కరోనావైరస్ - ఉత్తరాంధ్ర: విశాఖలో టెన్షన్... వైరస్ అంటని విజయనగరం, శ్రీకాకుళం

ఫొటో సోర్స్, getty images
- రచయిత, విజయ్ గజం
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్లో ఆదివారం సాయంత్రానికి మొత్తం 420 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 12 మంది వైరస్ నుంచి కొలుకొని డిశ్చార్జ్ అవ్వగా, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 388 మంది ఆస్పత్రిలో ఐసొలేషన్లో ఉన్నారు.
రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో కరోనా కేసుల పరిస్థితి ఒక్కోలా ఉంది. ఉత్తరాంధ్రలో పరిస్ధితి మరీ భిన్నంగా ఉంది.
విశాఖపట్నంలో 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో, నగరంలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. కానీ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మాత్రం ప్రస్తుతం అత్యంత సురక్షితంగా కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా రాష్ట్రంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాని జిల్లాలు ఈ రెండే.
మార్చి 20న విశాఖపట్నంలో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. మార్చి 27 వరకు కేవలం 4 కేసులే రికార్డయ్యాయి. కానీ, ఏప్రిల్ మొదటి వారానికి ఆ సంఖ్య 20కి పెరిగింది. గ్రామీణ ప్రాంతాలకు కూడా వైరస్ కేసులు విస్తరించాయి. పద్మనాభం మండలంలోని వెంకటాపురం గ్రామంలో లండన్ నుంచి వచ్చిన ఓ యువకుడి కుటుంబానికి వైరస్ సోకింది. నర్సీపట్నంలో తమిళనాడు నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకింది. దీంతో క్రమంగా విశాఖలో ఆందోళన పెరగసాగింది.

తబ్లీగీ జమాత్ తరువాత...
ఇటీవల దిల్లీలో జరిగిన తబ్లీగీ జమాత్లో పాల్గొన్నవారిలో కొందరు విశాఖ వాసులూ ఉన్నారు. ఆ సమయంలో దిల్లీ వెళ్లి తిరిగొచ్చిన 20 మందిని అధికారులు గుర్తించారు. ఆ పైన వారు కలిసిన మరో 42 మందిని కూడా పట్టుకొని పరీక్షలు జరిపించారు. అలా మొత్తం పాజిటివ్ కేసులు 20కి చేరగా, మరో 173 మందిని ఐసొలేషన్లో ఉంచారు. ఛాతీ ఆసుపత్రిలో మరో 163 మంది అనుమానితులు ఉన్నారు. విశాఖ జిల్లాలో ప్రస్తుతం 66 క్వారంటైన్ కేంద్రాలు, వాటిలో 9307 పడకలు, 500 మందికి సరిపడా ఐసోలేషన్ వార్డులూ సిద్ధంగా ఉన్నాయి.
విశాఖ నగరంలో పాజిటివ్ కేసులు నమోదైన అల్లిపురం, ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని శాంతి నగరం, తాటిచెట్లపాలెం, పూర్ణ మార్కెట్, గాజువాక ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. వీటికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న మరో నాలుగు వార్డులను కూడా రెడ్ జోన్ పరిధిలోకి తెచ్చారు. నర్సీపట్నంలో కరోనా పాజిటివ్ కేసు బయటపడటంతో దాన్ని కూడా రెడ్ జోన్గా పరిగణిస్తున్నారు.
రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ఇళ్ల చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో నివాసాలు, రహదారులు, విద్యుత్ స్తంభాలపై హైపోక్లోరినేట్ ద్రావణం పిచికారీ చేశారు. ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా, అక్కడి వారు బయటకు రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.
మరోపక్క విశాఖ జిల్లాను కరోనావైరస్ హాట్ స్పాట్గా కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. పాజిటివ్ కేసులున్న చోటుకు మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. ఇలాంటివి విశాఖలో 7 ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాలను పూర్తిగా మూసివేసి ప్రభుత్వమే నిత్యావసరాలను ఇళ్లకు చేరవేస్తోంది.
జీవీఎంసీ అధికారులు నగరంలో 60 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జీవీఎంసీ పరిధిలో లాక్ డౌన్ను పక్కాగా అమలు అయ్యేలా చూడటం, ప్రజలు భౌతిక దూరం పాటించేలా చెయ్యడం, కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తులను గుర్తించి, వారిని ఆస్పత్రులకు తరలించడం వంటి బాధ్యతలను ఆయా బృందాలు చూస్తాయి. ఒక్కో బృందంలో వైద్యుడితో పాటు ఆరోగ్యశాఖ కార్యకర్త, వాహన డ్రైవర్, టౌన్ ప్లానింగ్ నుంచి ఒకరు ఉంటారు.

కోవిడ్ ‘ప్రత్యేక’ ఆస్పత్రులు
ప్రస్తుతం విశాఖలో 23 షెల్టర్ హోమ్స్ ఉన్నాయని, వీటిలో 2 వేల మంది పేదలు ఉంటున్నట్లు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ బీబీసీతో చెప్పారు.
‘‘జిల్లాకు ఇటీవల 3117 మంది విదేశాల నుంచి వచ్చారు. వారిని ఇప్పటికే క్వారంటైన్కు పంపించాం. దిల్లీ సభలకు వెళ్లి వచ్చిన వారితో పాటుగా వారితో ప్రయాణం చేసిన, కాంటాక్ట్ అయిన మరో 62 మందిని గుర్తించి క్వారంటైన్కు పంపాం. వీరిలో 15 మందికి పాజిటివ్ రావడంతో వారికి చికిత్స అందిస్తున్నారు. స్టేట్ కోవిడ్ హాస్పిటల్గా విశాఖలోని విమ్స్ ఉంది. అక్కడ 500 పడకలను సిద్ధం చేశాం.
జిల్లా కోవిడ్ ఆస్పత్రులు చోడవరం, మాడుగుల, యలమంచిలి, పాడేరు, నర్సీపట్నంలో ఉన్నాయి. నగరంలో గీతం, రామ్ నగర్ అపోలో, కేర్, ఎన్టీఆర్, గాయత్రి ఆస్పత్రుల్లో 2700 మందికి సరిపడా ఐసోలేషన్ బెడ్లు ఏర్పాటు చేశాం. మరికొన్ని ఆస్పత్రుల్లో, రుషికొండ బీచ్ రిసార్టుల్లో కరోనా కేంద్రాలను ఏర్పాటు చేశాం.
ఇవి కాకుండా చెస్ట్ హాస్పిటల్, రుషి కొండ బీచ్ రిసార్టుల్లో కరోనా సెంటర్లు ఏర్పాటు చేశాం. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది అనారోగ్యం పాలైతే, వారికి చికిత్స అందించేందుకు పినాకిల్ ఆస్పత్రిని కేటాయించాం’’ అన్నారు వినయ్ చంద్.

- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?

ప్రస్తుతం విశాఖ నగరంలో ఉన్న ఒక్క టెస్టింగ్ ల్యాబ్లో రోజుకు 60 నుంచి 100 మందికి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ‘‘జిల్లాలో 12 వేల పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయి. 18వేల ఎన్ 95 మాస్కులు, 4 లక్షల జతల గ్లౌజులు, దాదాపు 40 వేల లీటర్ల శానిటైజర్ అందుబాటులో ఉంది.
ఆంధ్రా మెడికల్ కాలేజీ పరిధిలోని 1000 మంది డాక్టర్లు చికిత్స కోసం అందుబాటులో ఉన్నారు. వీరిని నాలుగు భాగాలుగా విభజించాం. ఒక విభాగం ఎప్పుడూ సెలవులో ఉంటుంది. ఒక బృందం రిలీవ్ అవగానే మరో బృందం అందుబాటులో ఉంటుంది’’ అని ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొ.డాక్టర్ సుధాకర్ తెలిపారు.
కాంటాక్ట్ కేసులు పెరగకుండా చూడటంపైనే ప్రస్తుతం అధికారులు దృష్టిపెట్టారు. కొందరిలో 21 రోజులకు కూడా కరోనా లక్షణాలు కనిపిస్తూండడంతో 14 రోజుల క్వారంటైన్ పూర్తయినా, మరో 14 రోజులపాటు ఇతరులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోపక్క విశాఖపట్నం మెడ్టెక్ జోన్లో వెంటిలేటర్లు, పీపీఈల ఉత్పత్తిని కూడా ఇప్పటికే మొదలుపెట్టారు.

శ్రీకాకుళం, విజయనగరం.. కరోనా ఫ్రీ
ఇప్పటి వరకూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రం మొత్తంలో కేసుల లేని జిల్లాలు ఈ రెండే. అయినప్పటికీ ఈ ప్రాంతాల్లో కూడా అన్ని జాగ్రత్తలూ కట్టుదిట్టంగా పాటిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ క్యూఆర్ కోడ్ కేటాయించారు. వారిలో ప్రతి 10 మందికీ ఒక కోవిడ్ అధికారిని నియమించారు. వారిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటోంది. ఒకవేళ కేసులు వస్తే ఎలా ఎదుర్కోవాలి? రోగులను తీసుకురావడం, ఆస్పత్రికి షిప్ట్ చేయడం, వారి చికిత్స తదితర అంశాలపై పర్యవేక్షకులకు శిక్షణ ఇస్తున్నారు.
విజయనగరంలో కూడా ముందు జాగ్రత్తలు తీసుకుంటూనే, లాక్ డౌన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. మండల స్థాయిలో ఆరోగ్య బృందాలను ఏర్పాటు చేశారు. ఉపాధి కోల్పోయిన పేదలు, కూలీలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో ఇరుక్కుపోయిన వారు, బిచ్చగాళ్లు లాంటి వాళ్లకి వసతి కోసం ప్రత్యేక గృహాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 35 ఉపశమన కేంద్రాల ద్వారా నిత్యం భోజనం అందిస్తున్నారు. వీటిలో ప్రభుత్వం 18, స్వచ్ఛంద సంస్థలు 17 నడుపుతున్నాయి.

కరోనావైరస్ హెల్ప్లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- ‘నేను చనిపోయినా ఫరవాలేదు.. ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదని చైనాలోనే ఉండిపోయాను’
- కరోనావైరస్: ప్రపంచ చరిత్రను మార్చేసిన అయిదు మహమ్మారులు
- ఆరోగ్య సేతు: ప్రభుత్వాలు అందిస్తున్న యాప్లు సురక్షితమేనా, రాబోయే రోజుల్లో వాటితో ప్రమాదం ఉందా?
- కరోనావైరస్ గురించి ఈ సినిమా 10 ఏళ్ల కిందే చెప్పిందా?
- కరోనావైరస్ మహమ్మారిని తెచ్చింది పేదలు కాదు... సంపన్నులే - అభిప్రాయం
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- కరోనావైరస్: పరీక్షలు ఎలా చేస్తారు? ఎందుకు ఎక్కువ సంఖ్యలో చేయలేకపోతున్నాం?
- హ్యాండ్ శానిటైజర్లకు ఎందుకింత కొరత?
- కరోనావైరస్: 'లాక్డౌన్లో హింసించే భర్తతో చిక్కుకుపోయాను'
- కరోనావైరస్: అమెరికా చేసిన తప్పులేంటి... ఒప్పులేంటి?
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








