తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా మంత్రి సబిత ఇంద్రారెడ్డి.. క్యాబినెట్‌లోకి తిరిగొచ్చిన కేటీఆర్, హరీశ్ రావు

సబిత ఇంద్రారెడ్డి

ఫొటో సోర్స్, facebook/KalvakuntlaChandrashekarRao

ఫొటో క్యాప్షన్, సబిత ఇంద్రారెడ్డి

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ఈ రోజు జరిగింది. గవర్నర్‌గా ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన తమిళిసై సౌందరరాజన్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

తన్నీరు హరీశ్ రావు, కేటీఆర్, సబిత ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

గతేడాది డిసెంబర్‌లో తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీలు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు మంత్రివర్గం లేకుండానే పాలన సాగింది.

తొలివిడత మంత్రివర్గ విస్తరణలో మొత్తం 10 మందికి అవకాశం ఇచ్చారు. కేటీఆర్, హరీశ్ రావు వంటి వారికి చోటు లభించలేదు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ఏర్పడిన ప్రభుత్వంలో వీరు మంత్రి పదవులు నిర్వహించడం, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరికి మంత్రి పదవులు ఇవ్వకపోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.

ఈరోజు జరిగిన మంత్రివర్గ రెండో విస్తరణలో కేటీఆర్, హరీశ్ రావులకు చోటు కల్పించారు. వీరిద్దరితో పాటు కాంగ్రెస్ పార్టీలో గెలిచి, టీఆర్ఎస్‌లో చేరిన సబితా ఇంద్రారెడ్డికి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌లకు అవకాశం కల్పించారు.

ఇప్పటి వరకూ మంత్రివర్గంలో 12 మంది ఉండగా, ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురితో కలిపి తెలంగాణలో మంత్రుల సంఖ్య 18కి చేరింది.

గవర్నర్ తమిళిసైతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రివర్గ సభ్యులు

ఫొటో సోర్స్, Govt of Telangana

ఫొటో క్యాప్షన్, గవర్నర్ తమిళిసైతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రివర్గ సభ్యులు

రాష్ట్ర తొలి మహిళా మంత్రి సబిత

తొలివిడత ప్రభుత్వంలో కేసీఆర్ మహిళా మంత్రులకు స్థానం కల్పించకపోవటంపై రాజకీయంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజా మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు మహిళలకు కేసీఆర్ స్థానం కల్పించారు. వీరిలో తొలుత సబితా ఇంద్రారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తద్వారా తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా మంత్రి ఆమె అయ్యారు. ఆ తర్వాత సత్యవతి రాథోడ్ రెండో మహిళా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

హరీశ్ రావుకు ఆర్థిక శాఖ

ముఖ్యమంత్రి కేసీఆర్.. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయించారు. హరీశ్ రావుకు ఆర్థిక శాఖ, కేటీఆర్‌కు మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖలు, సబితా ఇంద్రారెడ్డికి విద్యా శాఖ, గంగుల కమలాకర్‌కు బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖలు, సత్యవతి రాథోడ్‌కు గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖలు, పువ్వాడ అజయ్ కుమార్‌కు రవాణా శాఖ కేటాయించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)