టీటీడీ ఆస్తుల విక్రయం: ‘‘ప్రతిపాదనను పున:పరిశీలించండి.. అప్పటివరకూ అమ్మకాలు ఆపేయండి'' - ఏపీ ప్రభుత్వం ఆదేశం

తిరుమల

ఫొటో సోర్స్, facebook

భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విక్రయం అంశాన్ని పున:పరిశీలించాలని, వివిధ వర్గాల వారితో సంప్రదింపులు జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశించింది. అప్పటివరకూ ఆస్తుల విక్రయ ప్రతిపాదనను నిలిపివేయాలని ఆదేశించింది.

ఈమేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పేరుతో సోమవారం సాయంత్రం ఉత్తర్వులు (జీఓ ఆర్‌టీ నంబర్ 888) జారీ చేసింది.

''గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన (టీటీడీ) ట్రస్టు బోర్డు 50 ఆస్తులను విక్రయించటానికి 2016 జనవరి 30వ తేదీన తీర్మానం చేసినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని.. ఈ అంశాన్ని పున:పరిశీలించాల్సిందిగా టీటీడీకి ప్రభుత్వం నిర్దేశిస్తోంది'' అని ఆ ఉత్తర్వులో పేర్కొంది.

ఈ ఆస్తులను ఆలయాల నిర్మాణాలకు, ధర్మ ప్రచారానికి, ఇతర మత కార్యక్రమాలకు ఉపయోగించుకోవచ్చా అనేది నిర్ధారించటానికి మత పెద్దలు, అభిప్రాయ నిర్మాతలు, భక్తుల వర్గం తదితర వేర్వేరు భాగస్వాములతో సంప్రదింపులు జరపాలని సూచించింది.

ఈ విషయం ఒక కొలిక్కి వచ్చేవరకూ.. టీటీడీ 50 ఆస్తులను విక్రయించాలన్న ప్రతిపాదనను పక్కనపెట్టాలని.. దీనికి సంబంధించి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అవసరమైన చర్యలు చేపట్టి తక్షణమే అమలు నివేదికను సమర్పించాలని నిర్దేశించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)