక్షలు వాటర్ పైపులో దొరికాయి.
బెంగళూరు, బెళగావితోపాటు పలు జిల్లాల్లో ఏకకాలంలో 60 చోట్ల 15మంది అధికారులకు చెందిన నివాసాలపై బుధవారం దాడులు నిర్వహించి కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బంగారం, వెండి ఆభరణాలతోపాటు నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కలబుర్గి జిల్లా జీవర్గి ప్రజాపనులశాఖ జేఈ శాంతగౌడ బిరాదార్ నివాసంలో పలుచోట్ల ఏర్పాటుచేసిన నీటి పైపుల్లో నగదు భద్రపరిచినట్టు గుర్తించారు.
బెంగళూరులో కేఏఎస్ అధికారి నాగరాజ్, యలహంక ప్రభుత్వ ఆసుపత్రి ఫిజియో థెరపిస్ట్ రాజశేఖర్, బీబీఎంపీ అధికారులు గిరి, మాయణ్ణ నివాసాలపైనా దాడులు నిర్వహించారు.
480 మందికిపైగా అధికారులు, సిబ్బంది దాడుల్లో పాల్గొన్నట్టు తెలిసిందని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఫొటో సోర్స్, FB/Perni Nani
నాలుగు షోలు మినహా అన్నీ దొంగ ఆటలే
ఏపీ సినిమాల(క్రమబద్ధీకరణ) చట్టం అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత మాట్లాడిన మంత్రి పేర్ని నాని ఏపీలో ఇక రోజుకు నాలుగు షోలకే అనుమతి ఉంటుందని చెప్పారని ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
స్వచ్ఛంద సేవా సంస్థలు, సమాజహితం కోసం పనిచేస్తున్న సంస్థలకే బెనిఫిట్ షోలకు అనుమతి ఉందని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.
ఏదైనా స్వచ్ఛంద సంస్థ థియేటర్ యాజమాన్యాన్ని సంప్రదించి బెనిఫిట్ షో కోసం జిల్లా జేసీకి దరఖాస్తు చేసుకుంటే అనుమతిస్తారని తెలిపారు.
సినిమాటోగ్రఫీ చట్టం వచ్చినప్పటి నుంచి రోజుకు నాలుగు షోలకే అనుమతి ఉందని, అవి కాకుండా మిగతావన్నీ దొంగ ఆటలేనన్నారని ఈనాడు చెప్పింది.
తామేమీ కొత్తగా అదనపు షోలను నిషేధించడం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు మ్యాచ్ఫిక్సింగ్ చేసి ఇలాంటి ఆటలు కొనసాగించారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ సినిమాల (క్రమబద్ధీకరణ) చట్టానికి సవరణ బిల్లును శాసనసభ బుధవారం ఆమోదించింది. ఈ సందర్భంగా శాసనసభలో, ఆ తర్వాత సచివాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ మంత్రి పేర్ని నాని పలు వ్యాఖ్యలు చేశారు.
'తమకు ఎదురు ఉండకూడదు, ఏం చేసినా అంతా అనుకూలంగా ఉండాలి, చట్టాలు తమను ఆపలేవనే రీతిలో సినిమా పరిశ్రమలో కొందరి పోకడలు ఉన్నాయి. సినిమాపై పేద, మధ్యతరగతి వర్గాల బలహీనతను ఎక్కువమంది సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రోజుకు 6-8 ఆటలు వేసి, ఇష్టారాజ్యంగా టికెట్కు రూ.300 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు' అని మంత్రి అన్నట్లు ఈనాడు వివరించింది.

ఫొటో సోర్స్, SKN (Sreenivasa Kumar)
శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమం
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సాక్షి దిన పత్రిక వార్త ప్రచురించింది.
కరోనా బారిన పడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉంది.
ఇటీవలే ఆయనకు కరోనా సోకగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే రోజురోజుకీ ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సమాచారం.
ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఆయన చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని, తమ దగ్గర అంత డబ్బు లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నామని ఆయన కుటుంబ సభ్యులు ట్వీట్ చేశారు.
శివ శంకర్ మాస్టర్ తెలుగు, తమిళ భాషల్లోని పలు పాటలకు కొరియోగ్రఫీ చేశారు. నాలుగుసార్లు తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నారు.
మగధీర సినిమాలో ధీర.. ధీర.. ధీర.. పాటకుగానూ 2011లో ఆయనకు జాతీయ పురస్కారం లభించింది.
డ్యాన్స్ మాస్టర్గానే కాకుండా సుమారు 30 చిత్రాల్లో నటుడిగానూ అలరించారు. అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమైన డ్యాన్స్ షోలకు జడ్జ్గానూ వ్యవహరించారు.

ఫొటో సోర్స్, FB/Gautam Gambhir
మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్కు బెదిరింపులు
గౌతం గంభీర్కు ఐసిస్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు నమస్తే తెలంగాణ దిన పత్రిక వార్త ప్రచురించింది.
మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్కు ఐఎస్ఐఎస్ కశ్మీర్ నుంచి రెండు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి.
దీంతో ఢిల్లీలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు భద్రతను పెంచారు.
గంభీర్ను ఆయన కుటుంబ సభ్యులను చంపుతామంటూ ఐఎస్ఐఎస్ కశ్మీర్ సంస్థ నుంచి మంగళవారం రాత్రి తొలి మెయిల్ వచ్చింది.
అనంతరం బుధవారం మరో మెయిల్ వచ్చింది. 'నిన్ను చంపాలనుకున్నాం. నిన్న బతికిపోయావ్. బతుకుమీద ఆశ ఉంటే రాజకీయాలను, కశ్మీర్ అంశాన్ని వదిలెయ్' అని మెయిల్లో బెదిరించారు.
గంభీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని నమస్తే తెలంగాణ చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- ఉద్యోగుల జీతాలను సంస్థలు రహస్యంగా ఎందుకు ఉంచుతాయి?
- అభినందన్ వర్థమాన్కు వీర్ చక్ర అవార్డు ఇవ్వడంపై పాకిస్తాన్ ఏమందంటే..
- ఆరంకెల జీతాలతో ఆకర్షిస్తున్న డేటా సైంటిస్ట్ ఉద్యోగాలు
- ఒత్తిడి తట్టుకోవడానికి గంజాయిని ఆశ్రయిస్తున్న అమ్మలు, ఇది ఆరోగ్యానికి ప్రమాదం కాదా
- ఘాతక్ డ్రోన్ : పాకిస్తాన్, చైనాల నుంచి ఎదురయ్యే ముప్పును ఇది తప్పిస్తుందా
- ‘‘మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు ఓ పెద్ద ఎత్తుగడ.. ఇదీ తెరవెనుక కథ’’
- చంద్రుడి నుంచి కొంత భాగం విరిగిపోయిందా? భూమికి సమీపంలో తిరుగుతున్న ఈ శకలం ఏమిటి
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: లాజిస్టిక్స్ సూచీలో తెలుగు రాష్ట్రాల ర్యాంకులు ఎందుకు దిగజారాయి?
- సీఏఏ, ఎన్ఆర్సీ విషయంలో కూడా మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా
- పేటీఎం షేర్ ధర మొదటిరోజునే ఎందుకు కుప్పకూలింది... ఈ ఐపీఓ నేర్పే పాఠాలేంటి?
- కడప జిల్లాలో వరదలు: ‘మా కళ్లెదుటే కొందరు కొట్టుకుపోయారు.. మా బంధువుల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









